Jagdish Reddy: స్వేచ్ఛ బ్యూరో : స్కీములు లేవు కానీ.. రోజుకో స్కాం వెలుగు చూస్తోందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్ లో బుధవారం మీడియాతో మాట్లాడారు. హైబ్రిడ్ కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి కేసీఆర్ హయాంలోని పథకాలను కూడా అమలు చేయడం లేదన్నారు. పీఎం కుసుమ్ పథకంలో కూడా వెయ్యి కోట్ల కుంభకోణానికి తెర తీశారన్నారు. చాలా మంది అప్పులు చేసి పీఎం కుసుమ్ పథకంలో చేరి ప్లాంట్ల నిర్మాణం చేశారన్నారు. 1000, 1200 మెగావాట్ల ప్లాంట్ల నిర్మాణం పూర్తయినా రెండు, మూడు నెలలు అయినా సింక్రనైజ్ చేసుకోవడం లేదన్నారు.
మెగావాట్ కు కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్
ఇంధన శాఖ అధికారి ఒకరు, రెడ్కో అధికారి ఒకరు వారిని వేధించి డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. మెగావాట్ కు కోటి రూపాయలు ఇవ్వాలని అంటున్నారన్నారు. ఇన్నాళ్లు సతాయిస్తూ వచ్చి ఇప్పుడు కేంద్రం చెప్పిన ధర కంటే తక్కువ ధర అని అంటున్నారని, ప్రభుత్వ పెద్దలు వారి రక్తం తాగుతున్నారని మండిపడ్డారు. ఇందులో కొంతమంది పెద్దల పేర్లు వినిపిస్తున్నాయని ఎవరి పాత్ర ఉందో భట్టి విక్రమార్క స్పందించాలని డిమాండ్ చేశారు. కేంద్రం రూ.3.13 ధర చెబితే.. నిన్నటికి నిన్న ఒక ఉన్నతాధికారి రూ.2.90 అని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? వెంటనే స్పందించి చర్యలు తీసుకోకపోతే ఈ వ్యవహారంలో ఉప ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉందని అనుకోవాల్సి వస్తుందన్నారు.
Also Read: హైదరాబాద్లో మారిన వాతావరణం.. రాబోయే కొన్ని గంటల్లో ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు!
అధికారుల పేర్లు త్వరలో బయటపెడతాం..
పాత్ర ఉన్న అధికారుల పేర్లు త్వరలో భయటపెడతామని స్పష్టం చేశారు. విద్యుత్ శాఖలో ఇంకో స్కాం కూడా ఉంది త్వరలోనే బయటపెడతామన్నారు. వడ్ల కొనుగోళ్లు పూర్తయ్యాయని ప్రకటించడం దుర్మార్గం.. మంత్రులు వస్తే చూపిస్తామన్నారు. మిగిలిన వడ్లు మొత్తం కొనుగోళ్లు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుభరోసా కింద ఇచ్చిన నిధుల కంటే.. ఆ పేరుతో పెట్టిన సభలకే ఎక్కువ ఖర్చు అయిందన్నారు. ప్రజలు తిరగబడతారు జాగ్రత్త అని హెచ్చరించారు. వానకాలం భరోసా ఇస్తామంటున్నారు… యాసంగి భరోసా మొత్తం అయిపోయిందా? రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా 30 వేల కోట్ల బకాయి ఉంది, మొత్తం బకాయిలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు.
బీజేపీ, హైబ్రిడ్ కాంగ్రెస్
అక్టోబర్ లో ఎన్నికలు పెట్టే ఉద్దేశంతో రైతుల్ని మళ్లీ మోసం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. బీజేపీ, హైబ్రిడ్ కాంగ్రెస్ ఒక్కటే అని నిన్న తేలిపోయిందన్నారు. జనసేన కార్యాలయం పేరిట ఒక డ్రామా పెట్టారు.. రావద్దని ఎవరు అన్నారు? కొత్తగా ఆఫీస్ పెట్టేదేమి ఉంది? అన్ని రాష్ట్రాల్లో జన సేన కార్యాలయం పెట్టినా అభ్యంతరం లేదన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు భాస్కర్ రావు ,గాదరి కిషోర్ కుమార్ ,బీ ఆర్ ఎస్ ప్రధాన కార్యదర్శి గాదరి బాలమల్లు ,బీ ఆర్ ఎస్ నేతలు చింతల వెంకటేశ్వర్ రెడ్డి ,కురువ విజయ్ కుమార్ ,పడాల సతీష్ పాల్గొన్నారు.