Jilebi Sweet Recipe: జిలేబీలు చాలా మందికి ఇష్టమైన, నోరూరించే స్వీట్. బయట క్రిస్పీగా, లోపల జ్యుసీగా ఉండే.. ఈ స్వీట్ పండగలకు, మరింత శోభను ఇస్తుంది. దీన్ని ఇంట్లోనే సులభంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
జిలేబీ తయారీకి కావాల్సిన పదార్థాలు:
1. పిండి కోసం:
మైదా పిండి: 1 కప్పు
శనగపిండి: 1 టేబుల్ స్పూన్
తాజా పెరుగు: 1 టేబుల్ స్పూన్
బేకింగ్ సోడా లేదా ఉప్పు: 1/4 టీస్పూన్
నీరు: పిండి కలిపేందుకు సరిపడా
ఫుడ్ కలర్ లేదా చిటికెడు పసుపు
నూనె లేదా నెయ్యి: వేయించడానికి సరిపడా
2. చక్కెర పాకం కోసం:
పంచదార : 2 కప్పులు
నీరు: 1 కప్పు
యాలకుల పొడి: 1/2 టీస్పూన్
కుంకుమ పువ్వు : కొద్దిగా
జిలేబీ తయారీ విధానం: 
స్టెప్- 1: జిలేబీ పిండి సిద్ధం చేయడం:
పిండి కలపడం: ఒక గిన్నెలో మైదా పిండి, శనగపిండి,పెరుగు తీసుకుని కలపాలి.
పిండిని పులియబెట్టడం : ఈ మిశ్రమంలో కొద్దికొద్దిగా నీరు పోస్తూ దోసె పిండి కంటే కొంచెం గట్టిగా ఉండేలా ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ పిండిని కనీసం 10-12 గంటలు లేదా రాత్రంతా వెచ్చని ప్రదేశంలో ఉంచాలి. ఇది పులియడం వల్ల జిలేబీలకు సరైన రుచి, గుల్లదనం వస్తుంది. (పిండి పులియకుంటే.. క్రిస్పీగా ఉండే ఇన్స్టంట్ జిలేబీ కోసం చివరగా బేకింగ్ సోడా/ఫ్రూట్ సాల్ట్ కలుపుకోవచ్చు.
తయారీకి ముందు: జిలేబీలు వేయించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, పులియబెట్టిన పిండిలో చిటికెడు ఫుడ్ కలర్ (అవసరమైతే), బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి. పిండి మరీ చిక్కగా ఉంటే కొద్దిగా నీళ్లు కలిపి జారుడుగా ఉండేలా చూసుకోవాలి.
వేయడానికి సిద్ధం: ఈ పిండిని జిలేబీ మేకర్ (సాస్ బాటిల్), లేదా చిన్న రంధ్రం చేసిన జిప్-లాక్/పాల ప్యాకెట్లో పోయాలి.
స్టెప్- 2: చక్కెర పాకం తయారు చేయడం:
ఒక మందపాటి గిన్నెలో పంచదార, నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టాలి.
పంచదార కరిగిన తర్వాత.. పాకం కొద్దిగా చిక్కబడే వరకు మరిగించాలి.
పాకం : ఒక తీగ పాకం వచ్చేలా చూసుకోవాలి (వేళ్ళ మధ్య పాకాన్ని తీసుకుంటే ఒక సన్నని తీగలా సాగాలి). పాకం మరీ గట్టిగా ఉంటే జిలేబీ లోపలికి పాకం సరిగా పీల్చుకోదు.
చివరగా యాలకుల పొడి, కుంకుమ పువ్వు వేసి స్టవ్ ఆఫ్ చేసి, పాకం గోరువెచ్చగా ఉండేలా పక్కన పెట్టుకోవాలి.
స్టెప్ – 3: జిలేబీలు వేయించడం: 
ఒక వెడల్పాటి, మందపాటి పాన్లో వేయించడానికి సరిపడా నూనె లేదా నెయ్యి పోసి మధ్యస్థ మంటపై వేడి చేయాలి.
నూనె వేడెక్కిన తర్వాత.. పిండి ఉన్న బాటిల్ లేదా ప్యాకెట్ సహాయంతో గుండ్రటి వలయాలు (స్పైరల్స్) తిప్పుతూ జిలేబీలను నూనెలో వేయాలి.
జిలేబీలను రెండు వైపులా బంగారు రంగు వచ్చేవరకు.. క్రిస్పీగా మారేవరకు తక్కువ మంటపై వేయించాలి.
వేయించిన జిలేబీలను వెంటనే తీసి, గోరువెచ్చగా ఉన్న చక్కెర పాకంలో వేయాలి.
ఒక నిమిషం పాటు పాకంలో ఉంచి, రెండు వైపులా పాకం బాగా పీల్చుకున్న తర్వాత తీసి సర్వ్ చేయండి.
Also Read: ఐస్ క్యూబ్స్ ఇలా వాడితే చాలు.. ఎంత మాడిన పాత్రలైనా కొత్తవాటిలా మెరుస్తాయ్
చిట్కాలు:
పాకం చాలా ముఖ్యం: పాకం చల్లగా ఉంటే జిలేబీ పాకాన్ని పీల్చుకోదు. వేడిగా ఉంటే మెత్తబడుతుంది. అందుకే గోరు వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.
క్రిస్పీనెస్ కోసం: జిలేబీలను తక్కువ నుంచి మధ్యస్థ మంటపై నెమ్మదిగా వేయించడం వల్ల అవి కరకరలాడతాయి. వేయించడానికి నెయ్యిని ఉపయోగిస్తే రుచి మరింత పెరుగుతుంది.
జిలేబీలు వేడిగా తింటే రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ పద్ధతిని అనుసరించి మీరూ ఇంట్లో అచ్చం స్వీట్ షాపుల్లో దొరికేలా రుచికరమైన జిలేబీలను తయారు చేసుకోవచ్చు.