కేరళలోని శబరిమలలో సీఎం రేవంత్ రెడ్డిపై ఉన్న అభిమానాన్ని అయ్యప్ప స్వాములు చాటుకున్నారు. అయ్యప్ప సన్నిధికి వెళ్లే మెట్ల మార్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. పదేళ్లు రేవంత్ రెడ్డియే సీఎంగా ఉండాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా స్వాములకు మెట్టు సాయికుమార్ అభినందనలు తెలిపారు. ప్రజల ఆకాంక్ష కూడా ఇదేనన్నారు ఫిషరీస్ ఛైర్మన్ మెట్టు సాయికుమార్.
పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుపై ఇవాళ సుప్రీంకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఏపీ నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్ధమంటూ తెలంగాణ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. గోదావరి జలాల వినియోగంపై ఇరు రాష్ట్రాల మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో, రేవంత్ సర్కార్ అభ్యంతరాలు, ఏపీ వాదనలపై సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చే తీర్పు ఆసక్తికరంగా మారింది.
హైదరాబాద్ రాష్ట్రపతి భవన్లో ఉద్యాన్ ఉత్సవ్ను అద్భుతంగా నిర్వహించారు. జనవరి 3 నుంచి 11 వరకు 9 రోజుల పాటు నిర్వహించిన ఉత్సవ్కు భారీగా తరలివచ్చారు. సెలవులు, ఆఖరి రోజు కావడంతో రాష్ట్రపతి భవన్ కిటకిటలాడింది. ఉద్యాన్ ఉత్సవ్లో ఏర్పాటు చేసిన హార్టికల్చర్, అగ్రకల్చర్ స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
హిందీ ప్రచార సభ – హైదరాబాద్ రూపొందించిన 2026 వార్షిక క్యాలెండర్ను ఆవిష్కరించారు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ. 90 ఏళ్లుగా హిందీ భాషాభివృద్ధికి సభ చేస్తున్న కృషిని గవర్నర్ అభినందించారు. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటకల్లో కూడా లక్షలాది మందికి హిందీ బోధన, శిక్షణ ఇస్తున్నట్లు సభ ప్రధాన కార్యదర్శి ఎస్.గైబువల్లి పేర్కొన్నారు.
గాల్లో ఎగరాల్సింది గాలిపటం కానీ అమాయకుల ప్రాణాలు కాదన్నారు సీపీ సజ్జనార్. చైనీస్ మాంజా దారం తెగదు.. మనుషుల మెడలు, పక్షుల రెక్కలు తెగ్గోస్తుందన్నారు. మీ క్షణికానందం మరొకరి ఇంట తీరని విషాదం కాకూడదన్నారు సీపీ సజ్జనార్. నిషేధిత చైనా మాంజా అమ్మినా.. వాడినా కఠిన చర్యలు తప్పవన్నారు. పండగని పండగలా జరుపుకోండి కానీ.. అమాయకుల ప్రాణాలను తీసి కాదంటూ ఎక్స్లో పోస్ట్ చేశారు సీపీ సజ్జనార్.
సంక్రాంతి సందర్భంగా కోడిపందేల నిర్వహణపై కీలక ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. జంతు హింస నిరోధక చట్టం 1960, ఏపీ జూద నిరోధక చట్టాలను కఠినంగా అమలుచేయాలని తెలిపింది. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించింది.
తిరుమల, తిరుపతి ప్రాంతాల తాగునీటి అవసరాలను తీర్చడంతోపాటు చంద్రగిరి గడ్డను సస్యశ్యామలం చేసేందుకు భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది ఏపీ ప్రభుత్వం. హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా నీవా బ్రాంచి కెనాల్ ద్వారా కృష్ణా జలాలను కళ్యాణి డ్యామ్కు తరలించే చారిత్రాత్మక ఘట్టం ఆరంభం కానుంది. ఈ నెల 13న మూలపల్లె చెరువు వద్ద సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. సంక్రాంతి వరుస సెలవుల హైదరాబాద్ నుంచి రాజమండ్రి, భీమవరం, వైజాగ్ మీదుగా వెల్తున్న వారు.. మార్గమధ్యలో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో అన్ని క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి.
ఏపీలో రికార్డు స్థాయి జాతీయ నిర్మాణ పనులు జరిగాయి. బెంగళూరు- కడప- విజయవాడ ఎకనామిక్ కారిడార్ ఏకంగా రెండు గిన్నిస్ రికార్డులను సాధించింది. ఆరవ తేదీ ఉదయం 10. 07 గంటల నుంచి 11 వ తేదీ ఉదయం వరకూ ఈ రోడ్డు నిర్మాణ పనులు జరిగాయి. ఆరు రోజుల్లో 52 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం సాగింది. వీటి ద్వారా NHAకి గిన్నిస్ రికార్డులు లభించాయి.
సంక్రాంతి వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ రైల్వే స్టేషన్, బస్టాండ్లు జనసంద్రమయ్యాయి. రద్దీ దృష్ట్యా అధికారులు భారీ భద్రత, ప్రత్యేక సర్వీసులు ఏర్పాటు చేసినప్పటికీ, రైళ్ల జాప్యంతో ప్రయాణికులు ఎదురుచూడక తప్పడం లేదు. ముఖ్యంగా గోదావరి జిల్లాలకు తరలివెళ్తున్న పర్యాటకులు, స్థానికులతో రవాణా మార్గాలన్నీ కిటకిటలాడుతున్నాయి.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డు సృష్టించారు. జపనీస్ కత్తి సాము కళ కెంజుట్సులో జపాన్ వెలుపల ప్రవేశం పొందిన తొలి వ్యక్తిగా నిలిచి.. ఫిఫ్త్ డాన్ పురస్కారం అందుకున్నారు. డాక్టర్ సిద్ధిక్ మహ్మద్ శిక్షణలో నైపుణ్యం సాధించిన పవన్కు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్ బిరుదు లభించింది.
