Railway Jobs: రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల భారీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటన ద్వారా భారతీయ రైల్వేలో మొత్తం 5,696 అసిస్టెంట్ లోకో పైలెట్ పోస్టులను భర్తీ చేస్తోన్నారు. అభ్యర్థులు ఫిబ్రవరి 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల లోపు ఉండాలని నోటిఫికేషన్లో తెలిపింది.
అయితే ఇప్పుడు ఆ వయో పరిమితిలో రైల్వే మంత్రిత్వశాఖ కీలక మార్పు చేసింది. గతంలో ఇచ్చిన వయో పరిమితిలో మార్పులు చేసింది. ఈ మేరకు ముందుగా 18 నుంచి 30 ఏళ్లు పేర్కొనగా.. ఇప్పుడు దాన్ని 33 ఏళ్లకు పెంచింది. ఇలా చేయడం ద్వారా మరికొంత మందికి అవకాశం లభిస్తుందని తెలిపింది. దీంతో ఇప్పుడు జులై 1,2024 నాటికి 18 నుంచి 33 ఏళ్ల లోపు ఉన్నవారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దీంతోపాటు పరీక్షల టైం లైన్ను ప్రకటించింది. ఈ మేరకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT-1) జూన్ లేదా ఆగస్టు మధ్య జరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. రెండో దశ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ (CBT-2) సెప్టెంబర్లో నిర్వహించే ఛాన్స్ ఉందని పేర్కొంది. అలాగే ఆప్టిట్యూడ్ టెస్ట్ (CBAT) నవంబర్లో నిర్వహిస్తారు. దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థుల జాబితాను నవంబర్/డిసెంబర్లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.