Bollywood Vs Tollywood: టాలీవుడ్లో సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి, తర్వాత బాలీవుడ్లో బలమైన గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను మరోసారి తన స్పష్టమైన అభిప్రాయాలతో వార్తల్లో నిలిచింది. ఎలాంటి భయం లేకుండా నిజాలు మాట్లాడే తాప్సీ, తాజాగా సినిమా ఇండస్ట్రీలోని పలు అంశాలపై ఓపెన్గా స్పందించింది.
సినిమాల్లో పాత్రలను ఎలా చూపిస్తారు అనే విషయంపై మాట్లాడుతూ, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాను ఆమె ప్రశంసించింది. ఈ సందర్భంగా తాప్సీ మాట్లాడుతూ, “అదే పాత్రను ఇంకొక దర్శకుడు చాలా హాస్యాస్పదంగా చూపించేవాడు. కానీ సందీప్ రెడ్డి వంగా ఆ పాత్రను చూపించిన విధానం మాత్రం నిజంగా మెచ్చుకోదగినది” అని చెప్పింది.
ఒక క్యారెక్టర్ను ఎలా ప్రెజెంట్ చేస్తారన్నది దర్శకుడి ఆలోచనపై ఆధారపడి ఉంటుందని ఆమె స్పష్టం చేసింది. దక్షిణాది సినిమాల్లో పాటలలో బొడ్డుపై ఎక్కువగా ఫోకస్ చేయడంపై కూడా తాప్సీ స్పందించింది. దీనిపై ఆమె మాట్లాడుతూ..“నాకూ అదే అర్థం కావడం లేదు. హిందీ సినిమాల్లో ఐటెం పాటల్లో బొడ్డుపై ఫోకస్ ఉండదని కాదు, కానీ దక్షిణాది సినిమాలంత ఎక్కువగా మాత్రం ఉండదు” అని చెప్పింది. ఈ వ్యాఖ్యలు మహిళల ప్రదర్శనపై మరోసారి చర్చకు దారితీశాయి.
ఇండస్ట్రీలో ఉన్నవాళ్లంతా చాలా గొప్పవాళ్లే అన్న భావన సరైంది కాదని కూడా తాప్సీ అభిప్రాయపడింది.“బాలీవుడ్లో ఉన్నవాళ్లంతా చాలా మర్యాదగా ఉంటారని మేమెప్పుడూ అనలేదు. సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాళ్లు కూడా స్వభావంలో సాధారణ మనుషుల్లాగే ఉంటారు” అని ఆమె స్పష్టంగా చెప్పింది.
అలాగే అవుట్సైడర్స్ ఎదుర్కొనే కష్టాల గురించి మాట్లాడుతూ,“ప్రతి సినిమాలో మేము మళ్లీ మళ్లీ మనల్ని మనమే నిరూపించుకోవాలి. ఇప్పుడు నువ్వు స్టార్ అయ్యావు, ఇక ఆనందించు అనే దశ మాకు ఉండదు. అవుట్సైడర్ వర్సెస్ అవుట్సైడర్ సమస్య కూడా ఇక్కడే ఉంది. మేము ఒకరికొకరు అంతగా సపోర్ట్ చేసుకోం” అని తెలిపింది.
నెపోటిజం అంశంపై స్పందిస్తూ, నటి ఆలియా భట్ నటించిన గంగూబాయి కాఠియావాడీ సినిమాను ఉదాహరణగా తీసుకుంది. “టాలెంట్ ఉంటే అవకాశాలు రావడంపై ఎవ్వరూ ప్రశ్నించరు. కానీ ఒకే వర్గానికి వరుసగా అవకాశాలు వస్తేనే అసలు సమస్య మొదలవుతుంది” అని తాప్సీ చెప్పింది.