ఎంతో మందికి దంతాలపై పసుపు పూత ఏర్పడుతుంది. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా కొన్ని అలవాట్లు, ఆహారపు అలవాట్లు కారణంగా దంతాలు క్రమంగా పసుపు రంగులోకి మారుతాయి. ముఖ్యంగా టీ, కాఫీ ఎక్కువగా తాగడం, ధూమపానం చేయడం, సరైన విధంగా బ్రష్ చేయకపోవడం వల్ల పళ్లపై మలినాలు పేరుకుపోతాయి. ఈ మలినాలు క్రమంగా పొరలా ఏర్పడి పళ్లు పసుపుగా కనిపించేలా చేస్తాయి. సాధారణంగా దంతాలపై ఏర్పడే ఈ పొరను డెంటల్ ప్లేక్ అంటారు. ఇది బ్యాక్టీరియా వల్ల ఏర్పడుతుంది. ఈ పొర ఎక్కువకాలం అలాగే ఉంటే పళ్లు మాత్రమే కాకుండా దంతాల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు పాటిస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
బేకింగ్ సోడాతో
మొదటగా చాలా మంది ఉపయోగించే సులభమైన పద్ధతి బేకింగ్ సోడా. బేకింగ్ సోడాలో స్వల్పంగా రాపిడి గుణం ఉంటుంది. ఇది పళ్లపై ఉన్న మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్లా తయారు చేసి వారానికి ఒకసారి లేదా రెండు సార్లు పళ్లను మెల్లగా బ్రష్ చేస్తే పళ్లపై ఉన్న మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది. మరొక మంచి పద్ధతి ఆయిల్ పుల్లింగ్. ఇది ఆయుర్వేదంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్న పద్ధతి. దీనికి కొబ్బరి నూనె ఉపయోగిస్తారు. ఒక స్పూన్ కొబ్బరి నూనెను నోట్లో వేసుకుని 10 నుంచి 15 నిమిషాలు నోటిలో ఊపుతూ ఉంచాలి. తర్వాత ఉమ్మేసి నోరు కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల నోటిలో ఉండే బ్యాక్టీరియా తగ్గి పళ్లపై ఏర్పడే మలినాలు తగ్గుతాయి.
Also read: Orange peel powder: నారింజ తొక్క పొడితో ఇలా ఫేస్ప్యాక్ వేసుకుంటే చర్మం మిలమిలలాడిపోతుంది
స్ట్రాబెర్రీని ఉపయోగించి
స్ట్రాబెర్రీ పండుతో కూడా దంతాలను మెరిపించుకోవచ్చు. స్ట్రాబెర్రీలో ఉండే మాలిక్ ఆమ్లం పళ్లపై ఉన్న మచ్చలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఒక స్ట్రాబెర్రీని మెత్తగా చేసి అందులో కొద్దిగా బేకింగ్ సోడా కలిపి పళ్లపై మెల్లగా రాస్తే కొంతవరకు పసుపు మచ్చలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ సిడర్ వెనిగర్ కూడా ఉపయోగించి కూడా దంతాలను మెరిపించుకోవచ్చు. దీనిలో స్వల్పంగా బ్లీచింగ్ గుణం ఉంటుంది. కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ను నీటిలో కలిపి నోటిలో కొన్ని సెకన్లు ఉంచి తర్వాత కడుక్కోవచ్చు. అయితే దీన్ని తరచుగా ఉపయోగించకూడదు. ఎక్కువగా వాడితే పళ్లపై ఉన్న సహజ రక్షణ పొర దెబ్బతినే అవకాశం ఉంటుంది.
Also read: Raw milk: ముఖానికి పచ్చిపాలు రాస్తే చర్మం మెరిసిపోవడమే కాదు మురికి మొత్తం పోతుంది
ఇంటి చిట్కాలతో పాటు కొన్ని మంచి అలవాట్లు కూడా పాటించడం చాలా అవసరం. రోజుకు కనీసం రెండు సార్లు బ్రష్ చేయడం చాలా ముఖ్యం. అలాగే ఫ్లాస్ ఉపయోగించడం వల్ల పళ్ల మధ్యలో ఉండే ఆహారపు అవశేషాలు తొలగిపోతాయి. టీ, కాఫీ ఎక్కువగా తాగకుండా ఉండటం కూడా మంచిది. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తినడం కూడా దంతాల ఆరోగ్యానికి సహాయపడుతుంది. ముఖ్యంగా ఆపిల్, క్యారెట్ వంటి పండ్లు తినడం వల్ల దంతాలపై ఉన్న మలినాలు కొంతవరకు తొలగుతాయి. ఈ ఇంటి చిట్కాలు సాధారణంగా పళ్లపై ఉన్న ఉపరితల మచ్చలను మాత్రమే తగ్గించడంలో సహాయపడతాయి. పళ్లపై పసుపు మచ్చలు చాలా ఎక్కువగా ఉంటే లేదా నొప్పి, రక్తస్రావం వంటి సమస్యలు ఉంటే తప్పకుండా దంత వైద్యుడిని సంప్రదించడం మంచిది.