Pushpa 2 Case: హైదరాబాద్లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ సంధ్య థియేటర్లో ‘పుష్ప 2’ ప్రీమియర్ షో సమయంలో జరిగిన విషాదకర తొక్కిసలాట కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో నేడు (సోమవారం) నాంపల్లి కోర్టుకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. గత వారమే న్యాయస్థానం ఆయనకు సమన్లు జారీ చేస్తూ, విచారణకు ఖచ్చితంగా హాజరుకావాలని ఆదేశించింది. పోలీసుల అనుమతి లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు రావడం వల్లే అక్కడ భారీగా జనసందోహం పెరిగి, నియంత్రణ కోల్పోయి తొక్కిసలాటకు దారితీసిందనేది ప్రధాన ఆరోపణ. ఈ ప్రమాదంలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమె కుమారుడు తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే.
ఈ సంచలన ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపిన చిక్కడపల్లి పోలీసులు ఇప్పటికే నాంపల్లి కోర్టులో సుదీర్ఘమైన చార్జ్షీట్ను దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చేర్చగా, అందులో హీరో అల్లు అర్జున్ను ఏ11 (A11) గా పేర్కొన్నారు. ఇక థియేటర్ యాజమాన్యం, ప్రమోటర్లు, ఈవెంట్ నిర్వాహకులను A1 నుంచి A10 నిందితులుగా పోలీసులు చార్జ్షీట్లో పొందుపరిచారు. సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం, క్రౌడ్ మేనేజ్మెంట్లో వైఫల్యం మరియు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించడం వల్లే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో స్పష్టం చేశారు.
Read also-నాగచైతన్యతో మాతృత్వం గురించి సమంత గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్..
నేడు కోర్టులో నిందితులందరూ వ్యక్తిగతంగా హాజరైతేనే ఈ కేసు అధికారిక ట్రయల్స్ (విచారణ) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ స్వయంగా నాంపల్లి కోర్టు మెట్లు ఎక్కుతారా, లేదా తన న్యాయవాది ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ పిటిషన్ దాఖలు చేస్తారా అనేది ప్రస్తుతం టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. ఒకవేళ కోర్టుకు హాజరుకాకపోతే న్యాయస్థానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఈ కేసు విచారణ అటు సినీ పరిశ్రమలోనూ, ఇటు అభిమానుల్లోనూ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.