Summer Foods : ఈ ఏడు సూరీడి ప్రతాపం మాములుగా లేదు. బయట అడుగెట్టాలంటే బయపడిపోయే పరిస్థితి.అలాంటి ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఆహరం తీసుకుంటే మన శరీరానికి మంచిదో, ఏది మేలు చేస్తుందో తెలుసుకుందామా..
మొదటగా చెప్పాల్సింది రాగి అంబలి..పూర్వీకుల నుంచి వస్తున్న అంబలి ఒక దివ్యౌషధంఅనే చెప్పాలి.ఎందుకంటే ఇలా తీసుకోగానే అలా ఇన్ స్టంట్ ఎనర్జీని ఇస్తుంది మరి. అలాగే కొబ్బరి నీళ్లు, పుచ్చకాయలు డీహైడ్రేషన్ తగ్గించడానికి అద్భుతంగా పనిచేస్తాయి. సబ్జా గింజలను నీళ్లలో నానబెట్టి, నిమ్మరసం, తేనె కలిపి తాగితే శరీరం లోపల నుంచి చల్లబడుతుంది. సబ్జా గింజలు సహజ సిద్ధమైన కూలర్స్ గా పనిచేసి ఒంట్లో వేడిని తగ్గిస్తాయి. నిద్రలేవగానే పుదీనా కలిపిన నీరు తాగడం, మట్టి పాత్రల్లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల బాడీ టెంపరేచర్ బ్యాలెన్స్డ్ గా ఉంటుంది.. మట్టి పాత్రలు నీటిలోని ఖనిజాలను కాపాడటమే కాకుండా, నీటిని సహజంగా చల్లబరుస్తాయి కూడా.
కూరగాయల ఎంపికలో కూడా మార్పులు
ఇక పప్పుధాన్యాల విషయానికి వస్తే, కందిపప్పు, మినపపప్పు, కుల్తీ లేదా సోయాబీన్ వంటివి శరీరానికి బరువుగా అనిపించి గ్యాస్ సమస్యలను కలిగిస్తాయి. వేసవిలో తేలికగా ఉండే పెసరపప్పు, మసూర్ పప్పు, లోబియా, కాబూలీ శనగలను ఎంచుకోవడం ఆరోగ్యకరం. ముఖ్యంగా పెసరపప్పును తీసుకోవడం వల్ల డైజీషన్ ఈజీగా అవుతుంది. ఇక కూరగాయల ఎంపికలో కూడా మార్పులు తప్పనిసరండోయ్.వంకాయ, బీట్రూట్, పాలకూర వంటివి శరీరంలో వేడిని పెంచే అవకాశాలు ఎక్కువ.అందువల్ల వాటికి బదులుగా సొరకాయ, ఆనపకాయ, పర్వాల్, దోసకాయ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే కూరగాయలు వాడటం మేలు. ఇవి కడుపులో మంటను తగ్గించి, శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయనడంలో సందేహమే లేదు.
also read :యంగ్ టైగర్ స్టైలే వేరు.. పక్షుల పేర్లలో కూడా జపనీస్ టచ్ ఇచ్చిన తారక్ !
చిరుధాన్యాల విషయంలోనూ జాగ్రత్త అవసరం
ఇక తీపి పదార్థాల విషయానికి వస్తే, తేనె లేదా బెల్లం ఆరోగ్యకరమైనవే అయినప్పటికీ, బయట ఎండలు మండిపోతున్నప్పుడు ఇవి తీసుకుంటే శరీరంలో వేడి ఎక్కువయ్యే అవకాశం ఉంది. వీటికి బదులుగా శరీరానికి చలువ చేసే ఖర్జూరపు పొడి, స్టీవియా, మంక్ ఫ్రూట్ షుగర్ లేదా ధాగా మిశ్రిని వాడటం మేలు. ఇక చిరుధాన్యాల విషయంలోనూ జాగ్రత్త అవసరం. జొన్న,రాగి, బ్రౌన్ రైస్ వంటివి సాధారణంగా ఆరోగ్యకరమే అయినా, వేసవిలో ఇవి జీర్ణం అవ్వడానికి కొంత కష్టంగా ఉంటాయి. కాబట్టి జౌ (బార్లీ), సమక్, కాంగ్ని, ఓట్స్ లేదా తేలికగా అరిగే తెల్ల బియ్యాన్ని తీసుకోవడం ఉత్తమం. బార్లీ నీరు తాగడం వల్ల మూత్రపిండాలు శుభ్రపడటమే కాకుండా శరీరం చల్లబడుతుంది.
మండుటెండల్లో అది కూడా వేడి చేయవచ్చు
ఇక పాల ఉత్పత్తుల విషయంలో గేదె పాలు వంటి బరువైన పదార్థాలు జీర్ణ సమస్యలను కలిగిస్తాయి. పెరుగు ఆరోగ్యకరమే అయినప్పటికీ, మండుటెండల్లో అది కూడా వేడి చేయవచ్చు, కాబట్టి దానిని నేరుగా తీసుకోకుండా రైతా లేదా పల్చటి మజ్జిగ రూపంలో తీసుకోవడం శ్రేయస్కరం. మజ్జిగలో కొంచెం జీలకర్ర పొడి, పుదీనా ఆకులు వేసుకుంటే అద్భుతమైన కూలింగ్ డ్రింక్ లా పనిచేస్తుంది. అలాగే మసాలాల వాడకాన్ని తగ్గించడం అత్యంత ముఖ్యం. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటినప్పుడు ఎండు అల్లం, దాల్చినచెక్క, లవంగాలు, నల్ల మిరియాలు, మెంతి గింజలు వంటి వేడి చేసే మసాలాలు అసిడిటీని పెంచుతాయి. వీటికి ప్రత్యామ్నాయంగా సోంపు, జీలకర్ర, కొత్తిమీర, పుదీనా, లెమన్గ్రాస్ వంటివి రుచికోసం వాడటం చాలా మంచిది. సోంపు నీరు తాగడం వల్ల ఎండ వేడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది.
also read :బాలయ్య మూవీలో విలన్గా.. సొంత సినిమాలో హీరోగా.. మంచు మనోజ్ బర్త్డే గిఫ్ట్ అదిరిందిగా !
చిన్న చిన్న టిప్సే మీకు శ్రీరామ రక్ష
ఇక ఎండ బాగా ఉంటె మాత్రం బయటకు వెళ్లేటప్పుడు ఖాళీ కడుపుతో వెళ్లకుండా, తగినంత మజ్జిగ లేదా పండ్ల రసాలు తీసుకుని వెళ్లడం వల్ల వడదెబ్బ బారిన పడకుండా ఉండవచ్చు. అలాగే ఎండలో బయటకు వెళ్లాల్సి వస్తే ఉల్లిపాయ ముక్కలను వెంట ఉంచుకోవడం, తల మీద టోపీ లేదా గొడుగు వాడటం వంటివి తప్పనిసరి. కెఫిన్ ఉన్న టీ, కాఫీలను తగ్గించి, వీలైనంత వరకు కొబ్బరి నీళ్లు, చెరకు రసం లేదా ఇంట్లో తయారు చేసుకున్న తాజా పండ్ల రసాలను తీసుకోవడానికి ప్రయత్నించండి ఓకేనా. సో ఇకనైనా జాగ్రత్తగా ఎండల్లోకి వెళ్లే ముందు జాగ్రత్తగా ఈ టిప్స్ ఫాలో అవుతారు కదూ..ఎందుకంటే ఈ చిన్న చిన్న టిప్సే మీకు శ్రీరామ రక్ష మరి !