చాలా మంది భోజనం తర్వాత మిగిలిపోయిన ఆహారాన్ని పారేస్తారు. కానీ వేస్ట్ కాకుండా మిగిలిన వెజ్ డిష్తో కొత్త రుచికరమైన వంటలు సులభంగా తయారు చేయవచ్చు. మిగిలిన ఆహారాన్ని తిరిగి ఉపయోగించడం వల్ల కిచెన్ వేస్ట్ తగ్గించడంతో పాటు, డబ్బు కూడా ఆదా అవుతుంది. కొన్ని సాధారణ కిచెన్ టిప్స్తో మిగిలిన ఆహారాన్ని కొత్త రుచికరమైన డిష్ తయారు చేయవచ్చు.
మధ్యాహ్నం లేదా రాత్రి భోజనం తర్వాత వెజ్ కర్రీస్ మిగులుతూనే ఉంటాయి. వాటిని వృథా చేయకుండా రుచికరమైన స్నాక్స్ లేదా త్వరిత భోజనంగా మార్చవచ్చు. ఈ వంటలు చాలా తక్కువ సమయంలో సులభంగా తయారవుతాయి.
ఇంట్లో చేసిన డ్రై వెజ్ డిష్ మిగిలిపోతే.. అది టిక్కీలు చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా కూరగాయలను మెత్తగా నలిపేయండి. మంచి రుచి కోసం బ్రెడ్ క్రంబ్స్, కొద్దిగా చాట్ మసాలా వేసి కలపండి. అన్నీ బాగా మిక్స్ చేసి గట్టి మిశ్రమం తయారు చేయండి.
చేతులతో చిన్న చిన్న టిక్కీలుగా ఆకారాలు ఇవ్వండి. స్టవ్పై పాన్ పెట్టి మీడియం ఫ్లేమ్పై నూనె వేడి చేసి, టిక్కీలను రెండు వైపులా గోల్డెన్ కలర్ వచ్చేవరకు వేయించండి. వేడిగా చట్నీ లేదా టమాటో సాస్తో వడ్డించండి. ఒక్కసారి టేస్ట్ చూసిన వారంతా లొట్టలేసుకుంటూ తినేస్తారు.
ఈ టిక్కీలు పిల్లలు, పెద్దలకు సాయంత్రం స్నాక్స్ రూపంలో చాలా బాగుంటాయి. లంచ్ బాక్స్లో కూడా సులభంగా ప్యాక్ చేసుకోవచ్చు.
మిగిలిన వెజ్ కూరలు ప్లెయిన్ రైస్ని త్వరగా రుచికరంగా మార్చేస్తాయి. ఈ వంట కేవలం నిమిషాల్లో సిద్ధమవుతుంది. ముందుగా వండిన అన్నం ఒక ప్లేట్లో విప్పి ఉంచండి. కొంచెం ఉప్పు, పసుపు, కారం వేయండి.
పాన్లో నెయ్యి లేదా నూనె వేడి చేసి, జీలకర్ర, పచ్చి మిర్చి వేసి సువాసన కోసం వేయించండి. అందులో మిగిలిన సబ్జీ వేసి బాగా కలపండి. తర్వాత ఉడికించిన రైస్ అన్నీ ఏకంగా కలపండి.
తక్కువ ఫ్లేమ్పై రెండు నిమిషాలు వేయించి, కొత్తిమీరా, నిమ్మరసం వేసి వడ్డించండి. ఈ మసాలా రైస్ ప్రతిసారీ తాజా, రుచికరంగా ఉంటుంది.
Also Read: మీ పిల్లాడిలో తెలివితేటలు పెరగాలంటే.. ఖరీదైన స్కూల్ లేదా ట్యూషన్ కాదు.. ఇవి నేర్పించండి
మిగిలిన ఆహారంతో స్టఫ్ పరాఠాలు చేయడం ఈజీ ఆప్షన్. డ్రై సబ్జీని మెత్తగా నలిపి పెద్ద ముక్కలు లేకుండా చేయండి. చిన్న చిన్న పిండి ఉండలు తీసుకొని కొద్దిగా చపాతీ ఆకారం చేసి, మధ్యలో వెజ్ కూర మిక్స్ నింపండి.
పిండిని అన్ని వైపులా మూసి, జాగ్రత్తగా చపాతీ ఆకారంలో చుట్టండి. వేడి పాన్పై రెండు వైపులా వేయించి, కొంచెం నెయ్యి లేదా బటర్ వేసి క్రిస్పీగా తయారు చేయండి.
ఈ పరాఠాలతో పాటు పుదీనా చట్నీ, పచ్చడి లేదా పెరుగుతో వడ్డించండి. ఉదయం బ్రేక్ఫాస్ట్ లేదా రాత్రి భోజనానికి చాలా రుచిగా ఉంటాయి. ప్రయాణాలకు కూడా తీసుకెళ్లవచ్చు.