తెలంగాణ తొలిదశ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దూసుకెల్తోంది. ఇప్పటి వరకూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు 305 పంచాయతీలలో విజయకేతనం ఎగరవేశారు. బీఆర్ఎస్ 32 స్థానాలలో విజయం సాధించింది. బీజేపీ కేవలం 13 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక పంచాయతీ ఎన్నికల్లో ఇతర పార్టీలు బలపరిచిన అభ్యర్థులు, స్వతంత్ర అభ్యర్థులు మొత్తం 45 పంచాయతీలలో గెలిచారు.
మాజీ ఇంటిలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. రేపు పోలీసుల ముందు ప్రభాకర్ రావు సరెండర్ కావాలని, జూబ్లీహిల్స్ పీఎస్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఆయనను ఫిజికల్ టార్చర్ చేయొద్దని పోలీసులను సూచించింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును 14 రోజుల విచారణకు అనుమతించాలని తెలంగాణ ప్రభుత్వం కోరగా, దీనిపై వాదనలు కొనసాగుతున్నాయి.
గ్రామపంచాయతీ ఎన్నికల కోసం యాదాద్రి జిల్లా బొమ్మలరామారంలో ఆదర్శ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు అధికారులు. పచ్చని మామిడి ఆకుల తోరణాలు, కొబ్బరిమట్టలు, పూలతో అలంకరణలు, రంగుల ముగ్గులతో పోలింగ్ కేంద్రాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఫకీర్గూడెంలోని ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించి, మొదటగా ఓటు వేసిన వారికి పూల మొక్కలతో స్వాగతం పలికారు.
హైదరాబాద్ పటాన్చెరు సమీపంలోని ఇస్నాపూర్లో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన ఓ కారు ముందుగా వెళ్తున్న మరో కారును ఢీకొని, ఆపై బైక్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాద దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.
గోవాలో 25 మంది మరణించిన నైట్క్లబ్ అగ్నిప్రమాద కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే థాయ్లాండ్కు పారిపోయిన పబ్ యజమానులు సౌరభ్, గౌరవ్ లూత్రా సోదరులను ఐదు రోజుల తర్వాత గోవా పోలీసులు అరెస్టు చేశారు. అంతర్జాతీయ సమన్వయంతో వారిని థాయ్లాండ్లోని ఫుకెట్లో అదుపులోకి తీసుకున్నారు.
జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం ఐదవ వార్డు సభ్యురాలు అభ్యర్థి విజయలక్ష్మికి ప్రమాదం జరిగింది. పోలీస్ వాహనం డోర్ అకస్మాత్తుగా తెరవడంతో ఆమె తన బైక్పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఆమె చెయ్యి విరగడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘనపురం పోలింగ్ కేంద్రం వద్ద కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థి వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రెబెల్ అభ్యర్థిపై కాంగ్రెస్ అనుచరులు కరపత్రాలు విడుదల చేయడంతో వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. ఎస్పీ స్వయంగా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
హైదరాబాద్లోని రహమత్ నగర్ ఎస్పీఆర్ హిల్స్ గ్రౌండ్లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో గ్రౌండ్లో నిలిపి ఉన్న మూడు కార్లు, ఒక ఆటో పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
కడప మేయర్ ఎన్నికల సందర్భంగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి ఎన్నికల అధికారి జేసీ అతిథి సింగ్ను కలిశారు. మేయర్ అభ్యర్థి తరపున ఆయన పార్టీ బీ ఫామ్, ఏ ఫామ్ మరియు విప్ నోటీసు కాపీలను అధికారులకు అందజేశారు.
మేడ్చల్లోని శామీర్పేట్ మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల విద్యార్థులు తమకు సరైన వసతులు, నాణ్యమైన ఆహారం లేకపోవడంపై శామీర్పేట్ పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు. ఫిర్యాదు చేసినా హాస్టల్ సిబ్బంది పట్టించుకోకుండా, తమను దుర్భాషలాడుతున్నారని వారు సీఐకి మొరపెట్టుకున్నారు.
