Ponnam Prabhakar: తెలంగాణ అభివృద్ధిలో రాజకీయాలు పక్కన పెట్టి అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం.. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ఆహ్వాన పత్రికను కేంద్రమంత్రి బండి సంజయ్కు అందించి ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధి లక్ష్యంగా సిద్ధం చేసిన ‘రైజింగ్ 2040’ విజన్తో తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిర్మించే దిశగా ప్రభుత్వం దృఢంగా ముందుకు సాగుతుందని తెలిపారు.
రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ విభేదాలు, పార్టీ భేదాలు అడ్డంకులు కాకూడదని మంత్రి అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించడం, పారిశ్రామిక వృద్ధిని వేగవంతం చేయడం, కొత్త పరిశ్రమలకు అవకాశాలు కల్పించడం.. రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రధాన లక్ష్యమని అన్నారు. గత పదేళ్లలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలహీనపడిందని విమర్శించిన ఆయన, రాష్ట్రాన్ని మళ్లీ బలోపేతం చేయడానికి సమ్మిట్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు.
అభివృద్ధి కార్యక్రమాల్లో కేంద్రం న్యాయం చేయాలని పొన్నం డిమాండ్ చేశారు. పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్కు కేంద్రం భారీ స్థాయిలో నిధులు కేటాయిస్తుండగా, తెలంగాణకు అదే స్థాయిలో సహకారం అందడం లేదని అన్నారు. అన్ని రాష్ట్రాలను కేంద్రం సమానంగా చూడాల్సిన బాధ్యత వాళ్లదేనని మంత్రి గుర్తు చేశారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర సహకారం మరింతగా అవసరమని తెలిపారు.
బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడుతూ ప్రాణత్యాగం చేసిన సాయి ఈశ్వర్ మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి బలిదానాలు ఎవరూ చేయకూడదని, సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు. సాయి ఈశ్వర్ కుటుంబాన్ని ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాంపియన్గా ఉంటుందని, కేంద్రం నిర్ణయించిన 50 శాతం రిజర్వేషన్ పరిమితిని కృష్ణమూర్తి కేసు ఆధారంగా సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నామని ఆయన స్పష్టం చేశారు. బలహీన వర్గాలకు న్యాయం అందించడంలో ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు.
తమ ప్రభుత్వం కులగణనకు కట్టుబడి ఉందని పొన్నం మరోసారి ప్రకటించారు. సమాజంలోని అన్ని వర్గాల అసలు సామాజిక–ఆర్థిక పరిస్థితులను అంచనా వేసి, ఆ డేటా ఆధారంగా విధానాలు రూపొందించడం అవసరమని చెప్పారు. సమగ్ర కులగణనతో సామాజిక న్యాయానికి బలమైన బాటలు పడతాయని మంత్రి అభిప్రాయపడ్డారు.
గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించడం రిజర్వేషన్లకు వ్యతిరేకమని ప్రచారం కావడం.. తప్పుడు వ్యాఖ్యలేనని మంత్రి ఖండించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, రిజర్వేషన్ వ్యవస్థను బలపర్చడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతాయన్నారు. గ్రామీణ పరిపాలన నిలిచిపోకుండా చూసేందుకు ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు వస్తోందని పేర్కొన్నారు.