మనలో చాలామంది ఉదయం అల్పాహారంలో గుడ్లు తింటారు. గుడ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. ఇవి శరీరానికి మంచి ప్రోటీన్, విటమిన్లు, ఖనిజాలు అందిస్తాయి. కానీ గుడ్లు తిన్న వెంటనే కొన్ని ఆహారాలు తింటే పొట్టకు భారమవ్వడం, జీర్ణక్రియ కష్టమవడం, పొట్టలో అసౌకర్యం వంటివి జరుగుతాయని ఆహార నిపుణులు చెబుతున్నారు. అందుకే గుడ్లు తిన్న తర్వాత ఏం తినాలి, ఏం తినకూడదో ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి.
టీ తాగడం మానేయండి
గుడ్డు తిన్నాక టీ లేదా టీ తాగాక ఆమ్లెట్ తినడం వంటి పనులు చేయకూడదు. టీ లో ఉండే టానిన్ అనే పదార్థం గుడ్లలోని ప్రోటీన్తో కలిస్తే శరీరం ప్రొటీన్ శోషించుకోవడం కష్టమవుతుంది. దీంతో పొట్ట బరువుగా అనిపించడం, గ్యాస్, అసిడిటీ రావడం జరుగుతుంది. కొన్ని సార్లు టీ కారణంగా గుడ్లు త్వరగా జీర్ణం కాకపోవచ్చు. ముఖ్యంగా స్ట్రాంగ్ టీ అయితే సమస్య మరింత ఎక్కువ అవుతుంది. అందువల్ల గుడ్లు తిన్న వెంటనే టీ తాగకుండా కొంత గ్యాప్ ఇవ్వడం మంచిది.
పాలు, పెరుగు, చీజ్
గుడ్లు ఎక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారం. పాలు, పెరుగు, చీజ్ కూడా ప్రోటీన్ ఎక్కువగా కలిగి ఉంటాయి. ఈ రెండు కలిసి కడుపులోకి వెళ్తే కడుపు దాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువగా పని చేయాలి. దీనివల్ల కొంతమందికి కడుపునిండిన భావం, బరువు, అసౌకర్యం, నిద్రలాగా అనిపించడం జరుగుతాయి. అందరికీ ఇది సమస్య కాకపోయినా, జీర్ణక్రియ సమస్యలు ఉన్నవారు తినకూడదు.
సోయా పాలు
సోయా పాలు కూడా ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఆహారం. గుడ్లతో కలిసి ఇవి శరీరానికి ఎక్కువ ప్రోటీన్ను ఒకేసారి అందిస్తాయి. ఇది కొంతమందికి పొట్ట ఉబ్బరం, అజీర్తి సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల గుడ్లు తిన్న తర్వాత వెంటనే సోయా పాలు తాగకపోవడమే మంచిది.
కొంతమంది గుడ్లను తీపి పదార్థాలతో కలుపుకుని తింటుంటారు. కానీ ఇది జీర్ణక్రియకు మంచిది కాదు. చక్కెరతో గుడ్లలోని ప్రోటీన్ కలిస్తే జీర్ణం నెమ్మదించవచ్చు. అరటిపండు శరీరానికి వెంటనే శక్తి ఇస్తుంది. గుడ్లు కూడా శక్తివంతమైన ఆహారం. ఈ రెండూ హెవీ ఫుడ్స్. కాబట్టి గుడ్లు తిన్న వెంటనే అరటిపండు తింటే కడుపు దీనిని జీర్ణం చేయడానికి ఎక్కువగా పని చేయాలి. అలాగే గుడ్లు తిన్న తరువాత చికెన్, మటన్ వంటివి తినడం కూడా జీర్ణక్రియను కష్టంగా మారుస్తుంది. సిట్రస్ పండ్లను కూడా దూరంగా ఉంచాలి. ఈ పండ్లలో ఎసిడిటీ ఎక్కువగా ఉంటుంది. గుడ్లలోని ప్రోటీన్తో ఇవి కడుపులో కలిస్తే హార్ట్బర్న్, పొట్ట అసౌకర్యం కలిగించవచ్చు. అందువల్ల గుడ్లు తిన్న తర్వాత వెంటనే బత్తాయి, కమలపండు వంటి పండ్లు తినడం తగ్గించాలి. పుచ్చకాయ వంటి చాలా వేగంగా జీర్ణం అయ్యే ఆహారం కూడా తినకూడదు. గుడ్లునెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఇవి రెండూ కలిస్తే పొట్టను ఇబ్బంది పెట్టేస్తాయి.
ఈ ఆహారాలు అందరికీ ఒకే విధంగా సమస్యలు కలిగిస్తాయని చెప్పలేం. కొంతమంది గుడ్లు తిన్న వెంటనే టీ, పాలు, పండ్లు తిన్నా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. ఇది పూర్తిగా వ్యక్తిగత జీర్ణశక్తిపై ఆధారపడి ఉంటుంది. కానీ జీర్ణక్రియ సున్నితంగా సాగేవారు, ఎసిడిటీతో బాధపడేవారు,పొట్ట ఉబ్బరం సమస్య ఉన్నవారు మాత్రం ఈ ఆహారాలను గుడ్లు తిన్న వెంటనే తినకపోవడమే మంచిది.