History of Karachi Biscuits: శత్రుదేశం పాకిస్తాన్ తో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ప్రతి భారతీయుడు, పాకిస్తాన్ అంతు చూడాల్సిందేనని పట్టుబడుతున్నారు. అలాగే పాకిస్తానీల నీడ కూడా మన దేశంపై ఉండకూడదన్నది మనందరి అభిమతం. అందుకు తగ్గట్లుగా కేంద్రం సైతం పాకిస్తానీలు మన దేశం నుండి వెళ్లిపోవాలని ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడి వరకు అంతా బానే ఉంది కానీ, తాజాగా ఒక పేరుపై వివాదం చెలరేగుతోంది. ఆ పేరే కరాచీ. పాకిస్తాన్ లో ఉండే కరాచీకి మనకు ఏంటి సంబంధం? అసలు మన దేశంలో కరాచీ పేరు ఎందుకు వినిపిస్తుంది? ఆ పూర్తి విషయాలు తెలుసుకుందాం.
పాకిస్తాన్ పై పగ..
పరాయి దేశం పాకిస్తాన్ చేసిన ఉగ్రదాడితో మన దేశం రగిలిపోతోంది. ప్రధాని నరేంద్ర మోడీ సైతం పాకిస్తాన్ అంతు చూసేలా ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలకు యావత్ భారతావని అండగా నిలిచింది. అంతేకాకుండా 26 మందిని పొట్టనబెట్టుకున్న ఉగ్రమూక అంతు తేల్చాలన్నది మనందరి అభిమతం. అంతేకాకుండా మన దేశంలో ఉంటూ పాకిస్తాన్ కు సహకరిస్తున్న ఏ ఒక్కరినీ వదిలి పెట్టరాదన్నది కూడా ప్రతి ఇండియన్ కోరిక. అందుకే కేంద్రం సైతం దేశ వ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలను వారి దేశానికి పంపించి వేసింది.
తెరపైకి కరాచీ..
పాకిస్తాన్ లో ఉండే ప్రధాన నగరం కరాచీ. ఆ పేరుతో మన ఇండియాలో ఎన్నో బేకరీలు ఉన్నాయి. ఈ బేకరీలలో బిస్కెట్స్ చాలా ఫేమస్. ఈ బేకరీలో దొరకని బిస్కెట్లు ఉండవు. ఎన్ని రకాల బిస్కెట్స్ కావాలంటే అన్ని రకాలు ఇక్కడ దొరుకుతాయి. చిన్నా, పెద్దా తేడా లేకుండా ఈ బిస్కెట్స్ తినేందుకు అమిత ఆసక్తి చూపుతారు. అయితే పాకిస్తాన్ లో ఉండే కరాచీ పేరును ఇక్కడ ఉపయోగించడం వెనుక ఇప్పుడు ఈ అంశం తెరపైకి వచ్చింది. వెంటనే పేరు మార్చాలన్న డిమాండ్ అధికంగా వినిపిస్తోంది. ఇంతకు కరాచీ బిస్కెట్స్ కు పాకిస్తాన్ కు సంబంధం ఉందా లేదా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
కరాచీ బిస్కెట్స్ వెనుక అసలు కథ..
కరాచీ బిస్కెట్ల ప్రయాణంకు తొలిబీజం పడింది హైదరాబాద్లోనే. 1953లో స్థాపించబడిన ఈ బేకరీ రుచికరమైన బిస్కెట్లతో దేశవ్యాప్తంగా పేరు గడించింది. కరాచీ అనే పేరు వెనుక.. 1947లో భారత్-పాకిస్తాన్ విభజన సమయంలో, కొన్ని కుటుంబాలు పాకిస్తాన్లోని కరాచీ నుండి భారతదేశానికి వలస వచ్చాయి. ఈ కుటుంబాల్లో కొందరు హైదరాబాద్లో స్థిరపడి, తమ స్వస్థలం పేరును గుర్తుగా ఉంచుకోవడానికి బేకరీకి కరాచీ అని నామకరణం చేసినట్లు తెలుస్తోంది.
వలస ఒక్కటే?
కరాచీ బేకరీని ఖాన్ చంద్ రామ్ నాని 1953 లో స్థాపించారు. వీరు 1947 సమయంలో పాకిస్తాన్ లో మేము ఉండము. మేము ఇండియా వెళ్లిపోతాం అంటూ ఇండియా దారి పట్టిన వారుగా తెలుస్తోంది. వీరు మొట్టమొదట హైదరాబాద్ నగరంలో కరాచీ బేకరీని స్థాపించి, నేడు దేశ వ్యాప్తంగా తమ బ్రాంచెస్ నడుపుతున్నారు. ఈ బేకరీకి పాకిస్తాన్లోని కరాచీ నగరంతో ఏ విధమైన ప్రత్యక్ష వ్యాపార సంబంధం లేదని చెప్పవచ్చు. స్థాపకులు కరాచీ నుండి వలస వచ్చినవారై ఉండవచ్చు, కానీ సంస్థ యొక్క కార్యకలాపాలు పూర్తిగా భారతదేశంలోనే నిర్వహిస్తున్నారు.
బ్రాండెడ్ బిస్కెట్స్..
నమ్మకానికి మారుపేరుగా కరాచీ బిస్కెట్స్ నిలిచాయని కొనుగోలుదారులు తెలుపుతున్నారు. ఇక్కడ ఫ్రూట్ బిస్కెట్స్, ఓస్మానియా బిస్కెట్లు, సాల్ట్ బిస్కెట్లు ఎంతో రుచి అంటుంటారు. అందుకే వీరి బిజినెస్ నాటి నుండి నేటి వరకు మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరించింది.
వివాదం ఏమిటి?
ప్రస్తుతం పాకిస్తాన్ పేరు ఎత్తితే చాలు మనం ఊరుకొనే పరిస్థితులు లేవు. ఆ దేశం, మనదేశంపై చేసిన ఉగ్రదాడి అటువంటిది. అందుకే తెరపైకి కరాచీ బిస్కెట్స్ వచ్చాయి. ఈ బిస్కెట్స్ కంపెనీ మార్చాలని, లేకుంటే దేశద్రోహం కేసు నమోదు చేయాలన్నది పలువురి డిమాండ్. ఎప్పటి నుండో బ్రాండ్ గా గల తమ పేరును సంస్థ మారుస్తుందో లేదో కానీ, ఇప్పుడు మాత్రం ఈ పేరు వివాదంగా మారింది. స్వాతంత్ర్యం సమయంలో మాకు ఇండియా ముద్దు అంటూ వలస వచ్చిన వీరు, ప్రస్తుత ఆందోళనల నేపథ్యంలో పేరు మార్చేందుకు చొరవ చూపాలని కొందరు కోరుతున్నారు. సంస్థకు వ్యతిరేకం కాదని, పాకిస్తాన్ దేశం పేరును ఇంకా కలిగి ఉండడం తమ ఆందోళనకు కారణమని మరికొందరు అంటున్నారు. మొత్తం మీద కరాచీ బిస్కెట్స్ యాజమాన్యం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.