తెలంగాణ ప్రజలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు టీ-పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ప్రాంతాలుగా విడిపోయినా.. కుటుంబసభ్యుల్లాగా ఉన్నామన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి.. అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్టేనన్నారు.
రాష్ట్ర మంత్రి నారా లోకేష్, కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హోంమంత్రి అమిత్ షా లను కలిశారు. మొంథా తుపాను కారణంగా ఏపీలో సంభవించిన భారీ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. తుపాను కారణంగా రాష్ట్రంలోని 24 జిల్లాల్లో 443 మండలాల్లోని 3,109 గ్రామాలు ప్రభావితమయ్యాయని వివరించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతోపాటు మౌలిక సదుపాయాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు.
రాజధాని అమరావతిలో రెండో విడత భూ సమీకరణకు కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 7 గ్రామాలలో 16 వేల 666.57 ఎకరాల పట్టా, అసైన్డ్ భూమి సమీకరణ చేసేందుకు ఆదేశాలు ఇచ్చింది. భూ సమీకరణ బాధ్యతను సీఆర్డీఎ కమిషనర్కు అప్పగించింది. పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని 4 గ్రామాల పరిధిలో భూ సమీకరణ చేయనున్నారు.
ఏలూరు జిల్లా నూజివీడు మండలం జంగంగూడెం-దేవరకుంట గ్రామాల మధ్య సరిహద్దు వివాదం ఉద్రిక్తతలకు దారితీసింది. ఇవాళ రెవెన్యూ, పోలీస్, అటవీశాఖ అధికారులతో కలిసి ఇరు గ్రామస్తులతో మంత్రి పార్థసారథి చర్చించారు. స్పాట్లో 4 గంటల పాటు ఆఫీసర్లతో భూములను పరిశీలించిన మంత్రి..ఫారెస్ట్ DFO, సబ్ కలెక్టర్కు పలు సూచనలు చేశారు.
సస్పెన్షన్లో ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి పి.వి సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు జై భీమ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్. కాపులు, దళితుల కలిస్తే రాజ్యాధికారం వస్తుందని సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఉద్దేశించినవో, లేక వ్యక్తుల్ని ఉద్దేశించినో కాదన్నారు. పివి సునీల్ కుమార్ వ్యాఖ్యల మీద రఘురామకృష్ణం రాజు రాసిన లేఖపై న్యాయపరంగా పోరాటం చేస్తామన్నారు.
హైదరాబాద్లోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన విద్యార్థి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. అదే కళాశాలలో చదువుకునే అమ్మాయితో మంజునాథ్ ప్రేమలో పడ్డాడు. ఈ విషయం అమ్మాయి తల్లికి తెలవడంతో ఆమె ఇంటికి వచ్చి వార్నింగ్ ఇవ్వడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకున్నాడని మంజునాథ్ మేనమామ రవికుమార్ తెలిపారు.
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణ ప్రజలకు అవమానకరమని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ వెంటనే తన మాటలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని, బాధ్యతగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు.
కృష్ణా జిల్లా పామర్రు మండల కేంద్రంలోని అంకమ్మ తల్లి దేవాలయంలో చోరీ. అర్ధరాత్రి ఆలయ తాళాలు పగలగొట్టి హుండీలో ఉన్న నగదును దోచుకెళ్లారు దుండగులు. ఆలయ కమిటీ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పామర్రు పోలీసులు. ఘటనా స్థలంలో ఆధారాలు సేకరిస్తున్నారు క్లూస్ టీం సభ్యులు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులోని సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ మూడు రోజుల పాటు కనబడకుండా పోయి, ఈ రోజు తిరిగి ఇంటి వద్ద ప్రత్యక్షమయ్యారు. ఈ ‘హైడ్రామా’ మధ్య ఆమె స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్య సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆమె అదృశ్యం, తిరిగి రావడం, పార్టీలో చేరిక స్థానికంగా చర్చనీయాంశమైంది.
సిద్దిపేట జిల్లా నంగునూరు ఘనపూర్ గ్రామంలో ఎస్సీ రిజర్వుడ్ సర్పంచ్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేశారు. గ్రామంలో తనకు ఎవరూ మద్దతు ఇవ్వకపోవడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఈ ఘటన గ్రామంలో కలకలం సృష్టించింది.
