Air India Flight: ఢిల్లీ నుంచి విజయవాడ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణికులకు కాసేపు తీవ్ర ఆందోళన కలిగించే సంఘటన ఎదురైంది. విమానం గాల్లో ఉండగానే ఇంజిన్లో సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ వెంటనే అప్రమత్తమయ్యారు.
హైదరాబాద్ వైపు మళ్లింపు..
విజయవాడలో ల్యాండ్ అవ్వాల్సిన సమాయానికి ఇంజిన్లో సమస్య గుర్తించిన పైలట్, ముందస్తు జాగ్రత్తగా విమానాన్ని హైదరాబాద్ వైపు మళ్లించారు. అయితే ప్రయాణంలో ఉండగానే ఆ సాంకేతిక లోపం సరికావడంతో.. పైలట్ మళ్లీ విమానాన్ని విజయవాడ వైపు తిప్పారు. గాల్లో ఏర్పడిన ఈ ఊహించని పరిణామంతో విమానంలో ఉన్న వారంతా తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
విమానంలో మంత్రి, ప్రజాప్రతినిధులు
ఈ విమానంలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఇతర ప్రముఖులు సహా మొత్తం 180 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించి, సమస్యను అధిగమించి విమానాన్ని విజయవాడ ఎయిర్పోర్ట్లో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో ప్రయాణికులంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అధికారుల సమయస్ఫూర్తి వల్ల పెద్ద ప్రమాదం తప్పిందని అందరూ ఉపశమనం వ్యక్తం చేశారు.
Also Read: ఒకే ఫార్ములా.. ఇద్దరు నేతలు.. ఒకరిది జైలు, ఇంకొకరిది సెటిల్మెంట్!