HYDRA: అక్రమ కట్టడాలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా, పాతబస్తీలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. బండ్లగూడ మండలం పరిధిలోని కందికల్ విలేజ్, మొహమ్మద్ నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో కబ్జాకు గురైన సుమారు 7 ఎకరాల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వరకు ఉంటుందని అంచనా.
కందికల్ విలేజ్లోని సర్వే నంబర్ 28లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో ఇప్పటికే రెండు ఎకరాలు ఆక్రమణకు గురై నివాసాలు వెలిశాయి. మిగిలిన 7 ఎకరాల భూమిని ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు పట్టాభిరామి రెడ్డి అనే వ్యక్తులు తమదిగా చెప్పుకుంటూ కబ్జాకు ప్రయత్నించారు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్కడ ఒకప్పుడు చెరువు, నాలా ఉండగా.. కబ్జాదారులు వాటిని మట్టితో పూడ్చివేసి ప్లాట్లుగా మార్చేందుకు యత్నించారు. ఈ వ్యవహారంపై గతంలోనే రెవెన్యూ అధికారులు భవానీపురం పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేశారు. పైగా, ప్రభుత్వ భూమిని తమదిగా చెప్పుకుంటూ కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు కబ్జాదారులకు కోర్టు రూ. కోటి జరిమానా కూడా విధించింది. అయినప్పటికీ, వారు వెనక్కి తగ్గకుండా ఇనుప రేకులతో ప్రహరీ నిర్మించి లోపల అక్రమ కార్యకలాపాలు సాగిస్తున్నారు.
స్థానిక ‘కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ’ ప్రతినిధులు, నివాసితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఆదేశాల మేరకు అధికారులు మెరుపు దాడి చేశారు. పోలీసు బందోబస్తు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఆక్రమణదారులు నిర్మించిన ఇనుప ప్రహరీలను తొలగించారు. అనంతరం ఆ 7 ఎకరాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, అది ప్రభుత్వ భూమి అని తెలిపే బోర్డులను పాతారు. అంగుళం ఖాళీ దొరకని పాతబస్తీలో ఇంత భారీ స్థాయిలో భూమిని కాపాడటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈ భూమిని కాపాడటం వల్ల కేవలం ఆస్తిని కాపాడటమే కాకుండా.. పాతబస్తీకి పర్యావరణ ప్రయోజనం కూడా చేకూరుతుందని అధికారులు భావిస్తున్నారు. ఇక్కడ కబ్జాకు గురైన చెరువును, నాలాలను పునరుద్ధరిస్తే, బమృక్-ఉద్దౌలా మాదిరిగా ఆహ్లాదకర వాతావరణం ఏర్పడుతుందని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా.. నాలాల పునరుద్ధరణ ద్వారా చుట్టుపక్కల ప్రాంతాలకు వరద ముప్పు తప్పుతుందని వారు పేర్కొన్నారు.
బడా బాబుల అండతో సాగుతున్న ఈ భూదందాను అరికట్టి.. నిష్పక్షపాతంగా వ్యవహరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్కు స్థానిక ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ విజయం అక్రమార్కులకు ఒక గట్టి హెచ్చరిక అని సామాజిక కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
ALSO READ: Students Conflict: చిచ్చు పెట్టిన మేకు.. నర్సంపేట గురుకులంలో పొట్టు పొట్టు కొట్టుకున్న స్టూడెంట్స్