Karate Kalyani : నటుడు శివాజీ హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్లో కార్చిచ్చులా రేగుతున్నాయి. ఈ వివాదంపై సోషల్ మీడియా రెండు వర్గాలుగా విడిపోగా, తాజాగా నటి కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చి శివాజీకి అండగా నిలిచారు. ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు మరింత చర్చకు దారితీస్తున్నాయి. ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్లో శివాజీ మాట్లాడుతూ.. హీరోయిన్లు పబ్లిక్ ఈవెంట్లలో ధరించే పొట్టి దుస్తులు చూసి బాధ కలుగుతోందని, స్త్రీ ప్రకృతి లాంటిదని, ఆమె నిండుగా ఉంటేనే గౌరవం పెరుగుతుందని వ్యాఖ్యానించారు. ఈ మాటలపై అనసూయ, చిన్మయి వంటి వారు డ్రెస్సింగ్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ అంటూ మండిపడ్డారు.
శివాజీకి మద్దతుగా కరాటే కళ్యాణి
ఈ ఇష్యూపై ఒక టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న కరాటే కళ్యాణి, శివాజీ వ్యాఖ్యల్లోని అంతరార్థాన్ని సమర్థించారు. కథ డిమాండ్ చేస్తే సినిమాలో గ్లామర్గా కనిపించడం వేరు.. కానీ పబ్లిక్ ఫంక్షన్లకు వచ్చేటప్పుడు అర్ధనగ్నంగా కనిపించాల్సిన అవసరం ఏముంది? అని ఆమె ప్రశ్నించారు. శివాజీ ఒక అన్నగా, తండ్రిగా ఆందోళన చెంది ఆ మాటలు అన్నారని, ఆయన ఉద్దేశం మంచిదేనని స్పష్టం చేశారు.
అనసూయపై ఘాటు విమర్శలు
ముఖ్యంగా అనసూయ తీరును కళ్యాణి తప్పుబట్టారు. అనసూయ ఇంట్లో ఫంక్షన్లు ఉంటే పద్ధతిగా కనిపిస్తారు.. మరి బయట కార్యక్రమాల్లో ఆ బాధ్యత ఎందుకు ఉండదు? అని అడిగారు. హీరోయిన్ల డ్రెస్సింగ్ను చూసి చిన్న పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉందని, సమాజంలో సంస్కృతి పడిపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏమైనా చూపించేది ఉంటే మీ ఆయనకు చూపించుకోండి.. పబ్లిక్కి కాదు అంటూ ఆమె చేసిన ఘాటు వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి.
శివాజీ వాడిన పదాలు తప్పుగా ఉన్నా, ఆయన చెప్పిన పాయింట్ కరెక్ట్ అని కళ్యాణి అభిప్రాయపడ్డారు. సోషల్ మీడియాలో అశ్లీలత పెరిగిపోతోందని, అభ్యుదయవాదులు ఇలాంటి విషయాలపై కూడా మాట్లాడాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ వివాదం రోజురోజుకూ ముదురుతుండటంతో, దీనిపై అనసూయ ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.