Paddy Exploitation: స్వేచ్ఛ బ్యూరో: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసుకొని వస్తున్న అన్నదాతకు మిల్లుల వద్ద చుక్కలు కనిపిస్తున్నాయి. అడుగడుగునా దోపిడీ చేస్తున్నారు. వెరసి రైతన్న కన్నీరు పెడుతున్నాడు. ప్రభుత్వం మద్దతు ధర ప్రకటిస్తున్నప్పటికీ ధాన్యం అమ్ముకోవడానికి తిప్పలు తప్పడం లేదు. ఆ మద్దతు ధర అంతా మధ్యలోనే అయిపోతుంది. మిల్లర్లు పెడుతున్న నిబంధనలు, హమాలీలు చేస్తున్న వసూళ్లతో సామాన్య రైతు నిలువునా మునిగిపోతున్నాడు.
రాష్ట్రంలో 8575 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. అయితే కొనుగోలు కేంద్రాల దగ్గర నుంచి మిల్లుల్లో ధాన్యం దిగుమతి అయ్యేవరకు రైతులు చుక్కలు చూస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఒకవైపు లారీలు రాక, మరోవైపు తాలుపేరుతో మిల్లుకు వెళ్లిన ప్రతి ధాన్యం బస్తాపై కనీసం 2 కిలోల కోత విధిస్తున్నారు. ఇలామొదలయ్యే ఈ దోపిడీ, మట్టి ఉందనో, గింజ గట్టిగా లేదనో రకరకాల కారణాలతో కొనసాగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 40 కిలోల బస్తాకు అదనంగా కోత విధించకూడదు. కానీ, మిల్లర్లు మాత్రం తమదే రాజ్యమన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్కో బస్తాకు 2 కిలోల చొప్పున వేల క్వింటాళ్లపై రైతులు భారీగా నష్టపోతున్నారు. ఈ అక్రమ తరుగు మిల్లర్ల పాలిట కామధేనువుగా మారుతోంది. రైతుల పాలిట శాపమవుతోంది.
ధాన్యం దించుకోవడంలో హమాలీలు చేస్తున్న ‘ఆటలు’ వర్ణనాతీతం. లోడింగ్, అన్లోడింగ్ పేరుతో ప్రభుత్వం చెల్లించాల్సిన చార్జీలను కూడా రైతుల నుంచే వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. “అడిగితే దించం.. ఎక్కడైనా చెప్పుకో” అంటూ హమాలీలు మొండికేస్తుండటంతో, గత్యంతరం లేక రైతు తన జేబు నుంచే అదనపు సొమ్ము చెల్లించాల్సి వస్తోంది. బస్తాకు 18 నుంచి 20 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం.
Also read: గద్వాల్లో బెల్ట్ షాపుల జోరు యువత బేజారు.. పట్టించుకోని అధికారులు
“మా ధాన్యం బాగుంది కదా.. ఎందుకు కోత విధిస్తున్నారు?” అని ప్రశ్నించే రైతుపై మిల్లర్లు ప్రతాపం చూపుతున్నారు. నిలదీసిన రైతు ధాన్యాన్ని అన్లోడ్ చేయకుండా గంటల తరబడి, కొన్నిసార్లు రోజుల తరబడి మిల్లుల ముందే లారీలను ఆపేస్తున్నారు. “మా ఇష్టం ఉంటేనే తీసుకుంటాం.. లేదంటే అవసరం లేదు” అంటూ నిర్మొహమాటంగా గేటు బయటే పంపిస్తున్నారు. దీంతో అటు లారీ అద్దెలు భరించలేక, ఇటు పంట పాడైపోతుందనే భయంతో రైతు తలవంచి మిల్లర్లు చెప్పినట్లు చేయాల్సి వస్తోంది. ఇదేఅదునుగా భావిస్తున్న మిల్లర్లు క్వింటాకు నాలుగు కిలోల వరకు కోత విధిస్తున్నట్లు సమాచారం.
క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన పౌర సరఫరాల శాఖ, రెవెన్యూ అధికారులు మిల్లర్ల వైపు మొగ్గు చూపుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రైతు ఫిర్యాదు చేసినా ‘తనిఖీ చేస్తాం’ అనే మాట తప్ప, చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు అని క్షేత్రస్థాయిలో పరిశీలిస్తేనే అర్థమవుతోంది. గతంలో అధికారులు ఫిర్యాదు అందగానే రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో పరిశీలన చేసేవారు. రైతుకు అండగా నిలబడేవారు. కానీ ఇప్పుడు రివర్స్ అయిందని రైతులే ఆరోపిస్తున్నారు. అధికారుల మౌనం మిల్లర్లకు వరంగా మారింది. క్షేత్రస్థాయిలో నిరంతర పర్యవేక్షణ లేకపోవడమే మిల్లర్ల ఇష్టారాజ్యానికి కారణమని సంఘాలు మండిపడుతున్నాయి.
ప్రతి సీజన్ లో ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లులకు కేటాయిస్తుంది. వాటి నుంచి బియ్యంను తీసుకుంటుంది. అందుకు ప్రభుత్వం వారికి కిలోల చొప్పున చెల్లిస్తుంది. అయితే నిర్ణీత సమయంలో సీఎంఆర్ ఇవ్వాలని గడువు పెడుతుంది. అయినప్పటికీ కొన్ని మిల్లులు ఇవ్వకపోవడంతో ధాన్యం స్టాక్ మిల్లుల వద్దే ఉంటుంది. మళ్లీ సీజన్ వచ్చేసరికి ఆ మిల్లుకు స్థలం లేకపోవడంతో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంను దిగుమతి చేసుకోవడంలో జాప్యం జరుగుతుంది. అయితే ఆ శాఖ అధికారులే మిల్లర్లకు వంతపాడుతుండటంతోనే ఈ పరిస్థితికి కారణమే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే అదునుగా భావించిన మిల్లర్లు తాలు, ఇతర కారణాలు చూపుతూ కోత పెడుతున్నారని రైతులే పేర్కొంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, మిల్లుల వద్ద తనిఖీలు చేపట్టాలని, తరుగు పేరుతో జరుగుతున్న దోపిడీని అరికట్టి, అన్నదాతకు భరోసా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదిశగా అధికారులు చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.
Also read: చిట్టీల పేర భారీ మోసం.. కోటీ 50లక్షలు వసూలు చేసి పరారైన దంపతులు!