Raisin Water: నేటి లైఫ్ స్టైల్ లో మనం తీసుకునే ఆహారం, కాలుష్యం వల్ల మన శరీరంలో ఎన్నో టాక్సిన్స్ పేరుకుపోతుంటాయి. వీటిని తొలగించి శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన డ్రింక్ ఎండుద్రాక్ష నీరు. ఎండుద్రాక్షను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఆయుర్వేదం ప్రకారం.. ఇది రక్తాన్ని శుద్ధి చేయడమే కాకుండా.. కాలేయ పని తీరును మెరుగు పరుస్తుంది. ఈ అలవాటును మీ లైఫ్ స్టైల్ లో భాగంగా చేసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఎండుద్రాక్ష అనేది కేవలం స్వీట్లలో వేసుకునే పదార్థం మాత్రమే కాదు. ఇందులో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ముఖ్యంగా నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు అపారం.
1. కాలేయ శుద్ధి:
మన శరీరంలో కాలేయం ఒక ముఖ్యమైన అవయవం. ఇది రక్తాన్ని శుద్ధి చేసి, వ్యర్థాలను బయటకు పంపుతుంది. ఎండుద్రాక్ష నీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయంలో పేరుకుపోయిన విషతుల్యాలను తొలగించడంలో సహాయ పడతాయి. ఇది జీవక్రియను వేగవంతం చేసి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది.
2. జీర్ణక్రియ మెరుగుపడుతుంది:
గ్యాస్, అసిడిటీ, మలబద్ధకం వంటి సమస్యలతో బాధపడేవారికి ఎండుద్రాక్ష నీరు ఒక వరం. ఎండుద్రాక్షలో సహజమైన పీచుపదార్థం ఉంటుంది. నీటిలో నానబెట్టినప్పుడు ఈ గుణాలు నీటిలోకి చేరతాయి. ఉదయాన్నే ఈ నీటిని తాగడం వల్ల పేగుల కదలికలు మెరుగు పడి, జీర్ణవ్యవస్థ సాఫీగా సాగుతుంది.
3. రక్తహీనత నివారణ:
ఎండుద్రాక్షలో ఐరన్, రాగి, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలోని ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి తోడ్పడతాయి. ప్రతి రోజూ పరగడుపున ఈ నీటిని తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ముఖ్యంగా మహిళలకు ఇది ఎంతో మేలు చేస్తుంది.
4. రోగనిరోధక శక్తి పెరుగుదల:
ఎండుద్రాక్ష నీటిలో ఉండే ఫైటోన్యూట్రియెంట్లు, యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి. ప్రస్తుత కాలంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవడం చాలా అవసరం, దానికి ఇది సులభమైన మార్గం.
5. చర్మ సౌందర్యం, జుట్టు ఆరోగ్యం:
శరీరం లోపలి నుంచి శుద్ధి అయినప్పుడు, ఆ ప్రభావం చర్మంపై కనిపిస్తుంది. ఎండు ద్రాక్ష నీరు రక్తాన్ని శుద్ధి చేయడం వల్ల మొటిమలు తగ్గుతాయి. చర్మం సహజమైన కాంతిని సంతరించుకుంటుంది. అలాగే..ఇందులో ఉండే పొటాషియం, మెగ్నీషియం జుట్టు రాలడాన్ని తగ్గించి, కుదుళ్లను బలంగా మారుస్తాయి.
6. గుండె ఆరోగ్యం:
ఎండుద్రాక్ష నీరు రక్తపోటును నియంత్రించడంలో సహాయప డుతుంది. ఇందులో ఉండే పొటాషియం రక్తనాళాల్లో ఒత్తిడిని తగ్గించి, గుండె పనితీరును మెరుగు పరుస్తుంది. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తగ్గించడానికి కూడా దోహదపడుతుంది.
Also Read: తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రోటీన్.. మీ డైట్లో చేర్చుకోవాల్సిన 5 మార్పులు ఇవే
తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో రెండు కప్పుల నీటిని తీసుకుని మరిగించండి.
అందులో సుమారు 150 గ్రాముల శుభ్రం చేసిన ఎండుద్రాక్షలను వేయండి.
రాత్రంతా అలాగే ఉంచి.. మరుసటి రోజు ఉదయం నీటిని వడకట్టి, గోరు వెచ్చగా చేసి పరగడుపున తాగండి.
నీటిని తాగిన అరగంట వరకు ఏమీ తినకూడదు.