SIR 2026: తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర పరిశీలన (SIR 2026) ప్రక్రియలో ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్, రంగారెడ్డి మరియు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాల్లో నూతన ఓటర్ల నమోదు శాతం ఆశించిన స్థాయిలో లేకపోవడం, నోటీసులకు ఓటర్ల స్పందన తక్కువగా ఉండటం పట్ల టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఆయన ఈ రోజు ఒక ప్రకటన చేస్తూ 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు నూతన ఓటర్లుగా నమోదు చేసుకోవడంలో వెనుకబడి ఉండటమే కాకుండా, జాబితా పరిశీలనలో అధికారులు జారీ చేసిన నోటీసులకు సమయానికి స్పందించకపోవడం వల్ల వేలాది మంది అర్హులైన పౌరులు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఏర్పడిందని అన్నారు.
ఈ పరిస్థితిని తీవ్రంగా పరిగణించి, ప్రతి ఒక్కరి ఓటు హక్కును పరిరక్షించేందుకు కాంగ్రెస్ నాయకులు, అనుబంధ సంఘాలు మరియు శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ తక్షణమే ఫారం-6 ద్వారా కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాలి. ఎన్నికల కమిషన్ జారీ చేసిన SIR నోటీసులపై తగిన ఆధారాలతో స్పందించి మీ ఓటును భద్రపరుచుకోవాలని అన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన ఓటు హక్కును నిర్లక్ష్యం చేయకుండా చైతన్యవంతంగా వ్యవహరించాలని అన్నారు. NSUI నాయకులు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల్లోని అన్ని కళాశాలలు, విశ్వ విద్యాలయాల్లో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించి, విద్యార్థులను నూతన ఓటర్లుగా నమోదు చేయించాలి.
Also read: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఓలా, ఉబర్లోనే.. సిటీ బస్సుల లైవ్ లొకేషన్!
యూత్ కాంగ్రెస్ నాయకులు ప్రతి డివిజన్ మరియు బూత్ స్థాయిలో ఇంటింటికీ తిరిగి నోటీసులు పొందిన కుటుంబాలకు సహాయం అందించాలని, ఫారాలు నింపడం మరియు ఆధారాలు సమర్పించడంలో వారికి మార్గదర్శనం చేయాలన్నారు. కాంగ్రెస్ క్యాడర్ & BLAలు (Booth Level Agents) స్థానిక బిఎల్ఓ (BLO)లతో సమన్వయం చేసుకుంటూ ఓటర్ల జాబితాలో అర్హులైన వారి పేర్లు తొలగించబడకుండా, నోటీసుల సమస్యలు పరిష్కారమయ్యేలా క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో నిమగ్నం కావాలన్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని నాయకులు మరియు కార్యకర్తలు ఈ SIR ప్రక్రియను ఒక బాధ్యతగా తీసుకుని ప్రజాస్వామ్య పరిరక్షణలో క్రియాశీలక పాత్ర పోషించాలన్నారు.
Also read: బిగ్బాస్ హోస్టింగ్కు ఇంత డబ్బా? రెమ్యునరేషన్ తెలిస్తే షాక్ అవుతారు!