హైదరాబాద్ జవహర్ నగర్ పీఎస్ పరిధిలో దారుణ హత్య జరిగింది. రియల్టర్ రత్నంను గుర్తుతెలియని వ్యక్తులు చంపేశారు. రత్నంపై కాల్పులు జరిపి.. కత్తితో పొడిచి మర్డర్ చేశారు. స్కెచ్ ప్రకారం బైక్పై వెళ్తుండగా వెంబడించి చంపేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కృష్ణా జిల్లా మచిలీపట్నంలో హైటెన్షన్ నెలకొంది. టీడీపీ వర్సెస్ బీజేపీగా సీన్ మారింది. వాజ్పేయి విగ్రహ స్థాపన వివాదానికి దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన తెలుగు తమ్ముళ్లు.. ఎన్టీఆర్ సర్కిల్లో వాజ్పేయి విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారంటున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు.. సర్ది చెబుతున్నా నేతలు పట్టించుకోలేదు. దీంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రధాన రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జ్యోతి మిల్క్ కంపెనీ వద్ద టిప్పర్ లారీ బైక్ను ఢీకొట్టడంతో రాపిడోలో వెళ్తున్న జ్యోతి, డ్రైవర్ సురేందర్ రెడ్డి అక్కడికక్కడే మృతి చేందారు. సీసీ ఫుటేజ్లో ఈ ప్రమాదం రికార్డయింది. లారీని, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు దర్యాప్తు స్పీడప్ చేశారు. ఈ నెల 15లోగా అదనపు ఛార్జ్ షీట్ దాఖలు చేయనున్నారు. కాగా.. మొదటి ఛార్జ్షీట్లో ఇద్దరు నిందితులను సిట్ అధికారులు చేర్చారు. త్వరలో ఇదే కేసులో మరో ఐదుగురు టీటీడీ ఉద్యోగుల అరెస్టుకు రంగం సిద్దం చేశారు.
గంగవరం పోర్టు వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మికులు ఆందోళనకు దిగారు. పోర్టు ముట్టడికి యత్నించారు. పోలీసులు కార్మికులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్మికులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట రోడ్డు ప్రమాదం చిక్కుముడి వీడింది. రోడ్డుపై కంటైనర్ను ఆపడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు. బ్రేక్ ఇన్స్పెక్టర్ అవతారం ఎత్తి, వాహనాలు ఆపుతూ.. ఓ ASI కుమారుడు అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ లోడుతో వెళ్తున్న కంటైనర్ను సైగలు చేసి హైవేపై నిలిపాడు. దీంతో వెనక నుంచి వచ్చిన కారు కంటైనర్ను ఢీకొట్టింది.
నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నదమ్ములు సైకిల్పై పాఠశాలకు వెళ్తుండగా, ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో టైరు కింద పడి ఆరో తరగతి చదువుతున్న పులి కిరణ్ అక్కడికక్కడే మృతి చెందాడు. అన్న కార్తీక్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఖమ్మం జిల్లా ఏదులాపురం పరిధిలోని నాగార్జున సాగర్ ప్రాజెక్టు కాల్వలో స్నానానికి దిగిన మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ గల్లంతయ్యాడు. ఈ ప్రాంతంలో ఇతర రాష్ట్రాల డ్రైవర్లు తమ భారీ వాహనాలను నిలిపి కాల్వలో స్నానాలు చేయడం, బట్టలు ఉతకడం చేస్తూ ఉంటారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనపై స్థానికులు ఫిర్యాదు చేయగా, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో కరుటూరు సుబ్బారావు పెరట్లో నాటిన బ్రహ్మ కమలం మొక్కలు కనువిందుగా వికసించాయి. సాధారణంగా రెండు, మూడు పువ్వులు మాత్రమే పూసే మొక్కలకు రెండు మొక్కల నుంచి సుమారు 100కు పైగా పుష్పాలు పూయడంతో స్థానికులు ఆశ్చర్యపోయారు. ఈ పుష్పాలను చూసేందుకు స్థానికులు ఆసక్తి కనబరుస్తున్నారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం బాకారం జాగీర్లోని డ్రీమ్ వ్యాలీ ఫామ్హౌస్లో జరిగిన పార్టీలో సెక్యూరిటీ గార్డు రాజా ప్రదీప్ అనుమానాస్పదంగా మృతి చెందాడు. హైదరాబాద్లోని రామంతాపూర్కు చెందిన ప్రదీప్ కంపెనీ ఉద్యోగులతో కలిసి ఫామ్హౌస్కి వచ్చి మద్యం సేవించి పడుకున్నాడు. నిద్ర లేపగా లేవకపోవడంతో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఛత్తీస్గఢ్లోని ఖైరాగఢ్ జిల్లా బకర్ కట్టా పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంహి గ్రామంలో 12 మంది సీపీఐ మావోయిస్ట్ కేడర్ సభ్యులు ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ‘ఆపరేషన్ కగార్’లో భాగంగా పోలీసులు బీజాపూర్, సుక్మా వంటి అడవులను జల్లెడపడుతున్న తరుణంలో మావోయిస్టులు ఎన్కౌంటర్లలో మరణించడం లేదా లొంగిపోవడం పెరిగింది.
