Karnataka CM Seat: కర్ణాటకలో మళ్లీ కుర్చీలాట ప్రారంభం అయింది. సీఎం పదవి కోసం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య మళ్లీ పోరు మొదలైంది. 2023 మేలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు.. కాంగ్రెస్ అధిష్టానం 2.5 సంవత్సరాల తర్వాత డీకే శివకుమార్ ను సీఎం పదవి ఇస్తామని హామీ ఇచ్చిందని డీకే మద్దతు దారులు వాదిస్తున్నారు. అధికార పంపిణీ ఒప్పందంపై కాంగ్రెస్ అధిష్టానం ఇచ్చిన హామీని అమలుచేయాలని శివకుమార్ మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు.
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలైన సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మధ్య పోరు తీవ్రమైంది. డిప్యూటీ సీం డీకే శివకుమార్కు వర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ రాత్రికి దిల్లీకి చేరుకుని సీఎం పదవిని సిద్ధరామయ్య నుంచి శివకుమార్కు కేటాయించాలని పార్టీ హైకమాండ్ను ఒత్తిడి చేయనున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్ల కాలం దాటడంతో.. ఎన్నికల సమయంలో అధిష్టానం ఇచ్చిన పవర్ షేరింగ్ సమీకరణం తెరపైకి వచ్చింది.
పార్టీ హైకమాండ్ పై ఒత్తిడి తీసుకురావడానికి రెండు వర్గాల ఎమ్మెల్యేలు గత వారం దిల్లీకి వెళ్లారు. ఈ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బెంగళూరులోనే ఉండిపోయారు. మంత్రులు, సీనియర్ నాయకులతో వరుసగా ఖర్గే వన్-టు-వన్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. వేగంగా మారుతున్న పరిణామాల నేపథ్యంలో శివకుమార్ ఆదివారం సాయంత్రం సిద్ధరామయ్యకు విధేయుడైన సీనియర్ నాయకుడు మంత్రి కేజే జార్జ్ను కూడా కలిశారు. సిద్ధరామయ్యతో పాటు జార్జ్ గతంలో రాహుల్ గాంధీతో పాటు ఖర్గేను కూడా కలిశారు.
నాయకత్వ మార్పిడి విషయాలపై జరుగుతున్న చర్చను సిద్ధరామయ్య, శివకుమార్ తిరస్కరించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే ఆదివారం ఈ విషయాలపై మాట్లాడుతూ… నాయకత్వ మార్పుపై పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ప్రస్తుతానికి ఈ విషయంపై తాను ఏమీ చెప్పలేనన్నారు. బెంగళూరులో సీఎం సిద్ధరామయ్యతో గంటకు పైగా ఖర్గే సమావేశం అయ్యారు. జరుగుతున్న పరిణామాలపై తాను ఇప్పుడే స్పందించలేనని ఖర్గే అన్నారు. ఏదైనా ఉంటే హైకమాండ్ చూసుకుంటుందన్నారు.
వారం రోజుల్లో రెండోసారి ఖర్గేతో సిద్ధరామయ్య భేటీ అయ్యారు. నాయకత్వ మార్పు గురించి చర్చ కేవలం ఊహాగానాలు, మీడియా సృష్టి అని సిద్ధరామయ్య తోసిపుచ్చారు. సీఎం పదవి గురించి వస్తున్న ఊహాగానాలపై సీఎం సిద్ధరామయ్య మాట్లాడుతూ.. “డీకే శివకుమార్, నేను పార్టీ హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటాము. హైకమాండ్ ఏది నిర్ణయించినా డీకే, నేను అంగీకరించాలి. పార్టీ హైకమాండ్ నిర్ణయం ప్రకారం మేము వ్యవహరిస్తాము. ఐదు నెలల క్రితం హైకమాండ్ తో సమావేశమైనప్పుడు మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఆదేశించారు. రెండున్నర సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మేము దానిని చేస్తామని చెప్పాము. ఇప్పుడు వారి సూచనల ప్రకారం వ్యవహరిస్తాము” అన్నారు.
Also Read: Delhi News: ఢిల్లీలో ఉద్రిక్తత.. హిడ్మాకు మద్దతుగా నిరసనలు
అధికార మార్పిడిపై జరుగుతున్న ప్రచారంపై ఇటీవల డీకే శివకుమార్ స్పందించారు. సిద్దరామయ్యే సీఎంగా ఐదేళ్లూ కొనసాగుతారని డీకే శివకుమార్ తెలిపారు. ఆయనకు తామంతా సహకరిస్తామన్నారు. మొత్తం కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా మావాళ్లేనని, ఎలాంటి గ్రూప్లు లేవని తేల్చిచెప్పారు. అధిష్టానం ఆదేశాలకు తామంతా కట్టుబడి ఉంటామన్నారు. కేబినెట్ విస్తరణ చేపట్టాలని సీఎం నిర్ణయించారని పేర్కొన్నారు. మంత్రి పదవుల కోసం దిల్లీలో అధిష్ఠానాన్ని ఆశావాహులు కలవడం సర్వసాధారణమే అన్నారు.