Monsoon Tips:స్కూల్లు, వర్షాలు.. రెండూ ఒకేసారి మొదలైపోతాయి.స్కూల్కు పంపించకుండా పిల్లలను ఇంట్లో ఉంచుకోలేం.. అలా అని వర్షంలో పంపించలేం.సో.. పిల్లలు వర్షంలో తడవకుండా స్కూల్కు ఎలా పంపించాలి? వారికి జలుబు, జ్వరం రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అనే టెన్షన్ చాలామంది తల్లిదండ్రుల్లో ఉంటుంది.
మరి ఎలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే పిల్లలను సురక్షితంగా, ఆరోగ్యంగా స్కూల్కు పంపించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా చెప్పాలంటే.. ఇది వర్షాకాలం.ఉదయం ఎండగా ఉందని.. సాయంత్రం కూడా అలాగే ఉంటుందని అనుకోవడం పొరపాటు.ఎందుకంటే ఈ కాలంలో ఎప్పుడు వర్షం పడుతుందో చెప్పలేం.అందుకే ముందు జాగ్రత్తగా పిల్లల బ్యాగ్లో చిన్న గొడుగు లేదా రెయిన్కోట్ పెట్టడం మంచిది.
చిన్న పిల్లలకు గొడుగు కంటే రెయిన్కోట్ వాడటం సులభం. పైగా శరీరం మొత్తం తడవకుండా ఉంటుంది.
చాలామంది బ్యాగ్ తడిసిపోతుందేమో అని టెన్షన్ పడుతుంటారు.అందుకే బ్యాగ్కు వాటర్ప్రూఫ్ రెయిన్ కవర్ వేయాలి.ముఖ్యమైన పుస్తకాలు, నోట్బుక్స్ను ప్లాస్టిక్ ఫైల్ లేదా వాటర్ప్రూఫ్ కవర్లో పెట్టడం మంచిది.
వర్షాకాలంలో పిల్లల షూస్, సాక్స్ తడవడం చాలా సాధారణం.అవి అలాగే వేసుకుంటే కాళ్లకు ఫంగస్, దురద, చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.అందుకే వీలైతే బ్యాగ్లో మరో జత సాక్స్ పెట్టండి.ఇంటికి వచ్చిన వెంటనే షూస్, సాక్స్ను బాగా ఆరబెట్టాలి.ఒకవేళ మరుసటి రోజు కూడా అవి తడిగా ఉంటే.. వాటిని అస్సలు వేసి పంపించకండి.
వర్షాకాలంలో బయట ఆహారం త్వరగా పాడైపోతుంది.అందుకే పిల్లలకు ఇంట్లో తయారు చేసిన తాజా ఆహారమే ఇవ్వాలి.వేడి వేడి టిఫిన్, శుభ్రమైన మంచినీళ్ల బాటిల్ తప్పనిసరిగా ఇవ్వండి.బయట దొరికే ఆహారం ఎక్కువగా తింటే కడుపు సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది.
చిన్న పిల్లలకు వర్షంలో ఆడుకోవడం చాలా ఇష్టం.కానీ రోడ్డుపై నిలిచిన నీటిలో గాజు ముక్కలు, రాళ్లు లేదా ఇతర ప్రమాదకర వస్తువులు ఉండే అవకాశం ఉంటుంది.వాటి వల్ల గాయాలు, ఇన్ఫెక్షన్లు రావచ్చు.అందుకే కోప్పడకుండా.. వర్షపు నీళ్లలో ఎక్కువగా ఆడొద్దని అర్థమయ్యేలా చెప్పండి.
వర్షం పడుతున్నప్పుడు పిల్లలు “నేను ముందు.. నేను ముందు” అంటూ బస్సు ఎక్కడానికి తొందరపడుతుంటారు.అలా చేయడం ప్రమాదకరం.బస్సు పూర్తిగా ఆగిన తర్వాతే ఎక్కాలని ముందుగానే వారికి చెప్పాలి.
వర్షాకాలంలో దోమలు ఎక్కువగా పెరుగుతాయి.అందుకే ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.సాయంత్రం సమయంలో పిల్లలకు పూర్తి చేతుల బట్టలు వేయడం వల్ల దోమలు కుట్టకుండా ఉంటుంది.
చాలామంది తల్లిదండ్రులు జలుబు, జ్వరం వచ్చినా స్కూల్ మిస్ అవుతుందనే భయంతో పిల్లలను పంపిస్తుంటారు.కానీ అలా చేస్తే అనారోగ్యం మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది.అందుకే పూర్తిగా కోలుకున్న తర్వాతే స్కూల్కు పంపడం మంచిది.
ఈ రోజుల్లో చాలా స్కూల్లు ముఖ్యమైన సమాచారాన్ని వాట్సాప్ గ్రూపుల ద్వారా పంపుతున్నాయి.వర్షాల కారణంగా సెలవులు, టైమ్ మార్పులు లేదా ఇతర సూచనలను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి.
also read :ఫోన్లో సీక్రెట్లు ఉంటేనే గొడవలు.. భార్యాభర్తలు ఇది తెలుసుకోవాలి!
మొత్తంగా ఈ వర్షాకాలంలో మనం తీసుకునే చిన్న చిన్న జాగ్రత్తలే పిల్లలను ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచుతాయి.కాబట్టి ఈ సులభమైన అలవాట్లను పాటించి.. మీ పిల్లలు వర్షాకాలంలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్కూల్కు వెళ్లేలా చూసుకోండి.మర్చిపోకండేం !