Curd In Winter: చలికాలం వచ్చేసరికి పెరుగు తినాలా, వద్దా? అనే ప్రశ్న చాలామందిని ఆలోచింపజేస్తుంది. అయితే పెరుగు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, శీతాకాలంలో ఇమ్యూనిటీని బలపరచడంలో ఎంతగానో సహాయపడుతుందని వైద్యులు చెబుతున్నారు.
కానీ చల్లని స్వభావం ఉన్న ఆహారమైనందున, చలికాలంలో పెరుగును నేరుగా తీసుకోవడం వల్ల కొందరిలో జలుబు, దగ్గు, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జలుబు, సైనస్ సమస్యలు ఉన్నవాళ్లు రాత్రి వేళల్లో పెరుగుకు దూరంగా ఉండటం మంచిదని సూచిస్తున్నారు.
Read Also: జిమ్ అవసరం లేదు.. రోజూ మెట్లు ఎక్కితే చాలు, ఫిట్నెస్ ఫలితాలు చూసి ఆశ్చర్యపోతారు!
అయితే.. పెరుగును పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని, అలాగే ఫ్రిజ్ నుంచి నేరుగా తీసుకుని తినకుండా, సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చిన తర్వాతే తినడం మంచిది. ముఖ్యంగా ఉదయం లేదా మధ్యాహ్నం పూట పెరుగు తినడం ఆరోగ్యానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఆ సమయంలో శరీరం పెరుగును సులభంగా జీర్ణం చేసుకోగలుగుతుంది.
పెరుగు పేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియాను పెంచి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే ఇందులో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ B6, విటమిన్ B12 వంటి అవసరమైన పోషకాలు పెరుగులో సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరంలోని రోజువారీ కార్యకలాపాలకు తోడ్పడి, జీవక్రియను చురుగ్గా ఉంచుతాయి.
క్రమం తప్పకుండా పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. పేగుల ఆరోగ్యం బాగుండటంతో శరీర సహజ రక్షణ వ్యవస్థ బలపడుతుంది. అందుకే చలికాలంలో కూడా పెరుగును పూర్తిగా మానేయకుండా, పగటిపూట తీసుకోవాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. అలా తీసుకుంటే పెరుగులోని పోషక గుణాలు పూర్తిగా శరీరానికి అందుతాయి, మొత్తం ఆరోగ్యం మెరుగుపడుతుందని సూచిస్తున్నారు.
Read Also: ‘విటమిన్ ఈ’ రోజుకు ఎంత అవసరం? ఏయే ఆహారాల్లో లభిస్తుంది? పూర్తి వివరాలు ఇవిగో..