మేడారంలో వనదేవతల సన్నిధి భక్తులతో పోటెత్తింది. ఆదివారం సెలవు దినం కావడంతో సమ్మక్క-సారలమ్మలను దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జాతర ముందస్తు మొక్కులు, కొనసాగుతున్న అభివృద్ధి పనుల నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఆటంకం కలగకుండా జిల్లా ఎస్పీ భద్రతా ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ పశ్చిమగోదావరి జిల్లా పీఎం లంకలో పర్యటించారు. ఆమెకు రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు ఘన స్వాగతం పలికారు.
ఏపీలో జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ప్రాథమిక నోటిఫికేషన్పై వచ్చిన 927 అభ్యంతరాలు, సూచనలను పరిగణనలోకి తీసుకుని స్వల్ప మార్పులతో తుది నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.
GHMC పునర్విభజన నేపథ్యంలో హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లను మొత్తం 12 జోన్లుగా పునర్విభజన చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఇకపై హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలోకి రానుంది. హైదరాబాద్లో చార్మినార్, రాజేంద్రనగర్ వంటి 6 జోన్లు, సైబరాబాద్లో శేరిలింగంపల్లి, కూకట్పల్లి సహా 3 జోన్లు ఉండనున్నాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా వెంకటాపూర్లో భూవివాదం దాడులకు దారితీసింది. మాజీ సర్పంచ్ కోళ నర్సయ్య, ఆయన తమ్ముడిపై.. అరవింద్ అనే వ్యక్తులు కర్రలతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అన్నదమ్ములను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. భూమి కొనుగోలు వ్యవహారంలో ఇరువర్గాల మధ్య నెలకొన్న విభేదాలే ఈ దాడికి కారణమని తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా కడ్తాల్లో రెండో రోజు జాగృతి బాట పర్యటనలో భాగంగా కవిత మైసిగండి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అమనగల్లోని నివాస ప్రాంతాల మధ్య ఉన్న డంపింగ్ యార్డ్ను పరిశీలించి.. దానివల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులపై ఆందోళన వ్యక్తం చేశారు.
మహబూబాబాద్ జిల్లా గాంధీ పార్క్ వద్ద ఎమ్మెల్యే మురళీ నాయక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు నిరసన చేపట్టారు. ఉపాధి హామీ పథకంలో మార్పులు పేదలకు శాపంగా మారాయని.. ఇది రాష్ట్రాలపై ఆర్థిక భారం మోపుతుందని ఎమ్మెల్యే విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేక నిర్ణయాలను రద్దు చేసే వరకు పోరాటం ఆపబోమని ఆయన స్పష్టం చేశారు.
సంగారెడ్డి జిల్లా కంది చౌరస్తా వద్ద వంద మందికి పైగా విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. కర్ణాటకకు చెందిన రెండు స్కూల్ బస్సుల డ్రైవర్లు అతివేగంగా, రాంగ్ రూట్లో నడపడంతో పోలీసులు ఐదు కిలోమీటర్లు వెంబడించి మరీ బస్సులను అడ్డుకున్నారు. విద్యార్థులు విహారయాత్రకు వెళ్తుండగా జరిగిన ఈ ఘటనతో పోలీసులు డ్రైవర్లను మందలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.
వరంగల్ జిల్లా పర్వతగిరిలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడం, పథకం నుంచి గాంధీ పేరు తొలగించడాన్ని నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో రహదారిపై బైఠాయించారు. కేంద్రం తన నిర్ణయాలను వెనక్కి తీసుకోకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
రాజన్న సిరిసిల్లలో కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జెండా ఆవిష్కరించారు. దేశాభివృద్ధి, సంక్షేమ పథకాలు కాంగ్రెస్తోనే సాధ్యమయ్యాయని అన్నారు. బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ పథకం నుంచి గాంధీ పేరును తొలగించడాన్ని ఆయన తప్పుబట్టారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో ఆర్టీసీ డ్రైవర్పై తాగుబోతులు జరిపిన దాడి కలకలం రేపింది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు నియోజకవర్గంలోనే ఈ ఘటన జరగడం గమనార్హం. ఆకతాయిలు డ్రైవర్తో పాటు ప్రయాణికులపై కూడా దాడికి తెగబడ్డారు. పోలీసులు ఫిర్యాదుపై సరిగ్గా స్పందించలేదని డ్రైవర్ ఆరోపిస్తున్నారు. విధి నిర్వహణలో తమకు రక్షణ లేదని ఆర్టీసీ సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి నియోజకవర్గంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటించారు. భువనగిరి నుంచి కాటేపల్లి వరకు 49.5 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న ఆర్ అండ్ బి రోడ్డు పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, ఎమ్మెల్సీ సత్యం తదితరులు పాల్గొన్నారు.
