Mango: సమ్మర్ వచ్చిందంటే చాలు నోరూరించే మామిడి పండ్ల కోసం అందరూ ఎదురుచూస్తుంటారు. అయితే.. అధిక లాభాల కోసం చాలామంది వ్యాపారులు ‘కాల్షియం కార్బైడ్’ వంటి ప్రమాదకర రసాయనాలతో మామిడిని కృత్రిమంగా మగ్గబెడుతున్నారు. ఇలాంటి కల్తీ మామిడి పండ్లు తినడం వల్ల వాంతులు, విరేచనాలు, చర్మ వ్యాధులు, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు వచ్చే ముప్పు ఉంది. కాబట్టి.. మనం కొనే మామిడి పండు సహజంగా పండినదా లేక రసాయనాలతో మగ్గబెట్టిందా అని గుర్తించడం మన ఆరోగ్యానికి ఎంతో కీలకం.
కల్తీ మామిడి పండ్లను గుర్తించడం ఎలా?
మార్కెట్లో దొరికే మామిడి పండ్లలో ఏది స్వచ్ఛమైందో.. ఏది కల్తీదో తెలుసుకోవడానికి ఈ కింది పద్ధతులు పాటించండి.
1. రంగును గమనించండి :
సహజంగా పండిన మామిడి పండు పైన అక్కడక్కడా ఆకుపచ్చ రంగులో, మరి కొంత భాగం పసుపు రంగులో ఉంటుంది. కానీ రసాయనాలతో మగ్గబెట్టిన పండు మొత్తం ఒకే విధంగా పసుపు రంగులో మెరుస్తూ ఉంటుంది. పండు పైన నల్లటి మచ్చలు లేకుండా పూర్తిగా పసుపుగా ఉంటే అది కల్తీ పండు అని అనుమానించాలి.
2. వాసన చూడండి :
సహజంగా పండిన మామిడి పండుకు ఒక ప్రత్యేకమైన తీపి వాసన ఉంటుంది. పండు తొడిమ దగ్గర వాసన చూస్తే అది గుమగుమలాడుతుంది. ఒకవేళ ఆ పండుకు ఎలాంటి వాసన లేకపోయినా లేదా ఘాటైన రసాయనాల వాసన వస్తున్నా అది ఖచ్చితంగా కార్బైడ్తో మగ్గబెట్టినదే.
3. పండును నొక్కి చూడండి :
మామిడి పండును చేత్తో పట్టుకుని మెల్లగా నొక్కి చూడండి. సహజంగా పండిన పండు అన్ని వైపులా సమానంగా మెత్తగా ఉంటుంది. రసాయనాలతో పండించిన పండు పైన మెత్తగా అనిపించినా.. లోపల గట్టిగా ఉంటుంది. ఇది పండు అసహజంగా మగ్గిందని చెప్పడానికి ఒక సంకేతం.
4. నీటిలో వేసి పరీక్షించండి :
ఇది అత్యంత సులభమైన,ఖచ్చితమైన పద్ధతి. ఒక పాత్రలో నీరు తీసుకుని అందులో మామిడి పండ్లను వేయండి.
సహజమైన పండు: నీటిలో మునిగి అడుగుకు చేరుతుంది. ఎందుకంటే సహజంగా పండిన పండులో సాంద్రత ఎక్కువగా ఉంటుంది.
కల్తీ పండు: నీటిపై తేలుతుంది. రసాయనాల వల్ల పండు లోపల గాలి బుడగలు చేరి అది తేలికగా మారుతుంది.
5. కోసి చూడండి :
పండును కోసినప్పుడు లోపల గుజ్జు రంగును గమనించండి. సహజంగా పండిన మామిడి పండు లోపల గాఢమైన పసుపు లేదా కాషాయ రంగులో ఉంటుంది. కల్తీ మామిడి లోపల లేత పసుపు రంగులో ఉండి. అక్కడక్కడా తెల్లటి చారలు కనిపిస్తాయి. అంతేకాకుండా.. కల్తీ పండు నుంచి రసం తక్కువగా వస్తుంది.
రసాయనాలతో పండిన మామిడి వల్ల కలిగే నష్టాలు:
కాల్షియం కార్బైడ్ నుంచి వెలువడే ఎసిటిలిన్ వాయువు నాడీ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. దీని వల్ల కళ్లు తిరగడం, నిద్రలేమి, జ్ఞాపక శక్తి తగ్గడం వంటి సమస్యలు రావచ్చు. అందుకే పండ్లను కొనేటప్పుడు జాగ్రత్త వహించాలి.
Also Read: చీజ్ గురించి భయపడుతున్నారా? ఇందులోని పోషక విలువలు చూస్తే ఆశ్చర్యపోతారు!
మరికొన్ని కొన్ని సూచనలు:
సీజన్ కంటే.. ముందు వచ్చే పండ్లు వద్దు: మామిడి సీజన్ ప్రారంభం కాకముందే మార్కెట్లోకి వచ్చే పండ్లు చాలావరకు కల్తీవే ఉంటాయి.
కడగడం మర్చిపోవద్దు: పండ్లను కొన్న తర్వాత కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టి, బాగా కడిగిన తర్వాతే తినాలి. దీని వల్ల పైన ఉన్న రసాయనాల ప్రభావం తగ్గుతుంది.
తొక్క తీసి తినండి: మామిడి పండును తొక్కతో సహా తినడం కంటే.. తొక్కను పూర్తిగా తీసేసి తినడం సురక్షితం.