Bharat Bhushan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APSFTVTDC) నూతన చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన పి. భరత్ భూషణ్ తాజాగా ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో అమరావతిలో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. చైర్మన్గా పగ్గాలు చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రితో జరిగిన ఈ తొలి అధికారిక భేటీ ఇటు సినీ వర్గాల్లోనూ, అటు రాజకీయ వర్గాల్లోనూ ఆసక్తిని కలిగిస్తుంది.
ఈ సుదీర్ఘ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో భరత్ భూషణ్ గారు పలు కీలక అంశాలను పంచుకున్నారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో సినిమా షూటింగ్ల నిర్వహణను మరింత సరళతరం చేయడం, సింగిల్ విండో క్లియరెన్స్ విధానాన్ని పటిష్టం చేయడం, విశాఖపట్నం, అమరావతి పరిసర ప్రాంతాలను అంతర్జాతీయ స్థాయి షూటింగ్ స్పాట్లుగా తీర్చిదిద్దడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి.
also read:బోల్డ్ సబ్జెక్ట్తో సందీప్ కిషన్ ఫన్ రైడ్.. ‘సూపర్ సుబ్బు’ ట్రైలర్ అదిరిపోయిందిగా !
ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ స్థాయి నెట్వర్క్ను ఉపయోగించుకుని, బాలీవుడ్ సహా ఇతర ప్రాంతీయ భాషల చిత్ర పరిశ్రమలు కూడా ఆంధ్రా వైపు చూసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన ముఖ్యమంత్రికి వివరించారు. తన టీంతో కలిసి అహర్నిశలు శ్రమించి, ఏపీని సినీ హబ్గా మారుస్తానని, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా టాలీవుడ్కు సరికొత్త ఊపునిస్తానని భరత్ భూషణ్ గారు ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. నూతన చైర్మన్ ఆలోచనలపై స్పందించిన ముఖ్యమంత్రి, చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.
పి. భరత్ భూషణ్ APSFTVTDC చైర్మన్ అయిన ఈ సమయంలోనే , రేపు వెంకటపాలెంలోని అత్యంత పవిత్రమైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ప్రతిష్టాత్మక 112వ చిత్రం (#NBK112) గ్రాండ్గా ప్రారంభం కాబోతోంది. ఈ పూజా కార్యక్రమాలతోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఊపందుకోనుంది. గతంలో బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, అలాగే ఇటీవల వచ్చిన ‘డాకు మహారాజ్’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సంచలనాలు అందరికీ తెలిసిందే.
ఆ సెంటిమెంట్ను కొనసాగిస్తూ, సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న #NBK112 చిత్రం ఏపీ వేదికగా ప్రారంభం కావడంపై భరత్ భూషణ్ తన సంతోషాన్ని తెలిపారు. ఈ భారీ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ , అలాగే సినిమాటోగ్రఫీ మరియు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథులుగా హాజరవుతుండటం విశేషం.
ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఈ కార్యక్రమానికి తరలిరావడం అనేది ఆంధ్రప్రదేశ్లో సినిమా రంగానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమని భరత్ భూషణ్ కొనియాడారు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ గారి ఆధ్వర్యంలో టూరిజం మరియు సినీ పరిశ్రమను కలుపుతూ సరికొత్త పాలసీలను తీసుకురావడానికి ఇదొక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు.
also read:సీక్రెట్గా పెళ్లి చేసుకున్న జబర్దస్త్ ఫైమా.. ఆ పరేషాన్ వెనుక 9 ఏళ్ల లవ్ స్టోరీ!
అమరావతి రాజధాని ప్రాంతంలో ఇలాంటి భారీ చిత్రాల ప్రారంభోత్సవాలు మరియు షూటింగ్లు జరగడం వల్ల స్థానిక కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కేవలం #NBK112 మాత్రమే కాకుండా, రాబోయే రోజుల్లో టాలీవుడ్కు చెందిన టాప్ హీరోల చిత్రాల వేడుకలు, ఆడియో లాంచ్లు, షూటింగ్లు ఆంధ్రాలో నిరంతరం జరిగేలా తమ APSFTVTDC టీం మొత్తం ఒక వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతుందని భరత్ భూషణ్ స్పష్టం చేశారు.