New cancer injection: క్యాన్సర్ మహమ్మారి పేరు వింటేనే గుండె ఝల్లుమంటుంది. గంటల కొద్దీ హాస్పిటల్ బెడ్పై ఉంటూ కీమోథెరపీ, ఐవీ (IV) ఇన్ఫ్యూషన్లు తీసుకోవడం పేషెంట్లకు నరకప్రాయం. కానీ.. ఇకపై ఆ బాధలు తగ్గే రోజులు వచ్చేశాయి. క్యాన్సర్ ట్రీట్మెంట్లో భారత్ ఒక విప్లవాత్మక అడుగు వేసింది. కేవలం 7 నిమిషాల్లోనే ఇచ్చే సరికొత్త క్యాన్సర్ ఇంజెక్షన్ ఇండియాలో లాంచ్ అయింది. రోచ్ ఫార్మా ఇండియా తీసుకొచ్చిన ఈ సరికొత్త టెక్నాలజీ విశేషాలు, దాని పనితీరు, ధర గురించిన పూర్తి వివరాలు..
ఏంటి ఈ 7 నిమిషాల క్యాన్సర్ ఇంజెక్షన్?
సాధారణంగా క్యాన్సర్ పేషెంట్లకు ఇమ్యునోథెరపీ ఇవ్వాలంటే నరాల ద్వారా (IV Infusion) గంటల తరబడి ఎక్కించాల్సి ఉంటుంది. దీని వల్ల పేషెంట్లు తీవ్రంగా అలసిపోతారు. అయితే.. ఇప్పుడు వచ్చిన కొత్త డ్రగ్ ‘టెక్సెంట్రిక్’ ఈ ప్రాసెస్ను పూర్తిగా మార్చేసింది.
ఇది ఒక సబ్క్యుటేనియస్ ఇంజెక్షన్. అంటే దీనిని చర్మం కింద (సాధారణంగా తొడ భాగంలో) ఇస్తారు. ఈ ఇంజెక్షన్ ఇవ్వడానికి డాక్టర్లకు కేవలం 7 నిమిషాల సమయం మాత్రమే పడుతుంది. దీనివల్ల హాస్పిటల్లో గంటల కొద్దీ వేచి ఉండాల్సిన అవసరం లేదు. బెడ్స్ కొరత తగ్గుతుంది పేషెంట్ల శ్రమ కూడా తప్పుతుంది.
ఇది ఏ క్యాన్సర్కు పని చేస్తుంది? ఎలా పని చేస్తుంది?
ఈ సరికొత్త ఇంజెక్షన్ను ముఖ్యంగా ‘నాన్-స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్’బారిన పడిన రోగుల కోసం తీసుకొచ్చారు. మన దేశంలో వచ్చే ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసుల్లో ఇదే అత్యంత సాధారణమైన రకం.
పనిచేసే విధానం:
ఈ ఇంజెక్షన్లో ‘అటెజోలిజుమాబ్’అనే డ్రగ్ ఉంటుంది. క్యాన్సర్ కణాలు మన శరీరంలో ఉండే PD-L1 అనే ప్రోటీన్ను వాడుకుని, రోగనిరోధక శక్తి కంటికి కనపడకుండా దాక్కుంటాయి. ఈ ‘టెక్సెంట్రిక్’ ఇంజెక్షన్ వెళ్లి ఆ PD-L1 ప్రోటీన్ను బ్లాక్ చేస్తుంది. దాంతో క్యాన్సర్ కణాల ముసుగు తొలగిపోతుంది. మన శరీరంలోని ఇమ్యూన్ సెల్స్ వాటిని ఈజీగా గుర్తించి.. వేటాడి మరీ నాశనం చేస్తాయి.
నోట్: ఈ ట్రీట్మెంట్ అందరికీ ఒకేలా పని చేయదు. పేషెంట్ ట్యూమర్లో PD-L1 ప్రోటీన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వారికి ఇది అద్భుతంగా పనిచేస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. లంగ్ క్యాన్సర్ బాధితుల్లో సగం మంది దీనికి అర్హులు కావచ్చు.
కీమోథెరపీ కంటే ఇమ్యునోథెరపీ ఎందుకు బెటర్?
సాధారణంగా వాడే కీమోథెరపీ క్యాన్సర్ కణాలతో పాటు శరీరంలోని మంచి కణాలను కూడా నాశనం చేస్తుంది. అందుకే జుట్టు ఊడిపోవడం, విపరీతమైన నీరసం లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ.. ఇమ్యునోథెరపీ అలా కాదు. ఇది మన శరీర నిరోధక శక్తిని పెంచి, క్యాన్సర్తో పోరాడేలా చేస్తుంది. అందుకే.. దీని సైడ్ ఎఫెక్ట్స్ చాలా తక్కువగా ఉంటాయి.
ధర :
ఈ సరికొత్త బ్రేక్థ్రూ మెడిసిన్ వినడానికి ఎంత బాగుందో.. దీని ధర సామాన్యుడికి అంతే షాకింగ్గా ఉంది. ఈ ఇంజెక్షన్ ఒక్క డోస్ ధర అక్షరాలా ₹3.7 లక్షలు. క్యాన్సర్ తీవ్రతను బట్టి ఒక పేషెంట్కు కనీసం 6 డోసుల వరకు అవసరం అవుతాయి. అంటే కేవలం ఈ ఇంజెక్షన్ల కోసమే దాదాపు రూ. 22 లక్షల పైనే ఖర్చు అవుతుంది. అడ్వాన్స్డ్ రీసెర్చ్, బయోటెక్నాలజీ వాడటం వల్లే ఇమ్యునోథెరపీ డ్రగ్స్ ఇంత కాస్ట్లీగా ఉంటాయని కంపెనీలు చెబుతున్నాయి. ప్రస్తుతం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇంత భారీ మొత్తాన్ని భరించడం కష్టమే.
Also Read: రాత్రి భోజనం తర్వాత 1000 అడుగులు! లాభాలు తెలిస్తే షాక్ అవుతారు
పేషెంట్లు:
ధర ఎక్కువగా ఉన్నప్పటికీ.. రోగులకు అండగా ఉండేందుకు కొన్ని మార్గాలు ఉన్నాయి.
బ్లూ ట్రీ ప్రోగ్రామ్: ఈ డ్రగ్ తయారు చేసిన రోచ్ ఫార్మా సంస్థ పేషెంట్ల ఆర్థిక భారాన్ని తగ్గించడానికి ‘బ్లూ ట్రీ’ అనే అసిస్టెన్స్ ప్రోగ్రామ్ను అందిస్తోంది.
CGHS సపోర్ట్: ఈ ఇంజెక్షన్ను కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద చేర్చారు. దీనివల్ల అర్హులైన ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రీఇంబర్స్మెంట్ రూపంలో సహాయం అందుతుంది.
ఖర్చు పరంగా సవాలుగా మారినప్పటికీ.. వైద్య రంగంలో ఇదొక అద్భుతమైన మైలురాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ట్రీట్మెంట్ టైమ్ను గంటల నుంచి నిమిషాలకు తగ్గించడం వల్ల ఎంతోమంది క్యాన్సర్ బాధితుల జీవన ప్రమాణాలు మెరుగవుతాయి.