నాగర్కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఇద్దరి ప్రాణాలను బలితీసుకోగా మరికొందరి పరిస్థితి విషమంగా ఉంది. అమ్రాబాద్ మండలం దోమలపెట సమీపంలో ఆర్టీసీ బస్సును ఒక కారు వేగంగా ఢీకొట్టింది. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకుని తిరిగి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఉన్న ప్రయాణికులంతా హైదరాబాద్ నివాసితులుగా గుర్తించారు.
శ్రీశైలం ఘాట్ రోడ్డులో ప్రయాణం ప్రాణాంతకంగా మారింది. దోమలపెట సమీపంలో ఆర్టీసీ బస్సును కారు బలంగా ఢీకొట్టడంతో కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయ్యింది. ప్రమాద సమయంలో బస్సు డ్రైవర్ ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో బస్సు అద్దాలు పగిలిపోయాయి. ఈ క్రమంలో బస్సులో ఉన్న ఒక మహిళ కిటికీ గుండా బయట పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కారు నడుపుతున్న వ్యక్తి స్టీరింగ్ చక్రం మధ్యలో ఇరుక్కుపోయి బయటకు రాలేక దాదాపు గంటసేపు నరకయాతన అనుభవించాడు. స్థానికులు పోలీసులు తీవ్రంగా శ్రమించి అతడిని బయటకు తీశారు.
కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా మారడంతో వారిని అంబులెన్స్లో అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. దీంతో ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. బాధితులకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం వారిని హైదరాబాద్కు తరలించారు. కారు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు తెలుపుతున్నారు. మల్లన్న దర్శనం చేసుకుని సంతోషంగా ఇంటికి వెళ్తున్న క్రమంలో జరిగిన ఈ సంఘటన బాధితుల కుటుంబాల్లో తీరని శోకాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: రాష్ట్రంలో ఈదురుగాలులతో భారీ వర్షం.. తడిసిన ధాన్యం, నేలకొరిగిన భారీ చెట్లు