రాబోయే రోజుల్లో మహిళా స్వయం సహాయక సంఘాలకు మరిన్ని ఆర్టీసీ అద్దె బస్సులు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 152 ఆర్టీసీ అద్దె బస్సులను మండల మహిళా సమాఖ్యలు విజయవంతంగా నిర్వహిస్తున్నాయి. మహిళను ఆర్దికంగా బతోపేతం చేసే లక్ష్యంతో మరో 448 అద్దె బస్సులను మహిళా సంఘాలకే అప్పగించేందుకు ప్రక్రియ చివరి దశలో ఉంది.
నల్గొండ జిల్లా చండూరు మండలం బంగారిగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవికి వేలంపాట నిర్వహించారు. గ్రామాభివృద్ధి, కనకదుర్గ ఆలయ నిర్మాణం కోసం ఏకగ్రీవం చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ వేలంపాటలో మహమ్మద్ సమీనా ఖాసీం అనే అభ్యర్థి అత్యధికంగా రూ.73 లక్షలకు దక్కించుకున్నారు. మిగతా 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకోవడానికి అంగీకరించడంతో, గ్రామ పంచాయతీ ఏకగ్రీవమైంది.
కృష్ణా జిల్లా మచిలీపట్నం 16వ డివిజన్లో మంత్రి కొల్లు రవీంద్ర ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేశారు. ఏపీఎస్ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావుతో కలిసి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లారు. దేశంలో ఏ రాష్ట్రమూ ఇవ్వనంతగా ప్రతి నెలా 64 లక్షల మందికి 2,739 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. పేదలకు చేస్తున్న మంచిని గుర్తించి తమ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు.
విజయనగరం జిల్లాలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. నల్లిలాంటి పురుగు కాటు వల్ల సోకే ఈ వ్యాధి లక్షణాలతో చీపురుపల్లి మండలం మెట్టపల్లికి చెందిన ఓ మహిళ రెండు రోజుల క్రితం మృతి చెందారు. జిల్లాలో కొత్తగా ఈ కేసు వెలుగు చూడటంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఖమ్మం నగరంలోని ముస్తఫా నగర్ వైన్ షాప్ ముందు స్థానికులు ఆందోళనకు దిగారు. వైన్ షాప్ బంద్ చేపించి, షాప్ ముందు బైఠాయించారు. జనావాసాల మధ్య వైన్ షాపును తొలగించాలని వారు డిమాండ్ చేశారు. అర్ధరాత్రి వరకు వైన్ షాపు తెరిచి ఉండడం వల్ల మహిళలు, విద్యార్థులకు ఇబ్బందులతో పాటు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోందని ఆరోపిస్తున్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్ పల్లా రోజ్ లీనా, కాంగ్రెస్, టీడీపీ పార్టీ నాయకులు వారికి మద్దతు తెలిపారు. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో వైన్ షాప్ ఏర్పాటు చేయొద్దని.. అధికారుల దృష్టికి తీసుకు వెళ్లామని స్థానికులు చెప్పారు. షాపును జనావాసాల మధ్య నుంచి తొలగించే వరకు ప్రతిరోజు ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఫ్లైట్ లో మహిళ సిబ్బందికి లైంగిక వేధింపుల కేసులో రాజీవ్ గాంధీ ఎయిర్ పోర్టు పోలీసులు ఓ ప్రయాణికుడిని అరెస్టు చేశారు. దుబాయ్ నుండి హైదరాబాద్ వచ్చే ఎయిర్ ఇండియా విమానంలో మహిళా క్యాబిన్ ఉద్యోగినిని ప్రయాణికుడు వేధించినట్టు ఆరోపణలు ఉన్నాయి. యువతి ఫిర్యాదుతో ఎయిర్ పోర్టు పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. కేరళకు చెందిన ప్రయాణికుడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు.
అనకాపల్లి జిల్లాలో ఆర్టీసీ బస్సులో సీటు కోసం ప్రయాణికుడిపై మహిళలు దాడి చేశారు. ప్రయాణికుడిని జుట్టు పట్టుకుని మరి కొట్టారు. తాము కర్చీఫ్ వేసిన సీటులో ఎలా కూర్చుంటావంటూ తోటి ప్రయాణికుడితో మహిళలు ఘర్షణకు దిగారు. తుని నుంచి నర్సీపట్నం వెళ్తున్న బస్సులో ఘటన జరిగింది.
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పిటికాయగుళ్ల గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నూతనంగా నిర్మించిన పోలేరమ్మ ఆలయం పండుగ సందర్భంగా ఊరేగింపు విషయంలో రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. సమాచారం అందుకున్న కంభం సీఐ మల్లికార్జున, ఎస్సై నరసింహారావు వెంటనే గ్రామానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో, తక్షణమే ఇద్దరు ఎస్సైలు, 10 మంది కానిస్టేబుళ్లతో పోలీసు పికెట్ ఏర్పాటు చేసి భద్రతను కొనసాగిస్తున్నారు.