విజయవాడలో ‘ఫిట్ ఇండియా ఆన్ సండేస్’ సైకిల్ రన్ను కలెక్టర్ డా. లక్ష్మీశ ప్రారంభించారు. 50 మంది చిన్నారులతో కలిసి దాదాపు 9 కి.మీ. సైక్లింగ్ చేసిన ఆయన.. శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు కాలుష్య రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ సైక్లింగ్ను అలవాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు. క్రీడా శాఖ అధికారులు, సైక్లింగ్ అసోసియేషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
తిరుమల అలిపిరి మెట్లమార్గంలోని 7వ మైలు వద్ద అపోలో కార్డియాక్ సెంటర్ సహకారంతో ఏర్పాటు చేసిన ఫస్ట్ ఎయిడ్ సెంటర్ను టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు ప్రారంభించారు. నడకదారి భక్తుల ఆరోగ్య భద్రత, ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యల తక్షణ పరిష్కారం కోసం దీనిని నెలకొల్పారు.
ఏలూరు జిల్లా ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సమక్షంలో చిన్న వెల్లమిల్లి గ్రామానికి చెందిన 30 మంది వైసీపీ నేతలు జనసేనలో చేరారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ సర్పంచ్ రత్తయ్యతో పాటు ఇతరులకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ సుపరిపాలనపై నమ్మకంతోనే ఈ చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
బంగ్లాదేశ్లో హిందూ యువకుడు దీపూ చంద్రదాస్ హత్యను అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రో ఖన్నా తీవ్రంగా ఖండించారు. విద్వేషపూరిత దాడులకు వ్యతిరేకంగా ప్రపంచం గళమెత్తాలని పిలుపునిచ్చారు. అమెరికా విదేశాంగ శాఖ కూడా ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మత స్వేచ్ఛకు మద్దతు ప్రకటించింది. బంగ్లా ప్రభుత్వం అన్ని వర్గాలకు భద్రత కల్పించాలని కోరింది.
కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఉపాధి హామీ పథకాన్ని మోదీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని, రాజ్యాంగ విలువలను కాలరాస్తోందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పోరాట పటిమ తగ్గలేదని, దేశ భవిష్యత్తు, ప్రజాస్వామ్య రక్షణ కోసం పార్టీ నిరంతరం పోరాడుతుందని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్లోని చిల్లాయ్ కలాన్ లోయల్లో 35 మంది పాకిస్తాన్ ఉగ్రవాదుల కదలికలను ఇంటెలిజెన్స్ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన భారత ఆర్మీ కిష్టావర్, దోడా జిల్లాల్లో భారీ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ ప్రారంభించింది. గడ్డకట్టే చలిని, మంచు కొండలను లెక్కచేయకుండా సైనికులు ముమ్మరంగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు.
టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టు క్రికెట్లోకి పునరాగమనం చేయాలని మాజీ క్రికెటర్ నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ ఆకాంక్షించారు. దేవుడు తనకు ఒక కోరిక కోరుకోమంటే, కోహ్లీ తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుని మళ్ళీ టెస్టులు ఆడేలా చేయమని అడుగుతానని సిద్ధూ ఇన్స్టాగ్రామ్లో పేర్కొన్నారు. 20 ఏళ్ల యువకుడిలా ఫిట్నెస్తో ఉన్న కోహ్లీని 24 క్యారెట్ల బంగారం అని ఆయన అభివర్ణించారు.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘ది రాజాసాబ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్ రిద్ధి కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. తనకు ఈ అవకాశమిచ్చిన ప్రభాస్కు రుణపడి ఉంటానని, ఆయన బహుమతిగా ఇచ్చిన చీరనే ఈ వేడుక కోసం మూడేళ్లుగా దాచుకుని ధరించానని తెలిపారు. మారుతి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది.