Seeds For Diabetes: డయాబెటిస్ మేనేజ్మెంట్లో కేవలం మందులు మాత్రమే కాదు.. మనం తీసుకునే పోషకాహారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ‘సూపర్ సీడ్స్’ అని పిలవబడే కొన్ని రకాల విత్తనాలలో పీచు పదార్థం, ప్రోటీన్లు , ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరగకుండా అడ్డుకుంటాయి. ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరచడంలో ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. ప్రతిరోజూ మీ డైట్లో చిన్న మొత్తంలో ఈ విత్తనాలను చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ను సమర్థవంతంగా నిర్వహించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మధుమేహాన్ని అదుపు చేసే 6 బెస్ట్ ఫుడ్స్:
1. చియా సీడ్స్ :
చియా సీడ్స్ డయాబెటిక్ పేషెంట్లకు ఒక వరమనే చెప్పాలి. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఎలా పనిచేస్తాయి: ఇవి నీటిని పీల్చుకుని జెల్ లాగా మారతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేస్తుంది. తద్వారా రక్తంలోకి చక్కెర నిదానంగా విడుదలవుతుంది.
వాడకం: నీటిలో నానబెట్టి లేదా పెరుగులో కలుపుకుని తీసుకోవచ్చు.
2. అవిసె గింజలు :
అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ‘లిగ్నాన్స్’ అనే యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.
ఎలా పనిచేస్తాయి: ఇవి ఇన్సులిన్ నిరోధకతనుతగ్గిస్తాయి. రోజువారీ ఆహారంలో అవిసె గింజల పొడిని చేర్చుకోవడం వల్ల హెచ్బిఏ1సి స్థాయిలు మెరుగుపడతాయి.
వాడకం: వీటిని దోరగా వేయించి పొడి చేసి కూరల్లో లేదా మజ్జిగలో కలుపుకోవాలి.
3. మెంతి గింజలు:
భారతీయ వంటకాల్లో సాధారణంగా వాడే మెంతులు షుగర్ వ్యాధికి అద్భుతమైన మందు.
ఎలా పనిచేస్తాయి: మెంతుల్లో ఉండే ‘గెలాక్టోమన్నన్’ అనే ఫైబర్ చక్కెర గ్రహింపును తగ్గిస్తుంది.
వాడకం: రాత్రిపూట ఒక చెంచా మెంతులను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగి గింజలను నమలాలి.
4. గుమ్మడి విత్తనాలు :
గుమ్మడి విత్తనాలలో మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారిలో మెగ్నీషియం లోపం ఎక్కువగా కనిపిస్తుంది.
ఎలా పనిచేస్తాయి: మెగ్నీషియం ఇన్సులిన్ సరిగ్గా పనిచేయడానికి సహాయ పడుతుంది. అలాగే వీటిలో ఉండే ప్రోటీన్లు ఆకలిని నియంత్రించి బరువు తగ్గడానికి తోడ్పడతాయి.
వాడకం: సాయంత్రం స్నాక్స్గా వేయించిన గుమ్మడి విత్తనాలను తినవచ్చు.
5. సన్ఫ్లవర్ విత్తనాలు :
పొద్దుతిరుగుడు విత్తనాలలో విటమిన్-ఇ , ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
ఎలా పనిచేస్తాయి: ఇవి శరీరంలోని వాపును తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. మధుమేహం వల్ల వచ్చే ఇతర కాంప్లికేషన్లను నివారించడంలో ఇవి కీలకం.
వాడకం: సలాడ్లపై చల్లుకుని లేదా నేరుగా తీసుకోవచ్చు.
6. సబ్జా గింజలు :
సబ్జా గింజలు కేవలం చలువ చేయడమే కాదు.. షుగర్ నియంత్రణలోనూ తోడ్పడతాయి.
ఎలా పనిచేస్తాయి: టైప్-2 డయాబెటిస్ ఉన్నవారిలో భోజనం తర్వాత పెరిగే చక్కెర స్థాయిలను ఇవి అదుపు చేస్తాయి.
వాడకం: నీటిలో నానబెట్టి నిమ్మరసం లేదా మజ్జిగలో కలుపుకుని తాగాలి.
ఈ విత్తనాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.. వీటిని పరిమితంగా తీసుకోవడం ముఖ్యం. ఏ విత్తనమైనా రోజుకు 1-2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువ తీసుకోకూడదు. అలాగే.. మీరు ఇప్పటికే మధుమేహం కోసం మందులు వాడుతున్నట్లయితే.. మీ ఆహారంలో ఈ మార్పులు చేసే ముందు ఒకసారి డాక్టర్ను సంప్రదించడం బెస్ట్.