సర్పంచి అభ్యర్థి ఆత్మహత్యాయత్నం
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డిపేట వద్ద ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై వెళ్తున్న ఒక ప్యాసింజర్ ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్రమై ఆటో పూర్తిగా దగ్ధమైంది. అయితే ఆటోలో ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.
ఎయిర్పోర్టులో తన తండ్రితో కలిసి జగన్ను చూసేందుకు వచ్చిన ఓ చిన్నారి కాలి నుండి చెప్పు జారిపడింది. వెంటనే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్కడకు వచ్చి, కింద పడిన చెప్పును తీసి ఆ బాలికకు అందించారు. ఈ దృశ్యం అందరి దృష్టిని ఆకర్షించింది.
కరీంనగర్ జిల్లా మానుకొండూర్ నియోజకవర్గంలోని తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలో ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రత్యేక దృష్టిని ఆకర్షించారు. ఆయన నామినేషన్ వేయడానికి ముందు జోగినిలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, వారిని వెంటబెట్టుకొని వెళ్లారు. ఈ అసాధారణ చర్య నియోజకవర్గంలో చర్చనీయాంశమై, ఎన్నికల ప్రక్రియలో సాంస్కృతిక అంశాల ప్రాధాన్యతను చాటింది.
తిరుపతి జిల్లా లక్ష్మీపురం గ్రామంలో హరి అనే వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందాడు. వరదయ్యపాలెం మండలంలోని ఖాళీ రేకుల ఇంట్లో రక్తపు మడుగులో మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు… స్థానికుల సమాచారం మేరకు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
దిత్వ తుఫాను ప్రభావంతో తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదయ్యపాలెం, బుచ్చినాయుడుకండ్రిగ, కె.వి.బి. పురం మండలం, సత్యవేడు రూరల్ మండలాలలో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
నాగర్ కర్నూల్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఎమ్మెల్సీ కుచుకుళ్ల దామోదర్ రెడ్డి, ఎమ్మెల్యే కుచుకుళ్ల రాజేష్, కాంగ్రెస్ పార్టీ మద్దతుతో బిజినపల్లి మండలం వడ్డెమాన్ గ్రామంలో రేవల్లి అనిత వెంకటరెడ్డి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. సొంత గ్రామానికి సేవ చేయాలనే దృక్పథంతో పోటీ చేస్తున్నానని అనిత రెడ్డి తెలిపారు.
రోహింగ్యా శరణార్థుల అదృశ్యంపై దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. దేశంలోకి అక్రమంగా ప్రవేశించే వారికి న్యాయస్థానం అసాధారణ రక్షణలు కల్పించాలా అని సీజేఐ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. చొరబాటుదారులను రెడ్కార్పెట్ వేసి ఆహ్వానించాలా అని పిటిషనర్ను ప్రశ్నించింది. సరిహద్దు సున్నితత్వం, చట్టవిరుద్ధంగా ప్రవేశించి ఆహారం, ఆశ్రయం వంటి హక్కులను డిమాండ్ చేస్తున్న రోహింగ్యాల బాధ్యత దేశంపై ఉందా అని వ్యాఖ్యానించింది.
హిందీ, మలయాళ చిత్ర పరిశ్రమల మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని నటుడు దుల్కర్ సల్మాన్ అన్నారు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో అలరిస్తున్న దుల్కర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్లో పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నరు. హిందీ సినిమాలో నటించేటప్పుడు పెద్ద స్టార్ అని అనిపించుకోకపోతే వాళ్లు ఎంతో నిర్లక్ష్యం చేస్తారని అన్నారు.
విశాఖ వేదికగా ఈనెల 6న జరగనున్న ఇండియా సౌత్ ఆఫ్రికా వన్డే క్రికెట్ మ్యాచ్ కోసం.. విశాఖ క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. ఇప్పటికే అన్ని టికెట్స్ అమ్ముడు పోవడంతో.. క్రికెట్ అభిమానుల తాకిడిని ముందుగానే ఊహించి స్టేడియాన్ని సిద్ధం చేస్తున్నారు.
ఐపీఎల్ 2026 సీజన్ కోసం డిసెంబరు 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. అయితే, ఈసారి చాలామంది స్టార్ ఆటగాళ్లు వివిధ కారణాలతో ఈ సీజన్కు దూరమవుతున్నారు. ఆస్ట్రేలియా ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ ఈ వేలానికి తన పేరును రిజిస్ట్రేషన్ చేసుకోలేదని సమాచారం.