JanaSena Membership 2026: జనసేన పార్టీ బలోపేతమే లక్ష్యంగా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదివారం ఉదయం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ‘క్రియాశీలక సభ్యత్వ నమోదు’ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ సభ్యత్వ నమోదు కోసం ఆయన స్వయంగా రూ. 2 కోట్ల విరాళాన్ని అందజేసి, తొలి సభ్యత్వాన్ని స్వీకరించారు. పార్టీ కేడర్ను మరింత క్రమశిక్షణతో కూడిన సైన్యంగా తీర్చిదిద్దేందుకు పవన్ కళ్యాణ్ ఈసారి సభ్యత్వానికి కొత్త నిర్వచనాలు మూడు ప్రత్యేక విభాగాలను పరిచయం చేశారు.
పార్టీ సిద్ధాంతాలను, ఆశయాలను లోతుగా అర్థం చేసుకుని, పార్టీ కోసం క్షేత్రస్థాయిలో పనిచేసే వారిని “ఉద్యమి”గా పిలుస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అలాగే, నవతరాన్ని పార్టీ వైపు ఆకర్షించి, సభ్యత్వ నమోదును వేగవంతం చేసే వారిని “సాధక్” అని, పార్టీకి పరోక్షంగా ఆర్థిక, సాంకేతిక, సేవా రంగాల్లో సహాయ సహకారాలు అందించే వారిని “ప్రదాత” అని ఇకపై పిలుస్తామని స్పష్టం చేశారు. కేవలం సంఖ్య పెంచుకోవడం కంటే, పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే నిబద్ధత గల కార్యకర్తలే పార్టీకి అసలైన అవసరమని ఆయన ఉద్ఘాటించారు.
జనసేన పార్టీ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, కేవలం 150 మందితో ప్రారంభమైన పార్టీ నేడు మిలియన్ల సంఖ్యకు చేరుకోవడం గర్వకారణమని పవన్ కళ్యాణ్ అన్నారు. 2021లో తొలిసారి సభ్యత్వ నమోదు ప్రారంభించినప్పుడు 90 వేలుగా ఉన్న సంఖ్య, ఎన్నికల నాటికి 6 లక్షలకు, ఎన్నికల తర్వాత అనూహ్యంగా 12.98 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. కూలి పనులు చేసుకునే వారి నుంచి విద్యావంతుల వరకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా పార్టీ బలోపేతానికి ముందుకు రావడం శుభపరిణామమని ఆయన కొనియాడారు.
ఈ కార్యక్రమంలో రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, పిడుగు హరిప్రసాద్, రామ్ తాళ్లూరి, కళ్యాణం శివ శ్రీనివాస్ తదితర కీలక నేతలు పాల్గొన్నారు. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ద్వారా రాబోయే రోజుల్లో పార్టీని మరింత శక్తివంతమైన రాజకీయ శక్త్తిగా మార్చడమే లక్ష్యమని జనసేనాని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
Read Also: Saketh Sreenivasaiah death: అమెరికాలో అదృశ్యమైన భారతీయ విద్యార్థి సాకేత్ శ్రీనివాసయ్య మృతి!