ప్రపంచ ఫుట్ బాల్ దిగ్గజం మెస్సీ ఫలక్నుమా ప్యాలెస్కు చేరుకున్నారు. ప్యాలెస్ చుట్టూ కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు పోలీసులు. అనంతరం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంకు వెళ్లనున్నారు. ఫుట్ బాల్ మ్యాచ్లో పాల్గొననున్న మెస్సీ.. అభిమానులతో ఫొటో షూట్లో పాల్గొంటారు.
హైదరాబాద్ పాతబస్తీ ఉప్పుగూడలోని రాజా రాజేశ్వరి బార్లో సాయి నాథ్ అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడి పక్కన ఇంజెక్షన్ సిరంజ్, మాత్రలు, మద్యం బాటిల్ లభించాయి. సమాచారం అందుకున్న ఛత్రినాక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఖమ్మం జిల్లాలోని 6 మండలాలతో పాటు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 7 మండలాల్లో పోలింగ్ జరగనుంది. అన్ని డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల నుంచి ఆయా గ్రామాలకు ఎన్నికల సామాగ్రిని తరలించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నాకపర్తిలో డ్రైనేజ్లో కనిపించిన బ్యాలెట్ పత్రాలపై జిల్లా కలెక్టర్ త్రిపాఠి స్పందించారు. ఇక్కడ ఎలాంటి రిగ్గింగ్ జరగలేదని.. రిపోలింగ్కు అవకాశం లేదని స్పష్టం చేశారు. పోలైన ఓట్లకు, కౌంటింగ్కు సరిపోయాయని తెలిపారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలో రెండో విడత గ్రామ పంచాయతీ పోలింగ్కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ పర్యవేక్షణలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం మర్కోడు పంచాయతీకి చెందిన దివ్యాంగుడు ఇందు కుమార్ స్వచ్ఛందంగా ఓటు హక్కుపై అవగాహన కల్పిస్తున్నాడు. మద్యం, డబ్బు ప్రభావాలకు లోనుకాకుండా.. నీతి నిజాయితీ ఉన్న ప్రజాప్రతినిధులను ఎన్నుకోవాలని, అభ్యర్థులు స్థానిక సమస్యల చిట్టాతో రావాలని తన సొంత ఖర్చులతో ఆటోపై మైక్ ప్రచారం చేస్తున్నాడు.
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం నేతివానిపల్లి సర్పంచ్ అభ్యర్థి.. నిండు గర్భిణి బోయ తిరుపతమ్మ తిమ్మప్ప.. ఏకంగా వంద రూపాయల బాండ్ పేపర్పై 23 హామీలు ఇచ్చి సంచలనం సృష్టించారు. గెలిచిన వారం లోపు తాగునీటి సమస్య పరిష్కరిస్తానని, విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇచ్చారు.
ఖమ్మం జిల్లా వైరా రిజర్వాయర్లో దూకి పాలడుగు గ్రామానికి చెందిన రామిశెట్టి కోటేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారు. ఇతను వైరాలోని వైష్ణవి పాల కేంద్రంలో సిబ్బందిగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ కలహాల కారణంగానే ఇతను ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
భీమా రంగాన్ని ప్రైవేటీకరించడానికి.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని 74 శాతం నుంచి 100 శాతానికి పెంచడానికి మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి నర్రెడ్డి తులసి రెడ్డి వేంపల్లిలో ధ్వజమెత్తారు. ఈ చర్య ప్రజల పొదుపును సంక్షోభంలోకి నెట్టి, దేశ ఆర్థిక వ్యవస్థకు ముప్పు కలిగిస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
బీరంగూడ శ్రవణ్ సాయి హత్య కేసులో శ్రీజ తల్లి సిరిని అరెస్ట్ చేశారు పోలీసులు. శ్రీజను ప్రేమించాడన్న కారణంతోనే శ్రవణ్ సాయిని కొట్టి చంపారు యువతి కుటుంబ సభ్యులు. తల్లి సిరి కొట్టడంతో శ్రీజ తలకు, కుడిచెయ్యి, నెక్ బోన్ కి గాయాలయ్యాయి. దీంతో డాక్టర్లు సర్జరీ చేశారు. ప్రస్తుతం శ్రీజ బాగోగులు చూస్తున్నారు మేనమామ రాజు.
నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కసనగోడులో స్వతంత్ర అభ్యర్థి కందుల మోహన్ కుమార్ 220 ఓట్ల మెజార్టీతో సర్పంచ్గా గెలుపొందారు. అలాగే ఉప సర్పంచ్గా వీరమల్ల వెంకటేశం విజయం సాధించారు. దీంతో గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటు చేసుకుంది. పసలపూడి గ్రామానికి చెందిన నల్లమిల్లి సిరి రామచంద్రాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టెన్త్ చదువుతోంది. పాఠశాలలో ఉండగానే సిరి స్పృహతప్పి పడిపోయింది. వెంటనే స్కూల్ సిబ్బంది ఏరియా ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
గుంటూరులో ఇంటర్మీడియట్ విద్యార్థిని డ్రగ్స్కు బానిసై తల్లిదండ్రులపై తిరగబడటంతో కలకలం రేగింది. కుమార్తె మాట వినడం లేదనే మనస్తాపంతో తల్లి ఆత్మహత్యాయత్నం చేసి, ప్రస్తుతం గుంటూరు GGH ICUలో చికిత్స పొందుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.
పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ DSP హనుమంతరావు రావిపాడు వద్ద కాలువలో జరిగిన తల్లి-కుమారుల మృతిపై దర్యాప్తు వివరాలు వెల్లడించారు. భర్త శ్రీకాంత్కు అక్రమ సంబంధం ఉండటంతో, భార్య త్రివేణిని, కుమారుడు శరత్లను కాలువలోకితోసి ఆత్మహత్యగా చిత్రీకరించడానికి బైకును కూడా నీటిలో పడేశాడని DSP వివరించారు.
బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్ర వర్మ రాజు స్టువార్టుపురం ప్రభుత్వ గిరిజన సంక్షేమ శాఖ బాలుర గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందించడం లేదని, గుడ్డు, స్వీట్ అసలు పెట్టడం లేదని, భోజనం చాలీచాలడం లేదని విద్యార్థులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై ప్రిన్సిపల్ సోమయ్యపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు.
భారతదేశ దిగుమతులపై డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు సుంకాలు రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతినిధుల సభ సభ్యులు డెబోరా రాస్, మార్క్ వీసీ, రాజా కృష్ణమూర్తి దీనిపై ఒక కీలక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ట్రంప్ విధించిన ఈ సుంకాలు చట్టవిరుద్ధం అని, అమెరికన్ కార్మికులు, వినియోగదారులకు, అలాగే ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు హానికరం అని తీర్మానంలో పేర్కొన్నారు.
మాటలతో యుద్ధాలు గెలవలేమని, స్పష్టమైన చర్యల ద్వారానే విజయం సాధ్యమని CDS జనరల్ అనిల్ చౌహాన్ పాకిస్థాన్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని దుండిగల్ ఎయిర్ఫోర్స్ అకాడమీలో జరిగిన గ్రాడ్యుయేషన్ పరేడ్లో ఆయన మాట్లాడారు.
పార్లమెంటు వెలుపల సిగరెట్ తాగడాన్ని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ సమర్థించుకున్నారు. దిల్లీలో కాలుష్యంపై దృష్టి పెట్టకుండా, తన సిగరెట్ విషయంపై మోదీ ప్రభుత్వం దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు. ఒక్క సిగరెట్ వల్ల కాలుష్యం పెరగదని వ్యాఖ్యానించారు. మరోవైపు, లోక్సభలో ఈ-సిగరెట్ తాగారంటూ టీఎంసీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ స్పీకర్కు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు.
టీమ్ఇండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ గత కొన్ని నెలలుగా ఫామ్లో లేకపోవడంపై మాజీ ఓపెనర్ ఆకాశ్ చోప్రా విమర్శలు గుప్పించారు. కెప్టెన్ పని కేవలం టాస్ వేయడం కాదని, టాప్-4లో బ్యాటింగ్ చేస్తూ పరుగులు చేయడం కూడా ప్రధాన బాధ్యతేనని అన్నారు.
సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా తన జీవితంలో జరిగిన ఒక భయంకరమైన ఘటనను గుర్తు చేసుకున్నారు. దొంగతనాలు ఎక్కువగా జరిగే రోజుల్లో.. ఒకసారి న్యూయార్క్లో అర్ధరాత్రి ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా దారి తప్పానని తెలిపారు. చీకటిగా, నిర్మానుష్యంగా ఉన్న ఆ ప్రాంతం దొంగలకు అడ్డాగా ఉండేదని.. అది తనకు చివరి రోజు అనుకున్నానని చెప్పారు.