వందేమాతరం జాతీయ గీతంపై పార్లమెంట్లో చర్చ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వంపై ఫైరయ్యారు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి. రవీంద్రనాథ్ ఠాగూర్ వందేమాతరం గీతాన్ని కాంగ్రెస్ సెషన్స్లో పాడారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో వందేమాతరం పాడుతున్నామని.. ఆర్ఎస్ఎస్, బీజేపీ మీటింగుల్లో మాత్రం పాడరని ఆయన విమర్శించారు.
ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ధరలను అదుపు చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన టికెట్ రేట్ల పరిమితిని ఎయిర్ ఇండియా నేటి నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. ఇది ఎకానమీ క్లాస్ టికెట్లకు వర్తిస్తుందని ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు చేసింది.
ఇండిగో సంక్షోభంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషన్పై పూర్తిస్థాయిలో విచారించేందుకు ధర్మాసనం నిరాకరించింది. ఇండిగో సంక్షోభంపై అత్యవసరంగా విచారించాలంటూ పిటిషన్ దాఖలైంది. అత్యవసరంగా విచారించలేమని సుప్రీంకోర్టు నిరాకరించింది.
దేశీయ విమానయాన సంస్థ ఇండిగో సర్వీసుల్లో అంతరాయం కొనసాగుతోంది. సోమవారం దేశవ్యాప్తంగా పలు విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించాల్సిన 350కి పైగా ఇండిగో సర్వీసులు రద్దయ్యాయి. ఒకపక్క ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. ఏడో రోజూ సంక్షోభం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో దిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది.
భారత విదేశాంగ మంత్రి జైశంకర్పై పాకిస్థాన్ మరోసారి నోరు పారేసుకుంది. పాక్ సైన్యంతోనే భారత్కు ఎక్కువ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అనడం సరికాదని తెలిపింది. తమ వ్యవస్థలను, నాయకత్వాన్ని కించపరిచేలా విదేశాంగ మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, వాటిని ఖండిస్తున్నామని తెలిపింది. సైన్యం సహా వ్యవస్థలన్నీ తమ జాతీయ భద్రతకు మూలస్తంభాలని పాక్ విదేశాంగ కార్యాలయ ప్రతినిధి తాహిర్ అన్నారు.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి అనుభవం భారత జట్టుకు ఎంతో అవసరమని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ విజయంలో కోహ్లి, రోహిత్ కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో గంభీర్ ఇలా స్పందించాడు. రోహిత్, కోహ్లి నాణ్యమైన ఆటగాళ్లని అన్నారు. అలాంటి ప్లేయర్లు 50 ఓవర్ల ఫార్మాట్లో జట్టుకు ఎంతో అవసరమన్నారు.
దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న టీమ్ఇండియా.. టెస్ట్ సిరీస్ను మాత్రం 0-2 తేడాతో కోల్పోయిన విషయం తెలిసిందే. టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి ఓ యూట్యూబ్ పాడ్కాస్ట్లో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశాడు. టెస్ట్ సిరీస్ ఓటమికి ఒక్కరినే బాధ్యులను చేయడం సరికాదన్నారు.
లైంగిక వేధింపుల కేసులో ప్రముఖ మలయాళీ నటుడు దిలీప్ నిర్దోషిగా తేల్చింది కోర్టు. ఎనిమిదేళ్ల క్రితం కేరళలో మలయాళ ప్రముఖ నటిపై లైంగిక దాడి జరగ్గా.. ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిలీప్ నిర్దోషిగా తేలాడు. ఈ మేరకు కేరళలోని ఎర్నాకుళం కోర్టు తీర్పు వెలువరించింది.
నటి జయా బచ్చన్ 1981 తర్వాత 14 ఏళ్లు నటనకు విరామం తీసుకోవడానికి గల కారణాన్ని తాజాగా వెల్లడించారు. షూటింగ్కు వెళ్లే సమయంలో కూతురు శ్వేత అమాయకంగా, “అమ్మా.. నువ్వు వెళ్లొద్దు.. నాన్నని వెళ్లమని చెప్పు” అని అడగడం తనను తీవ్రంగా కదిలించిందని ఆమె తెలిపారు. కుమార్తెకు తన సమయం, ప్రేమ ముఖ్యమని భావించి.. ఆమె కోసమే సినిమాలకు విరామం ప్రకటించినట్లు జయ చెప్పారు.