ఓట్ చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో నేడు మహార్యాలీ చేపడుతోంది. ఈ అంశంలో కేంద్రం, ఈసీని దోషిగా నిలబెట్టాలని కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించింది. ఇప్పటికే 5.5 కోట్ల సంతకాలు సేకరించింది. ర్యాలీ ముగిసిన తర్వాత ఈ సంతకాల పత్రాలను రాష్ట్రపతికి సమర్పించేందుకు అపాయింట్మెంట్ కోరింది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే, రాహుల్, ప్రియాంక గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలు ఇందులో పాల్గొంటారు.
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (TTA) ఆధ్వర్యంలో ‘మైల్స్ ఆఫ్ హోప్’ మారథాన్ జరిగింది. 2కే, 5కే, 10కే విభాగాల్లో జరిగిన ఈ రన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్, హీరో తరుణ్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ‘సే నో టు డ్రగ్స్’ నినాదంతో భారీ ఎత్తున అవగాహన కల్పించారు.
తెలంగాణ రాష్ట్రం చలిగాలుల తీవ్రతతో వణుకుతోంది. పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. ఆదిలాబాద్లో 6.7°C, సంగారెడ్డిలో 6.5°C నమోదైంది. చలిగాలుల దృష్ట్యా వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3°C నుండి 4°C వరకు తక్కువగా ఉండే అవకాశం ఉంది.
హైదరాబాద్లోని పాడి షరీఫ్లో రౌడీషీటర్ నమెద్ అమీర్ను దుండగులు దారుణంగా హత్య చేశారు. పాత కక్షలే దీనికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అమీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్కు తరలించారు.
మంచిర్యాల జిల్లా బుద్దకుర్తి పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది.
మెదక్ జిల్లా నర్సంపల్లి పెద్ద తండాలో సర్పంచ్ అభ్యర్థి శంకర్ నాయక్ సెల్ టవర్ ఎక్కి నిరసన తెలిపారు. తనను ఓడించేందుకు ప్రత్యర్థి ఓటుకు రూ.2 వేలు పంచుతున్నారని ఆరోపించారు. గతంలోనూ ఓడిపోయానని, ఇప్పుడు కూడా తనపై కుట్రలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో విచిత్ర ఘటన జరిగింది. వార్డు సభ్యుడిగా పోటీ చేసిన వ్యక్తి రూ.2 లక్షలు ఖర్చు చేసినా కేవలం 6 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో తీవ్ర నిరాశకు గురైన అభ్యర్థి, తాను ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వాలంటూ ఓటర్ల ఇళ్ల చుట్టూ తిరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది.
వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని ఆర్టీసీ సెంటర్ వద్ద ఉన్న ఓ ఫర్టిలైజర్ షాపులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ స్టేషన్ ఆకట్టుకుంటోంది. పూర్తిగా పచ్చదనంతో, అరటి ఆకుల తోరణాలు, పూలతో అలంకరించి ఓటర్లకు స్వాగతం పలికారు. చలిని సైతం లెక్కచేయకుండా ఓటర్లు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలో ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అడ్వైజరీ సర్వీసెస్ పేరుతో జరిగిన భారీ మోసంపై పోలీసులు కేసు నమోదు చేశారు. అధిక వడ్డీ ఆశచూపి రూ.30 కోట్లు వసూలు చేసిన సీఈవో శివాని పరారయ్యారు. మేనేజర్లు కూడా పరారీలో ఉండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు.
సత్యసాయి జిల్లా హిందూపురంలో ఓ ప్రైవేట్ బస్సు అదుపుతప్పి స్థానిక రామాలయం సమీపంలోని ఓ ఇంట్లోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇంటి గోడ కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అనంతపురం జిల్లాకు చెందిన ప్రపంచకప్ విజేత, అంధ క్రికెటర్ దీపిక కుటుంబానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తక్షణ సాయం అందించారు. 24 గంటల్లో గృహోపకరణాలు పంపించడంతో పాటు, ఆమె స్వగ్రామం తంబలహట్టి తండాకు రూ.6.2 కోట్లతో రోడ్లు మంజూరు చేశారు.
జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదం కేసులో చిలకలూరిపేట అర్బన్ ఎస్సై రహంతుల్లాను ఐజీ సస్పెండ్ చేశారు. ప్రమాదానికి కారణమైన ఏఎస్ఐ కొడుకు నకిలీ ఆర్టీవోగా అవతారమెత్తి దందాలు చేస్తున్నట్లు తేలింది. నిందితులకు ఎస్సై సహకరించారని విచారణలో వెల్లడి కావడంతో వేటు పడింది.
గుంటూరులో డ్రగ్స్కు బానిసైన ఓ ఇంటర్ విద్యార్థిని కన్నతల్లిపై దాడి చేసింది. దీంతో మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాలిక ప్రవర్తనపై కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంధ క్రికెటర్ల వేదనకు స్పందించిన పవన్ కళ్యాణ్, కెప్టెన్ దీపిక కుటుంబానికి అండగా నిలిచారు. తక్షణమే నిత్యావసరాలు పంపించడమే కాకుండా, నూతన గృహాల నిర్మాణంపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు.
హెచ్-1బీ వీసా ఫీజును పెంచుతూ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ 19 అమెరికా రాష్ట్రాలు కోర్టును ఆశ్రయించాయి. ఈ నిర్ణయం చట్ట విరుద్ధమని, దీనివల్ల టెక్నాలజీ, విద్య, ఆరోగ్య రంగాల్లో ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని న్యూయార్క్ అటార్నీ జనరల్ నేతృత్వంలో పిటిషన్ దాఖలు చేశారు.
కాల్పుల విరమణకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించినప్పటికీ, థాయ్లాండ్-కంబోడియా సరిహద్దుల్లో కాల్పులు ఆగలేదు. మందుపాతరలను తొలగిస్తేనే శాంతి సాధ్యమని థాయ్లాండ్ ప్రధాని స్పష్టం చేశారు.
ముంబయి హిట్-అండ్-రన్ కేసులో నిందితుడు మిహిర్ షా బెయిల్ పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని, అతివేగంగా కారు నడిపి ప్రాణాలు తీయడమే కాకుండా పారిపోవడం క్షమించరానిదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
కోల్కతాలో గందరగోళం నేపథ్యంలో, ముంబయిలో జరిగే అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సి ఈవెంట్కు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే పడేల్ గోట్ కప్ ఈవెంట్ కోసం 2 వేల మందికి పైగా పోలీసులను మోహరించారు.
చిరంజీవి, వెంకటేశ్లను ఒకే స్క్రీన్లో చూపించడం ఆనందంగా ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి తెలిపారు. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘మన శంకర వరప్రసాద్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.