వేసవిలో చాలా మంది వేడి వాతావరణాన్ని తట్టుకోవడానికి చల్లగా ఉండే పానీయాలు, ఆహారాలు తీసుకుంటారు. కానీ చల్లగా అనిపించే కొన్ని ఆహారాలు శరీరం లోపలి వేడిని తగ్గించకపోగా మరింత పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు. నోట్లో వేసుకోగానే చల్లగా అనిపించినా, జీర్ణ ప్రక్రియ సమయంలో శరీరం ఎక్కువ శక్తి వినియోగిస్తుంది. దీన్నే డైట్ ఇండ్యూస్డ్ థర్మోజెనెసిస్ అంటారు. చక్కెర, నూనె ఎక్కువ ఉన్న ఆహారాలు ఈ వేడిని ఇంకా పెంచుతాయి. వేడి వాతావరణంలో శరీరానికి చల్లదనం కంటే అత్యంత అవసరం నీరు.
ఐస్ క్రీమ్ తిన్న వెంటనే చల్లగా అనిపిస్తుంది. కానీ అందులో ఉండే ఎక్కువ చక్కెర, కొవ్వు శరీరంలో తర్వాత క్రమంగా వేడిని పెంచుతాయి. ఎక్కువ తినడం వల్ల కడుపులో గ్యాస్, అలసట వస్తాయి. కొందరికి దాహం ఎక్కువవుతుంది, శక్తి తగ్గుతుంది. కాబట్టి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఐస్ క్రీమ్ తినాలని అనిపించినా పరిమితంగానే తినాలి.
వేసవి మధ్యాహ్న సమయంలో చాలా మంది చల్లని సాఫ్ట్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ పానీయాలు శరీరానికి కావాల్సిన నీరు అందించవు. ఎక్కువ చల్లగా ఉండే డ్రింక్స్ జీర్ణక్రియను నెమ్మదిస్తాయి. దీంతో కడుపు నొప్పి, ఉబ్బరం వస్తాయి. సాఫ్ట్ డ్రింక్స్ కంటే ఎలక్ట్రోలైట్స్ ఉన్న పానీయాలు (ఓఆర్ఎస్) తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.
విచిత్రమేమిటంటే వేడిగా ఉండే ఆహారాలు వేసవిలో శరీర సమతుల్యతను కాపాడతాయి. జీరా, సొంపు, అల్లం వంటి తేలికపాటి మసాలాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. ఉబ్బరం తగ్గుతుంది. వేసవిలో మజ్జిగలో వేయించిన జీరా కలిపి తాగడం చాలా మంచిది. ఇలాంటి సాంప్రదాయిక ఆహారాలు భోజనంలో కలిపి తింటే శరీరానికి బాగా సహాయపడతాయి.
Also Read: పొరపాటున కూడా మిక్సిలో ఈ వస్తువులు వేయకూడదు.. వేస్తే భారీ నష్టమే
వేడి ఎక్కువగా ఉన్నప్పుడు నీరు ఎక్కువగా ఉండే ఆహారాలు, తేలికపాటి భోజనాలు తీసుకోవాలి.
కూరగాయలు, పండ్లు: పుచ్చకాయ, కీరా దోశ, పుదీనా
పానీయాలు: కొబ్బరి నీళ్లు, మజ్జిగ
ఇంటి వంటలు: పులియబెట్టిన ఆహారాలు అంటే ఇడ్లి, దోశ కూడా పేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
చల్లగా అనిపించే ఫుడ్స్, డ్రింక్స్ కొంతసేపు మాత్రమే శరీరానికి సాయం చేస్తాయి. ఆయిలీ, హెవీ ఫుడ్స్ తర్వాత సమస్యలు తెస్తాయి. వేసవిలో నీరు ఎక్కువ తాగి, తేలిక ఆహారాలు తినండి.