Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో ప్రయాణం ఒక మరుపురాని అనుభూతి. ముఖ్యంగా 180 డిగ్రీలు తిరిగే రొటేటింగ్ సీట్లో (Rotating Seats) కూర్చొని.. విండోస్ నుంచి బయటకు చూస్తూ సాగిపోతే.. ఆ కిక్కే వేరు. అయితే, భవిష్యత్తులో మీరు ఆ కిక్కు మిస్ కానున్నారు. ఎందుకంటే.. రైల్వేకు చెందిన సీనియర్ ఇంజినీర్లు రొటేటింగ్ సీట్లను తొలగించాల్సిందేని ప్రతిపాదించారు. ఇందుకు మూడు ముఖ్యమైన కారణాలు చెప్పారు.
180 డిగ్రీలు తిరిగే ఈ సీట్ల నుంచి విండో వైపు తిరిగి చూస్తే.. వ్యూ అద్భుతంగా ఉంటుంది. అందుకే చాలామంది వందే భారత్ ఎక్స్ప్రెస్ లోని ఎగ్జిక్యూటివ్ క్లాస్ (Executive Class – EC) కోచ్లను బుక్ చేసుకుంటారు. సాధారణ సిట్టింగ్ కలిగిన కోచ్ కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. రేటు కూడా చాలా ఎక్కువ. అలాంటిది.. ఈ సీట్ల ఉండబోవనే విషయం ప్రయాణికులకు తెలిస్తే.. తప్పకుండా నిరుత్సాహానికి గురవ్వుతారు. ఆ సీట్లు బుక్ చేసుకోడానికి కూడా వెనకాడతారు.
శాతాబ్ది వంటి ఇతర ప్రీమియం రైళ్ల మాదిరిగానే వందే భారత్లోనూ సాధారణ స్థిరమైన ఫిక్సుడ్ సీట్లనే అమర్చాలని సీనియర్ ఇంజినీర్లు రైల్వే బోర్డుకు సూచించారు. ఇటీవల జరిగిన ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ల (PCME) సమావేశంలో ఈ అంశంపై చర్చించారు. సీట్లను తిప్పే మెకానిజమ్ను తీసివేయడానికి ఇంజనీర్లు ప్రధానంగా మూడు కారణాలను వెల్లడించారు.
తరచుగా మరమ్మతులు: సీట్లను 180 డిగ్రీలు తిప్పడానికి, వెనక్కి వాల్చడం కోసం ప్రత్యేకమైన మెకానికల్ పార్టులను ఉపయోగిస్తున్నారు. వాటిని తరుచుగా ఉపయోగించడం వల్ల ఆయా భాగాలు వదులైపోతున్నాయి. త్వరగా అరిగిపోయి పాడైపోవడం వల్ల మెయింటెనెన్స్ ఖర్చులు పెరిగిపోతున్నాయట. వాటిని రిప్లేస్ చేయడానికి, మరమ్మతులు చేయడానికి కూడా చాలా టైమ్ పట్టేస్తోందట.
అదనపు సీట్లు.. అదనపు ఆదాయం: రొటేటింగ్ ఫీచర్ను తొలగించి, సీట్లను నేరుగా కోచ్ ఫ్లోర్కు ఫిక్స్ చేయడం వల్ల సీట్లు మరింత ధృడంగా ఉంటాయని ఇంజనీర్లు చెబుతున్నారు. అలాగే.. సీటు పక్కకు తిరగడం వల్ల ఎక్కువ ఖాళీ స్థలం అవసరం అవుతుందని, రోటేషన్ సిస్టమ్ తొలగిస్తే.. సీట్ల మధ్య దూరం తగ్గుందని తెలిపారు. దీనివల్ల ఎగ్జిక్యూటివ్ కోచ్లో అదనంగా మరికొన్ని సీట్లు ఫిక్స్ చేయవచ్చని, దానివల్ల రైల్వేకు అదనపు ఆదాయం వస్తుందని సూచించారు.
Also Read: వందే భారత్ రైలు చక్రాలకు తాళాలు వేసిన లోకో పైలెట్.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ఇంజినీర్లు చేసిన ప్రతిపాదనలను చెన్నైలోని ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) ప్రిన్సిపల్ చీఫ్ మెకానికల్ ఇంజనీర్కు పంపించారు. ఈ ప్రతిపాదనను పరిశీలించి తగిన సూచనలు చేయాలని రైల్వే బోర్డు సూచించింది. ప్రస్తుతం ఈ మార్పులు ప్రాథమిక ప్రతిపాదన దశలోనే ఉంది. త్వరలోనే దీనిపై పూర్తి నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. ఆ సీట్లను తొలగిస్తే.. ఎగ్జిక్యూటివ్ క్లాస్కు అర్థమే ఉండదనేది ప్రయాణికుల అభిప్రాయం. మరి రైల్వే ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.