శ్రీ గురు గోవింద్ సింగ్ జీ ప్రకాష్ ఉత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ధైర్యం, కరుణ, త్యాగానికి గురు గోవింద్ సింగ్ ప్రతిరూపమని కొనియాడారు. ఆయన బోధనలు సత్యం, న్యాయం, మానవ గౌరవం కోసం నిలబడాలని మనల్ని నిరంతరం ప్రేరేపిస్తాయని మోదీ పేర్కొన్నారు.
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి నూకల రామచంద్రా రెడ్డి కౌంస్య విగ్రహాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆవిష్కరించారు. కలెక్టర్ కార్యాలయ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు నరేందర్ రెడ్డి, ఎంపీలు బలరాం నాయక్, రఘురాం రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరును తొలగించి.. పథకాన్ని నిర్వీర్యం చేస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. హుస్నాబాద్లో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నెహ్రూ, గాంధీ కుటుంబాల పేర్లను చెరిపివేయాలని కేంద్రం కుట్ర చేస్తోందని మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర శాసనసభ శీతాకాల సమావేశాల తేదీ ఖరారైంది. ఈ నెల 29న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఐదు రోజుల పాటు సాగనున్న సమావేశాలో ఈ విడత ప్రధానంగా సాగునీటి రంగంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. నీళ్లు – నిజాలు అనే నినాదంతో సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల కేటాయింపులపై ప్రత్యేక చర్చ చేపట్టాలని నిర్ణయించింది.
కూకట్పల్లి మెరీనా స్కైస్ అపార్ట్మెంట్లో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులమంటూ ఐదుగురు వ్యక్తులు ఓ ఫ్లాట్లోకి చొరబడి రూ. 3 కోట్లు డిమాండ్ చేశారు. బాధితుడి తమ్ముడు అప్రమత్తమై అసలు పోలీసులను ఆశ్రయించడంతో గుట్టురట్టయింది. రంగంలోకి దిగిన పోలీసులు అపార్ట్మెంట్ గేటు వద్దే నిందితులను అడ్డుకున్నారు. ముగ్గురు పరారీ కాగా, నరసింహ రాజు, రవీంద్రబాబులను అరెస్ట్ చేసి కూకట్పల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ చాంద్రాయణగుట్టలోని మన్నత్ ఫంక్షన్ హాల్లో బురఖా ధరించిన ఇద్దరు కిలేడీలు చోరీకి పాల్పడ్డారు. వేడుకలో ఉన్న మహిళల నుంచి రూ. 60 వేల నగదు, సెల్ఫోన్ను కాజేశారు. బాధితుల ఫిర్యాదుతో సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా ఇద్దరు మహిళలు పర్సులు దొంగిలిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. ఫంక్షన్ హాల్ యాజమాన్యం సమాచారంతో పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
పెద్దపల్లి పోలీస్ స్టేషన్ను డీసీపీ రామ్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్లోని రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా జరుపుకోవాలని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జగిత్యాల రూరల్ మండలం లక్ష్మిపూర్ గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. పెద్దపల్లి జిల్లా తుర్కల మద్దికుంట గ్రామానికి చెందిన మహేందర్ అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు కొట్టి దారుణంగా హత్య చేశారు. అనంతరం నిందితులు సాక్ష్యాధారాలు దొరకకుండా ఉండేందుకు ఇంటి ముందు కారంపొడి చల్లారు. ఈ హత్యకు అక్రమ సంబంధమే కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పీఎస్ పరిధిలో దొంగతనానికి ప్రయత్నించిన ఓ వ్యక్తిని స్థానికులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. పటేల్ నగర్లోని ఒక ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న బైక్ను దొంగిలించేందుకు నిందితుడు ప్రయత్నించాడు. బైక్ స్టార్ట్ చేసే క్రమంలో వచ్చిన శబ్దానికి యజమాని అప్రమత్తమై కేకలు వేశారు. వెంటనే స్థానికులు దొంగను పట్టుకుని దేహశుద్ధి చేశారు.
ప్రభుత్వ ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న కిలాడీ లేడీ స్వరూపను నిజామాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు వసూలు చేసినట్లు గుర్తించారు. ఈమెతో పాటు సహకరించిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ కుబేరుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరినీ పోలీసులు రిమాండ్కు తరలించారు.
ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం జరిగింది. చెత్తను డస్ట్ బిన్లో వేయాలని చెప్పిన పారిశుద్ధ్య కార్మికుడు యాకోబుపై ఇద్దరు యువకులు దాడికి తెగబడ్డారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలు స్థానిక సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుల కోసం దర్యాప్తు ప్రారంభించారు.
అల్లూరి జిల్లా పర్యాటక ప్రాంతమైన మారేడుమిల్లికి వెళ్లే సందర్శకులకు పోలీసులు కీలక హెచ్చరిక జారీ చేశారు. అటవీ ప్రాంతంలో ల్యాండ్ మైన్లు, ప్రెజర్ మైన్లు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో.. ఎవరూ అడవి లోపలికి వెళ్లొద్దని సూచించారు. మైన్లను పూర్తిగా వెలికితీసే వరకు పర్యాటకులు, స్థానికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు స్పష్టం చేశారు.
పల్నాడు జిల్లా మెప్మాలో అక్రమాలపై దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు. నరసరావు పేట ఇండియన్ బ్యాంక్, పిడుగురాళ్లలోని గ్రామీణ బ్యాంకులో జరిగిన అక్రమాల గురించి తేల్చేందుకు విచారణ కమిటీ వేశారు జిల్లా కలెక్టర్. నరసరావుపేట ఆర్టీఓ, డీఎస్పీ, మెప్మా పీడీ,LDMలతో కమిటీ ఏర్పాటు చేశారు.
ప్రకాశం జిల్లా నర్సాయపాలెంలో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారయత్నం జరిగిన దారుణ ఘటన కలకలం రేపింది. కిరాణా షాపునకు వెళ్లిన బాలికలపై నిందితుడు పిక్కిలి ఆంజనేయులు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాధితుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు యర్రగొండపాలెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
గుంటూరు మార్కెట్ యార్డు నూతన కుర్రా అప్పారావు ఛైర్మన్గా నియమితులైయారు. చిలకలూరిపేట టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ను కలిసి ఛైర్మన్ అప్పారావు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రైతులకు మెరుగైన సేవలు అందిస్తానని హామీ ఇచ్చారు.
ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తన ఆయుధ సంపత్తిని మరింత పెంచుకోవాలని భావిస్తున్నారు. వచ్చే ఐదేళ్లలో మరిన్ని క్షిపణి వ్యవస్థలను రూపొందించేందుకు సిద్ధమయ్యారు. సంబంధిత అధికారులకు కిమ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్లు ఉత్తరకొరియా మీడియా కథనం వెల్లడించింది.
బంగ్లాదేశ్లో ముస్లిమేతరులు సహా పలువురి మీద జరుగుతున్న దాడులపై ప్రకంపనలు కొనసాగుతున్నాయి. విప్లవవాద నాయకుడు షరీఫ్ ఒస్మాన్ హడీ హత్యను నిరసిస్తూ అతని మద్దతుదారులు ఢాకాలోని కీలక కూడలిని దిగ్బంధం చేశారు. న్యాయం చేయాలని నినదిస్తూ బైఠాయించారు.
న్యాయస్థానం అంటే కేవలం విచారణ జరిగే స్థలంగా కాక వివాదాల సమగ్ర పరిష్కారానికి అనేక ద్వారాలు తెరచివున్న కేంద్ర స్థానంగా మారాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆకాంక్షించారు. దక్షిణ గోవాలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మధ్యవర్తిత్వంపై నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు.
మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్ కలిసి సందడి చేయనున్న మన శంకరవరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని ప్రత్యేక మాస్ గీతంను ఈ నెల 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ వినోదాత్మక చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కానుంది.
శ్రీలంకతో టీ20 సిరీస్లో భారత మహిళల జట్టుకు ఎదురే లేదు. హ్యాట్రిక్ విజయం సాధించిన హర్మన్ప్రీత్ సేన.. అయిదు టీ20ల సిరీస్ను మరో రెండు మ్యాచ్లు మిగిలుండగానే 3-0తో చేజిక్కించుకుంది. తిరువనంతపురంలో జరిగిన మూడో టీ20లో భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.