Rajahmundry medico Priyanka case update: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఘటనలో మెడికో విద్యార్థిని ప్రియాంకను కారుతో ఢీకొట్టిన ఘటనకు సంబంధించి పోలీసులు విచారణలో కీలక విషయాలు వెలుగుచూశాయి. ఈ కేసు దర్యాప్తు వివరాలను జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ మీడియా సమావేశంలో అధికారికంగా వెల్లడించారు. ఈ ఘటన కేవలం యాక్సిడెంట్ కాదని, నిందితుల అత్యంత క్రూరమైన చర్య అని ఆయన స్పష్టం చేశారు.
ఈనెల 3వ తేదీ రాత్రి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి తిరిగి వస్తున్న సమయంలో.. ఈ ప్రమాదం చోటుచేసుకుంది.అదే సమయంలో మాల్ వద్దకు వచ్చిన నిందితులు మద్యం మత్తులో ఉన్నారు. మాల్ లోపలికి వెళ్లేందుకు వారు యత్నించగా సెక్యూరిటీ సిబ్బంది వారిని అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన నిందితులు సెక్యూరిటీపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని పట్టుకునేందుకు సిబ్బంది యత్నించడంతో నిందితులు మరింత భయపడి అత్యంత వేగంగా, నిర్లక్ష్యంగా కారును నడిపారు.
పారిపోయే క్రమంలో.. రోడ్డుపై స్కూటీపై వెళ్తున్న వైద్య విద్యార్థులను ఆ నిందితులు కారుతో ఏకంగా మూడు సార్లు బలంగా ఢీకొట్టారు. ఈ దారుణ ఘటనలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు ఆపకుండా హిట్ అండ్ రన్ కేసులా పారి పోయారు. అదే రోజు రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, ఆ రోజు రాత్రే వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్ను సేకరించి కేసు నమోదు చేశారు.
ఘటన జరిగిన తీరును.. పరిశీలించేందుకు పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. స్కూటీని కావాలనే మూడు సార్లు ఢీకొట్టి, ప్రాణాపాయ స్థితిలోకి నెట్టినట్లు సీసీటీవీలో స్పష్టంగా తేలింది. ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన పోలీసులు, కేసు తీవ్రతను బట్టి సెక్షన్లలో మార్పులు చేశారు. నిందితులను ఇప్పటికే అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు. నిందితులు మద్యం మత్తులో డ్రైవ్ చేసినట్లు పక్కా ఆధారాలు సేకరించామని వెల్లడించారు.
ప్రస్తుతం నిందితులపై కల్పబుల్ హోమిసైడ్ అటెంప్ట్ (సెక్షన్ 110) కింద కేసు నమోదు చేశామని, పరిస్థితులకు తగినట్లుగా మరింత కఠిన సెక్షన్లు జత చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నిందితులను మరింత విచారించేందుకు సోమవారం కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని, నిస్పక్షపాతంగా విచారణ జరుగుతోందని చెప్పారు. నగరంలో రాష్ డ్రైవింగ్కు పాల్పడే వారిపై ఉక్కుపాదం మోపుతామని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన నివారణా చర్యలు చేపడతామని ఎస్పీ హెచ్చరించారు.