జపనీస్ కత్తిసాము కెంజుట్సులో అరుదైన ప్రవేశం పొందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను మంత్రి నారా లోకేష్ అభినందించారు. సినీ, రాజకీయ రంగాల్లో రాణిస్తూనే మార్షల్ ఆర్ట్స్పై ఆయనకున్న జిజ్ఞాస, నిరంతర శ్రమ నేటి తరానికి గొప్ప స్ఫూర్తిదాయకమని లోకేష్ కొనియాడారు. ఎంత ఎత్తుకు ఎదిగినా కొత్త విషయాలు నేర్చుకునే పవనన్న తత్వం అద్భుతమంటూ ట్వీట్ చేశారు.
హైదరాబాద్ గచ్చిబౌలిలో నిషేధిత చైనా మాంజా మరో ప్రమాదానికి కారణమైంది. చైతన్య అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి బైక్పై వెళ్తుండగా, గాలిలో ఉన్న మాంజా దారం తగిలి చేతికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండుగ వేళ ప్రమాదకరమైన ఈ మాంజాపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
శ్రీకాకుళం జిల్లా పలాసలో నాటు తుపాకీ కలకలం రేపింది. రైల్వే పార్కింగ్ టెండర్ విషయంలో పాత కాంట్రాక్టర్ సురేష్, కొత్త కాంట్రాక్టర్ జనార్దన్పై ఆయుధాలతో దాడి చేయగా, పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి తుపాకీ, కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు కాశీబుగ్గ డీఎస్పీ వెల్లడించారు.
నిర్మల్ జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ కాలనీలో మూడేళ్ల బాలుడు అశ్విన్ అదృశ్యం కావడం కలకలం రేపింది. ఇంటి ముందు ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కనిపించకుండా పోయాడు. తల్లిదండ్రులు అనిల్, చంద్రికలు తమ కుమారుడి కోసం పరిసరాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. సీఐ నైలు నాయక్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
2026 సంవత్సరంలో ఇస్రో తన తొలి ప్రయోగానికి సిద్ధమైంది. తొలి ప్రయోగంగా పీఎస్ఎల్వీ-సీ62 ద్వారా డీఆర్డీఓ రూపొందించిన ‘అన్వేష’ ఉపగ్రహాన్ని నేడు నింగిలోకి పంపనుంది. శ్రీహరికోట నుంచి జరిగే ఈ మిషన్లో హైపర్స్పెక్ట్రల్ ఇమేజింగ్ టెక్నాలజీతో సరిహద్దు నిఘాను పటిష్టం చేయనున్నారు. అన్వేషతో పాటు మరో 15 చిన్న ఉపగ్రహాలను కక్ష్యలోకి చేర్చేందుకు శాస్త్రవేత్తలు సర్వం సిద్ధం చేశారు.
వారణాసిలో ఉపాధి హామీ పథకం రద్దుకు వ్యతిరేకంగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న NSUI విద్యార్థుల అరెస్టును ప్రియాంక గాంధీ తీవ్రంగా ఖండించారు. లక్షలాది మంది కార్మికుల ఉపాధి హక్కును మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని ఆమె మండిపడ్డారు. గొంతు ఎత్తే వారిపై బలప్రయోగం చేయడం పిరికిపంద చర్యని, ఈ అణచివేతపై కాంగ్రెస్ పోరాడుతుందని ప్రియాంక స్పష్టం చేశారు.
పాకిస్తాన్ తన వక్రబుద్ధిని మార్చుకోలేదు. మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. జమ్మూకాశ్మీర్ లోని ఫూంచ్ జిల్లాలో ఎల్ ఓసీ వెంబడి అనుమానిత డ్రోన్లను భద్రతా బలగాలు గుర్తించాయి. దీంతో అప్రమత్తమైన బలగాలు లైట్ మెషిన్ గన్ లతో వాటిని పేల్చాయి. అనుమానిత డ్రోన్లతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. సాయంత్రం రాజౌరి జిల్లాలోనూ డ్రోన్లు కనిపించినట్లు అధికారులు తెలిపారు. కొన్ని కలకోట్ లోని ధర్మసల్ వైపు వెళ్లాయని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వరప్రసాద్’ ప్రీమియర్ షోలతో బాక్సాఫీస్ వద్ద సందడి మొదలైంది. చిరు-వెంకీల కాంబినేషన్ కన్నుల పండుగగా ఉందంటూ అభిమానులు జేజేలు పలుకుతున్నారు. అనిల్ రావిపూడి మరో హిట్టు కొట్టారని, ఈ సంక్రాంతి విన్నర్ మెగాస్టారేనని వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్ సహా ప్రేక్షకులు ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ అంటూ సంబరాలు చేసుకుంటున్నారు.
వడోదర వన్డేలో భారత్ సూపర్బ్ విజయం సాధించింది. నాలుగు వికెట్ల తేడాతో కివీస్పై సూపర్బ్ విక్టరీ కొట్టింది. దీంతో.. మూడు వన్డేల సిరీస్లో 1-0 తేడాతో నిలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన కివీస్ 8 వికెట్ల నష్టానికి 300 రన్స్ చేయగా.. టీమిండియా టార్గెట్ను 6 వికెట్లు కోల్పోయి చేధించింది. 306 రన్స్ చేసి బంపర్ విక్టరీ కొట్టింది. భారత బ్యాటర్లలో కోహ్లీ 93 రన్స్తో చెలరేగగా.. గిల్ 56, అయ్యర్ 49 పరుగులతో దుమ్మురేపారు.