ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లిం భక్తులకు సౌదీ అరేబియా ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఉమ్రా యాత్రను మరింత సులభతరం చేయడానికి ఒక సంవత్సరం కాలపరిమితితో మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసాను ప్రవేశపెట్టింది. ఈ కొత్త విధానం ద్వారా అర్హత కలిగిన యాత్రికులు ఏడాది కాలంలో ఒకటి కంటే ఎక్కువసార్లు ఉమ్రా యాత్ర చేయవచ్చు. ఈ నిర్ణయం సౌదీ అరేబియా విజన్ 2030 లక్ష్యాల్లో భాగంగా తీసుకుంది. దీని ద్వారా మతపరమైన పర్యాటకాన్ని ప్రోత్సహించడంతో పాటు విదేశీ సందర్శకుల సంఖ్యను కూడా పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ముస్లింలు సౌదీ అరేబియా దేశంలో ఉన్న రెండు తీర్థ స్థలాలు మక్కా, మదీనాలో ఉన్న మసీదులకు దర్శనాలకు వెళతారు. ఈ దర్శనాలతో పాటు కొన్ని ప్రత్యేక స్థలాలను సందర్శిస్తారు. ఈ సాధారణ దర్శనాలకు వెళ్లడమే ఉమ్రా యాత్ర. అయితే హజ్ సమయంలో మాత్రం ఈ సాధారణ దర్శనాలు ఉండవు. అంటే ఉమ్రా యాత్ర.. హజ్ సమయంలో వర్తించదు.
కొత్త ఉమ్రా వీసా పొందిన యాత్రికులు ఏడాది కాలంలో అనేకసార్లు సౌదీ అరేబియాలోకి ప్రవేశించవచ్చు. మొత్తం మీద 90 రోజుల వరకు అక్కడ ఉండేందుకు అనుమతి ఉంటుంది. ప్రతి యాత్ర కోసం కొత్త వీసా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ సౌకర్యం భారతదేశం, పాకిస్థాన్, మలేషియా, సింగపూర్, థాయ్లాండ్తో పాటు మరికొన్ని దేశాల యాత్రికులకు అందుబాటులో ఉంటుంది.
ఉమ్రా యాత్రకు వెళ్లే ప్రతి భక్తుడు సౌదీ అరేబియా అధికారిక డిజిటల్ ప్లాట్ఫామ్ అయిన నుసుక్ (Nusuk) ద్వారా సర్వీస్ ప్యాకేజీని బుక్ చేసుకోవాలి. ఈ ప్యాకేజీ వీసాలో మిగిలి ఉన్న రోజుల సంఖ్యకు అనుగుణంగా ఉండాలి. నుసుక్ ప్లాట్ఫామ్ ద్వారా యాత్రకు సంబంధించిన అన్ని సేవలను ఒకే చోట సులభంగా పొందే అవకాశం ఉంటుంది.
వీసా ఉన్నప్పటికీ ప్రతిసారీ ఉమ్రా యాత్రకు బయలుదేరే ముందు నుసుక్ మొబైల్ యాప్ ద్వారా ఉమ్రా పర్మిట్ తీసుకోవాలి. ఈ అనుమతి లేకుండా ఉమ్రా చేసేందుకు అవకాశం ఉండదు. ప్రయాణానికి ముందు అన్ని నిబంధనలు పూర్తి చేస్తే యాత్ర ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాగుతుంది. దీనివల్ల యాత్రికుల సంఖ్యను కూడా అధికారులు సమర్థంగా నిర్వహించగలుగుతారు.
Also Read: ఫ్యామిలీతో థీమ్ పార్క్ వెళ్లే మజానే వేరు.. ప్రపంచంలోని 8 బెస్ట్ థీమ్ పార్క్స్ ఇవే
ఈ వీసా ఒక సంవత్సరం పాటు చెల్లుబాటులో ఉంటుంది. అయితే ప్రతి ఉమ్రా యాత్ర పూర్తయ్యాక యాత్రికుడు సౌదీ అరేబియా విడిచిపెడితే వీసా తాత్కాలికంగా నిలిపివేయబడుతుంది. తరువాతి యాత్రకు అవసరమైన నిబంధనలు పాటించిన తర్వాత అదే వీసా మళ్లీ యాక్టివ్ అవుతుంది. దీంతో ప్రతి ప్రయాణానికి కొత్త వీసా కోసం దరఖాస్తు చేయాల్సిన అవసరం ఉండదు.
మల్టిపుల్ ఎంట్రీ ఉమ్రా వీసా.. హజ్ సీజన్లో వర్తించదు. ఇస్లామిక్ క్యాలెండర్ ప్రకారం.. ధు అల్ ఖైదా ఒకటవ తేదీ నుంచి ధు అల్ హిజ్జా 13వ తేదీ వరకు ఈ వీసాపై పరిమితులు అమల్లో ఉంటాయి. అంటే 2027లో ఈ కాలం ఏప్రిల్ 8 నుంచి మే 19 వరకు ఉండే అవకాశం ఉంది. ఈ తేదీల్లో హజ్ సీజన్ ఉంటుంది కాబట్టి ఉమ్రా యత్రికులకు ప్రవేశం ఉండదు. హజ్ యాత్ర చేయాలనుకునే వారు ప్రత్యేక హజ్ వీసా కోసం దరఖాస్తు చేయాలి.