YCP Flex Issue : మంగళగిరిలో వైసీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు ఆ పార్టీలోనే వివాదాన్ని రేపుతున్నాయి. సామాజిక సాధికార యాత్ర పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై బీసీ సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. ఫ్లెక్సీల నిండా తాడేపల్లి వైసీపీ రెడ్డి నాయకులే దర్శనమిస్తున్నారని మండిపడుతున్నారు. మంగళగిరి వైసీపీ అభ్యర్థి గంజి చిరంజీవి ఫోటో లేకపోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.
కొన్నిరోజుల క్రితం మంగళగిరి నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్ గా గంజి చిరంజీవిని సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నియమించారు. ఆ నిర్ణయం వైసీపీలో అగ్గిరాజేసింది. సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అప్పుడు ఆయన.. వైఎస్ షర్మిల వెంట నడుస్తానని ప్రకటించారు. దీంతో వైసీపీకి గట్టి దెబ్బతగిలింది.
మంగళగిరి ఇన్ ఛార్జ్ గా నియమితులై గంజి చిరంజీవి బీసీ. ఆయన పద్మశాలీ వర్గానికి చెందిన వారు. ఆయనకు వైసీపీలోని రెడ్డి నేతలు సహకారం అందిస్తారా అనుమానాలు తొలు నుంచి వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పుడు సామాజిక సాధికార యాత్ర సాక్షిగా గంజి చిరంజీవిని అమానిస్తున్నారని ఆయన వర్గీయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో గంజి చిరంజీవి ఫోటో లేకపోవడంపై ఆయన సన్నిహితులు మండిపడుతున్నారు. వైఎస్ఆర్, జగన్ మోహన్ రెడ్డితోపాటు విజయసాయిరెడ్డి ఫోటోలను మాత్రమే పెట్టి రెడ్డి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరి అలాంటి నేతలు ఎన్నికల్లో చిరంజీవికి ఎంతవరకు సహకరిస్తారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మరోవైపు మంగళగిరి నుంచి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పోటీకి దిగుతున్నారు. ఈ నేపథ్యంలో సామాజిక సమీకరణాలు లెక్కలు వేసుకుని సీఎం జగన్ మోహన్ రెడ్డి .. గంజి చిరంజీవికి టిక్కెట్ కేటాయించారు. కానీ స్థానికంగా ఆయనకు పార్టీలో సరైన గౌరవం ఇవ్వపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.