Kalvakuntla Kavitha: “నైతిక విలువల కోసమే బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నా.. దయచేసి ఆమోదించండి.” అని కవిత మండలి చైర్మన్కు విజ్ఞప్తి చేశారు. మండలిలో మాట్లాడుతూ.. పార్టీ కట్టుబాట్లు తన ప్రజాసేవకు అడ్డంకిగా మారాయని, అందుకే ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో కొనసాగడం ఇష్టం లేదని స్పష్టం చేశారు. 20 ఏళ్ల ప్రజా జీవితంలో తెలంగాణ జాగృతి ద్వారా ఉద్యమంలో, బతుకమ్మ వ్యాప్తిలో తాను పోషించిన పాత్రను గుర్తు చేసుకుంటూ, తనపై కుట్రలు చేశారంటూ సభలో భావోద్వేగానికి లోనయ్యారు.
తెలంగాణ ఉద్యమంలో తన పాత్రను ప్రశ్నిస్తున్న వారికి కవిత గట్టిగా బదులిచ్చారు. “గల్లీలో కొట్లాడటమే కాదు.. ఢిల్లీ లాబీల్లోనూ నా పాత్ర ఉంది” అని ఆమె స్పష్టం చేశారు. 2013లో సోనియా గాంధీ సన్నిహితుడైన ఆస్కార్ ఫెర్నాండెజ్తో కేసీఆర్ భేటీని తానే ఏర్పాటు చేశానని, ఆ తర్వాతే సోనియా గాంధీ జోక్యం చేసుకుని తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేశారని సంచలన విషయం బయటపెట్టారు. 2006లో జాగృతి ద్వారా ఉద్యమంలోకి వచ్చానని, బతుకమ్మను విశ్వవ్యాప్తం చేశానని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని కవిత ధ్వజమెత్తారు. పార్టీలో, ప్రభుత్వంలో జరుగుతున్న తప్పులను, అవినీతిని ప్రశ్నించినందుకే తనపై కక్షగట్టి దూరం పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అమరవీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, సచివాలయం నిర్మాణాల్లో తీరని అవినీతి జరిగిందని ఆరోపించారు. సిద్దిపేట, సిరిసిల్ల కలెక్టరేట్లు వరదల్లో మునిగిపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
తెలంగాణ వచ్చాక కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేయకపోగా, అవుట్సోర్సింగ్ను పెంచారని విమర్శించారు. నేరేళ్ల ఇసుక దందాలో దళిత బిడ్డలు బలయ్యారని, బోధన్ షుగర్ ఫ్యాక్టరీని నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉద్యమకారులకు సాయం చేద్దామంటే పట్టించుకోలేదని, నీళ్లు-నిధులు-నియామకాల నినాదానికి గండికొట్టారని కవిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Read Also: Telangana: మా పెన్షన్ బకాయిలు ఏవి? అసెంబ్లీ ముట్టడికి యత్నించిన రిటైర్డ్ ఉద్యోగులు అరెస్ట్