మాజీ సీఎం జగన్పై కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తీవ్ర విమర్శలు చేశారు. అమరావతి బిల్లుపై జగన్ విషం కక్కుతున్నారని, 34 వేల మంది రైతులు ఇచ్చిన భూములను వాడకుండా ఏపీ భవిష్యత్ను నాశనం చేశారని ఆరోపించారు. జగన్ను శాశ్వత రాజకీయ సమాధి చేయాలని, ఆయన ఏపీకి అప్పులు ఇవ్వొద్దని ప్రపంచబ్యాంకుకు లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.
అల్లూరి జిల్లా రాళ్ళగెడ్డలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా టూరిస్ట్ కారు బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని గీతం యూనివర్సిటీ విద్యార్థి రుద్ర అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల పంచాయతీ ఎన్నికల విధుల్లో ఉన్న ఓ హెడ్ కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు. సహచర పోలీసులు వెంటనే సీపీఆర్ చేసి ప్రాథమిక చికిత్స అందించినప్పటికీ, పరిస్థితి విషమంగా ఉండడంతో ఆయన్ను సూర్యాపేట ఆసుపత్రికి తరలించారు.
కర్నూలు జిల్లా ఆలూరు మండలం హోళగుందలో బైక్ అదుపుతప్పి డ్రైనేజీ కాలువలో పడటంతో సిద్ధప్ప అనే హమాలి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పల్నాడు జంట హత్యల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఇవాళ మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గుండ్లపాడు జంట హత్యల కేసులో వారి ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసి, రెండు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
అఖండ 2 వాయిదా పడటంతో USAలో ఓ చిన్నారి అభిమాని బాధపడిన వీడియో వైరల్ అయ్యింది. అయితే, కొందరు ఆ చిన్నారికి కులాన్ని ఆపాదించి ట్రోల్ చేస్తుండటంపై ఆ పాప తల్లి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ ట్రోలింగ్పై ఆమె స్పందిస్తూ వీడియో పోస్ట్ చేశారు.
పైలట్ల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొన్న ఇండిగో, డిసెంబర్ 3-5 మధ్య రద్దయిన సర్వీసుల ప్రయాణికులకు రూ.10 వేల విలువైన ట్రావెల్ వోచర్ను పరిహారంగా ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ వోచర్లను రానున్న 12 నెలల్లో ప్రయాణానికి వాడుకోవచ్చని తెలిపింది. ప్రస్తుతం 1950కి పైగా సర్వీసులతో కార్యకలాపాలను పునరుద్ధరిస్తోంది.
గత జనవరి నుంచి అజ్ఞాతంలో ఉన్న వెనెజువెలా విపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో నార్వేలో బహిరంగంగా కనిపించారు. నోబెల్ అవార్డుల ప్రదానోత్సవం తర్వాత ఓ హోటల్ వద్ద మద్దతుదారులకు అభివాదం చేశారు. నోబెల్ అవార్డును ఆమె తరఫున ఆమె కుమార్తె అందుకున్నారు.
టీ20ల్లో బౌలర్లకు చుక్కలు చూపించే సూర్యకుమార్ యాదవ్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. గత 19 టీ20 ఇన్నింగ్స్లో అతడు కేవలం 222 పరుగులు మాత్రమే చేయగా, స్ట్రైక్ రేట్ కూడా 120కి పడిపోయింది. కెరీర్ స్ట్రైక్రేట్ 164.05గా ఉన్న స్కై, ఇటీవలి కాలంలో తన మెరుపులు కోల్పోవడం చర్చనీయాంశమైంది.
బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ ప్రీమియర్స్ నేటి రాత్రి పడనున్న నేపథ్యంలో, దర్శకుడు బోయపాటి శ్రీను, సంగీత దర్శకుడు తమన్ శ్రీశైల మల్లన్నను దర్శించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిత్ర నిర్మాణ సంస్థ సోషల్ మీడియాలో పంచుకుంది.