Tirupati district: తిరుపతి జిల్లాలో చోటుచేసుకున్న ఒక వినూత్న సంఘటన ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. క్షుద్ర పూజల భయంతో ఒక తండ్రి తన కుమారుడి సమాధి వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం సంచలనం సృష్టించింది.
చంద్రగిరి మండలం కందులవారిపల్లికి చెందిన ఒక దంపతులకు ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. అనారోగ్య కారణాలతో ఆ బాలుడు వారం రోజుల క్రితం మృతి చెందాడు. ఆ బాలుడు ఆ దంపతులకు మొదటి సంతానం కావడంతో.. మృతదేహాన్ని క్షుద్ర పూజల కోసం దుండగులు వెలికి తీసే అవకాశం ఉందని స్థానికులు బాలుడి తండ్రిని హెచ్చరించారు.
మొదట్లో భయపడిన తండ్రి.. కుమారుడి సమాధిని రక్షించుకోవడానికి ఇద్దరు వ్యక్తులను కాపలాగా పెట్టాడు. అయితే.. దీని కోసం రోజుకు రూ. 1,500 వరకు ఖర్చు అవుతుండటంతో పాటు.. రాత్రి వేళల్లో నిఘా కష్టతరంగా మారింది. దీనికి శాశ్వత పరిష్కారంగా ఆయన ఒక వినూత్న ఆలోచన చేశాడు.
స్మశానవాటికలో బాలుడి సమాధి వద్ద 360 డిగ్రీల కోణంలో పనిచేసే అత్యాధునిక సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించాడు. దీని ద్వారా తన మొబైల్ నుంచే ఎప్పటికప్పుడు సమాధి వద్ద పరిస్థితులను గమనిస్తున్నాడు.
నమ్మకాలకు, సాంకేతికతకు మధ్య జరిగిన ఈ పోరాటం ఇప్పుడు జిల్లాలో హాట్ టాపిక్ గా మారింది. మూఢనమ్మకాల పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని ఈ ఘటన ప్రతిబింబిస్తోంది.
ALSO READ: Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్