Chiranjeevi: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)హీరోగా, హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ‘గబ్బర్ సింగ్’. ఈ సినిమాలో అంత్యాక్షరి సన్నివేశంలో తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకొని భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు కమెడియన్ రమేష్ (Gabbarsingh Ramesh). ముఖ్యంగా ఈ సినిమాతో వచ్చిన గుర్తింపు కారణంగా సినిమా పేరునే ఇంటిపేరుగా మార్చుకొని గబ్బర్ సింగ్ రమేష్ గా చలామణి అవుతున్నారు. ఈ సినిమా తర్వాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో కూడా నటించిన ఈయన.. అత్తారింటికి దారేది, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఇలా బ్లాక్ బస్టర్ చిత్రాలలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
అంతేకాదు ఇటీవల మళ్లీ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో కూడా నటించారు. ఇప్పటికీ అడపాదడపా సినిమాలు చేస్తూ అలరిస్తున్న గబ్బర్ సింగ్ రమేష్ ఉన్నట్టుండి బ్రెయిన్ స్ట్రోక్ కి గురవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు రోజుల క్రితం వరకు కూడా సినిమా షూటింగ్లలో పాల్గొన్న రమేష్ సడన్గా బ్రెయిన్ స్ట్రోక్ కి గురవడంతో సినీ అభిమానులు, సెలబ్రిటీలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే అపోలో హాస్పిటల్ కి తరలించగా ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు.
గబ్బర్ సింగ్ రమేష్ కి బ్రెయిన్ స్ట్రోక్ అని తెలియగానే గబ్బర్ సింగ్ సినిమా దర్శకుడు హరీష్ శంకర్, పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పిటల్ కి చేరుకొని గబ్బర్ సింగ్ రమేష్ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి మరీ తెలుసుకున్నారు.మరోవైపు మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా మరొకసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. చికిత్సకు అవసరమయ్యే అన్ని ఏర్పాట్లు చేస్తూనే.. మరొకవైపు ఖర్చుల కోసం రమేష్ భార్యకు సుమారుగా 3 లక్షల రూపాయల చెక్కు అందజేశారు.
అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్య భీమా పథకం ద్వారా కూడా అవసరమైన సహాయం రమేష్ కి అందేలా సిఫార్సు చేస్తానని వారికి హామీ ఇచ్చారు. అలాగే అపోలో హాస్పిటల్ డాక్టర్ సుబ్బారెడ్డి తో తరచూ మాట్లాడుతూ రమేష్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. తోటి కళాకారుల పట్ల చిరంజీవి చూపే ఆప్యాయత మరోసారి అందరినీ ఆకట్టుకుంది. ఎన్నో సందర్భాలలో అవసరం ఉన్న సినీ కార్మికులు, నటీనటులకు ఆయన అందించిన సహాయం ఇండస్ట్రీలో అందరికీ స్ఫూర్తిదాయకం. నటుడు రమేష్ త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితంలోకి రావాలి అని చిరంజీవి ఆకాంక్షించారు.
Also read: అఖిల్ సక్సెస్ పై స్పందించిన సుమంత్..
ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి మాత్రమే కాదు నాగబాబు కూడా తన వంతు సహాయంగా రెండు లక్షల రూపాయల చెక్కును రమేష్ సతీమణికి అందజేశారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరోసారి మంచి మనసు చాటుకున్న మెగా ఫ్యామిలీ అంటూ ఈ కుటుంబంపై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ సెలబ్రిటీలు, నెటిజన్స్.