గుంటూరు జిల్లా మంగళగిరి నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న మాధురి అనే వివాహిత తన బెడ్రూమ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. 2025లో రాజేష్ నాయుడుతో కులాంతర వివాహం జరిగిన మాధురి, భర్త వేధింపుల కారణంగానే ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఐ-బొమ్మ రవి బెయిల్ పిటిషన్ ఈ రోజు విచారణకు రానుంది. ఇప్పటికే అతడిని 8 రోజుల పాటు కస్టడీలో విచారించారు సైబర్ క్రైమ్ పోలీసులు. బెయిల్ విచారణతో పాటు, పోలీసులు అతడిని మరో మూడు కేసుల్లో నాంపల్లి కోర్టు ముందు హాజరుపరచనున్నారు.
నల్గొండలో అధిక వడ్డీ పేరుతో రూ.330 కోట్లు భారీ మోసం చేసిన రాపోలు ప్రకాష్ కేసు మరోసారి కలకలం రేపుతోంది. డబ్బులు కోల్పోయిన బాధితులు నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేపట్టారు. తమ డబ్బులు వెంటనే తిరిగి ఇవ్వాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. మోసానికి పాల్పడిన వారి ఆస్తులను స్వాధీనం చేసి నష్టపోయిన వారికి పంపిణీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు ఎక్స్ వేదికగా ఏపీ యువతకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో యువత తమ సమస్యలను కామెంట్స్ రూపంలో తెలియజేస్తే, వాటిని సహచర టీడీపీ ఎంపీలతో కలిసి పార్లమెంటులో ప్రస్తావిస్తానని తెలిపారు. యువత భాగస్వామ్యంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తామన్నారు.
దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న జమిలి ఎన్నికల ప్రతిపాదన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. 2028లో జమిలి ఎన్నికలు ఉండవని స్పష్టం చేశారు బీజేపీ జాతీయ నేత బీఎల్ సంతోష్. అయితే ఈ వ్యాఖ్యలు ఆయన ఉద్దేశపూర్వకంగా చేశారా లేక అనుకోకుండా చేశారనే దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. 2028 ఎన్నికల్లో బీజేపీ అనుసరించాలి అనుకుంటన్న వ్యూహంపైనా ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన, SIR తోనే మళ్లీ బీజేపీ అధికారంలోకి రావాలని స్కెచ్ చేస్తోందన్న అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. మరోవైపు జమిలి ఎన్నికలు ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమని విపక్షాలు కూడా వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2028 ఎన్నికల తర్వాత జమిలి ఎన్నికలు ఉండే అవకాశం ఉంది.
ఢిల్లీ కారు బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ దర్యాప్తును వేగవంతం చేసింది. ఇందులో భాగంగా జమ్మూ కాశ్మీర్లో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తోంది. ఈ పేలుడు ఘటనలో నిందితులుగా ఉన్న ఆదిల్ రాథర్, జసీర్ బిలాల్, అమీర్ అహ్మద్ల నివాసాలలో NIA అధికారులు సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం NIA అదుపులో ఉన్నారు ఈ ముగ్గురు నిందితులు.
అపార ప్రతిభ గల భారతీయుల నియామకం ద్వారా అమెరికా ప్రయోజనం పొందిందన్నారు టెస్లా అధినేత ఎలాన్ మస్క్. H-1B వీసా దుర్వినియోగం, ముఖ్యంగా ఔట్సోర్సింగ్ కంపెనీల ద్వారా జరుగుతోందని, ఇది వలస వ్యతిరేక భావనకు కారణమవుతుందని పేర్కొన్నారు. ప్రతిభావంతులకు అధిక జీతాలు ఇవ్వడం, సమాజానికి మేలు చేయడంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు.
టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి, రాంచీలో దక్షిణాఫ్రికాపై తన 52వ వన్డే సెంచరీని సాధించి, అంతర్జాతీయంగా ఒక ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును అధిగమించాడు. ఈ ఘనతపై సునీల్ గావస్కర్ ప్రశంసలు కురిపించారు, కోహ్లిని వన్డేల్లో గ్రేటెస్ట్ అని కొనియాడారు. 2027 వన్డే ప్రపంచకప్పై దృష్టి సారించిన కోహ్లి, ప్రస్తుతం వన్డేలకు మాత్రమే ఆడుతున్నాడు.
సీనియర్ నటుడిగా మారిన తర్వాత రొమాంటిక్ పాత్రలు చేయడం సరదాగా అనిపించడం లేదని నటుడు మమ్ముట్టి అన్నారు. తన అనుభవానికి, వయస్సుకు తగిన పాత్రలనే ఎంచుకోవాలని చెప్పారు. హీరో పాత్రలకు పరిమితులు ఉంటాయని, కానీ విలన్ పాత్రలకు నియమాలు ఉండవని, ఆ పాత్రల్లోనే నటుడిలోని ప్రతిభ బయటపడుతుందని తెలిపారు. కలంకావల్లో విలన్గా కనిపించనున్న ఆయన సినిమా డిసెంబర్ 5న రిలీజ్ కానుంది.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘డ్రాగన్’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ఓ కీలక పాత్ర పోషించనున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో రుక్మిణీ వసంత్ కథానాయికగా నటిస్తున్నారు. త్వరలోనే అనిల్ కపూర్ షూటింగ్లో పాల్గొననున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.