కవిత వ్యాఖ్యలకు మాజీ మంత్రి హరీశ్రావు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. అసెంబ్లీ లాబీలో మంత్రి చిట్చాట్ నిర్వహించారు. కేసీఆర్ను మోసం చేసి హరీశ్రావు అంతా దోచుకున్నారని స్వయంగా కవిత చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు మంత్రి. కాళేశ్వరం, పాలమూరు వ్యవహారంలో కేసీఆర్ను ఇరికించారని ఆమె అన్న విషయాన్ని ప్రస్తావించారు మంత్రి కోమటిరెడ్డి.
రంగారెడ్డి జిల్లా మైలర్దేవ్పల్లి డివిజన్ బాబుల్రెడ్డి నగర్లో విషాదం జరిగింది. ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు అప్పుడే పుట్టిన పసికందును రోడ్డు పక్కన ఉన్న చెత్తకుప్పలో పారవేయగా.. ఆ చిన్నారి మృతి చెందింది. ఈ దారుణాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వాతావరణ పరిస్థితులు, సాంకేతిక సమస్యల కారణంగా విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శంషాబాద్ నుంచి సిలిగురి వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం టేకాఫ్ సమయంలో రన్వేపై సాంకేతికలోపానికి గురైంది. పైలట్ వెంటనే అప్రమత్తమై విమానాన్ని టెర్మినల్కు తరలించడంతో 137 మంది ప్రయాణికులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు.
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ధర్మపురి మండలం జైనా గ్రామానికి చెందిన రాజనర్సయ్య కాలు విరిగి తీవ్ర గాయాలతో 108 వాహనంలో ఆసుపత్రికి రాగా.. అరగంట గడిచినా సిబ్బంది పట్టించుకోలేదు. 108 సిబ్బంది వాహనం నిలిపి కబుర్లలో మునిగిపోగా.. ఆసుపత్రి సిబ్బంది బయటకు రాకపోవడంతో బాధితుడు వాహనంలోనే నరకయాతన అనుభవించాడు.
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా జీహెచ్ఎంసీ చేపట్టిన ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం ఏడో రోజు ముమ్మరంగా కొనసాగుతోంది. నగరంలోని 300 వార్డులలో క్షేత్రస్థాయి సానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ను జీహెచ్ఎంసీ అధికారులు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఏడో రోజు ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ స్తంభాల వద్ద ఉన్న వ్యర్థాల తొలగింపు, క్లీనింగ్ పై ప్రత్యేక దృష్టి సారించారు.
బాన్సువాడ నియోజకవర్గం బోర్లం గ్రామ శివారులో పర్వా రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీరామ నామస్మరణ – గురు వందనం కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆశీస్సులతో జరిగిన ఈ వేడుకకు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, ఆగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
అల్లూరి జిల్లా అరకులోయలో పర్యటించిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కుటుంబ సమేతంగా ట్రైబల్ మ్యూజియం, పద్మాపురం గార్డెన్స్, బొర్రా గుహలను సందర్శించిన ఆయన.. అరకు ప్రకృతి అందాలు అద్భుతంగా ఉన్నప్పటికీ, వాటి నిర్వహణలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి వచ్చిన రిటైర్డ్ ఉద్యోగులను అరెస్ట్ చేశారు పోలీసులు. పెన్షన్ దారులకు పాత బకాయిలు చెల్లించడం లేదంటూ ఆందోళన చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులు. పెండింగ్లో ఉన్న DAలను వెంటనే విడుదల చేయాలంటూ అసెంబ్లీని ముట్టడించారు. బక్క జడ్సన్, మరి కొంతమంది రిటైర్డ్ ఉద్యోగులను అరెస్ట్ చేసి తీసుకెళ్లారు పోలీసులు.
జోగులాంబ గద్వాల జిల్లాలో దారుణ హత్య జరిగింది. గట్టు మండలం మాచెర్ల శివారులో.. బలిగేర గ్రామానికి చెందిన కయాన్ అనే యువకుడిని.. గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న గట్టు ఎస్సై వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. వివాహేతర సంబంధమే హత్యకు ప్రధాన కారణంగా తెలుస్తుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలం, ఏడూళ్ల బయ్యారం గ్రామంలోని ZPHS పాఠశాల ప్రాంగణంలో 69వ అండర్-17 జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. కంది చారిటబుల్ ఫౌండేషన్, మోల్టెక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈనెల 7వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఉప ఎన్నికలు భారీ బందోబస్తు మధ్య ప్రారంభమయ్యాయి. మొత్తం 16 మంది ఎంపీటీసీలకు గాను 15 మంది పోలింగ్ కేంద్రానికి చేరుకోగా.. ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు, ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎంపీటీసీలతో కలిసి కేంద్రంలోకి వెళ్లారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ రవిబాబు 144 సెక్షన్ విధించారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సుబ్బరాంపల్లిలో దారుణ హత్య జరిగింది. గ్రామ శివారులోని ఇటుకల బట్టీలో పనిచేస్తున్న ఒరిస్సా వలస కూలీ జితేందర్ను.. తోటి కూలీలు మద్యం మత్తులో జరిగిన గొడవ కారణంగా హత్య చేశారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.
శ్రీ సత్యసాయి జిల్లా అగళి మండలంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఎస్సై శోభారాణి ఆధ్వర్యంలో గ్రామాల్లో ఇంటింటా తనిఖీలు చేపట్టడంతో పాటు, కోడికొండ–శిర జాతీయ రహదారిపై వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులోని పుణ్యక్షేత్రంలో శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. పాపమాంబ వంశీయులు మేళతాళాలతో బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మునియేరు నది తీరాన వెలసిన ఈ శక్తి స్వరూపిణిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.
వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం తురకల క్రాస్రోడ్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గోదావరిఖని నుంచి బూరుగుమ్మడ్లలో వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో వెళ్తున్న కారు,.. పొగ మంచు కారణంగా అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు గాయపడగా.. ఒకరికి బలమైన గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.
పంజాబ్లో ఆమ్ ఆద్మీ పార్టీ నేత హత్యకు గురయ్యారు. తంగ్ తారన్ జిల్లా వాల్టోహా గ్రామ సర్పంచ్ జర్మల్ సింగ్ను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అమృత్సర్ జిల్లా, వెర్కా బైపాస్ దగ్గర ఉన్న ఒక రిసార్ట్లో పెళ్లి వేడుకకు హాజరైన జర్మల్ సింగ్ను హత్య చేశారు.
శబరిమలలో అయ్యప్ప స్వాముల కోసం శ్రీ భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ప్రతియేటా అన్నదానం నిర్వహించడం అభినందనీయమని రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. గత 20 ఏళ్లుగా అయ్యప్ప భక్తులకు అన్నప్రసాదాలు అందిస్తున్నారన్నారు. హైదరాబాద్ ఉస్మాన్ గంజ్లోని భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి కార్యాలయం నుంచి అన్నదానంకు సంబంధించిన వంట సామగ్రి లారీని అనిల్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు.
వెనెజువెలా తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు, చమురు, ఆర్థికశాఖల మంత్రి డెల్సీ రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తోంది. వెనెజుయెలా చట్టాల ప్రకారం.. ఆమే బాధ్యతలు చేపట్టాలని సుప్రీం కోర్టు సూచించడం, దేశ సైన్యం ఆమెకు మద్దతుగా నిలిచిన నేపథ్యంలో రోడ్రిగ్జ్ అధికార బాధ్యతలు తీసుకున్నట్లు సమాచారం.
బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ అఖండ2: తాండవం. డిసెంబరులో విడుదలైన ఈ మూవీ బాలకృష్ణ అభిమానులను విశేషంగా అలరించింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమైంది. సంక్రాంతి కానుకగా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో జనవరి 9వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానుంది.
రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన అద్భుతమైన ఫామ్తో 2026లోనూ సరికొత్త రికార్డుల వేటను కొనసాగించబోతున్నారు. టీ20, టెస్ట్లకు రిటైర్మెంట్ ప్రకటించి, వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విరాట్.. త్వరలో న్యూజిలాండ్తో జరుగబోయే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్లో బరిలోకి దిగుతాడు.