Jananayagan: కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత సంక్రాంతి పండుగ సందర్భంగా పెద్ద ఎత్తున సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యాయి. అయితే కొన్ని సినిమాలు చివరి నిమిషంలో వాయిదా పడటంతో అభిమానులు ఎంతో నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ నుంచి విడుదలవుతున్న సినిమాలకు ఇలాంటి చేదు సంఘటనలు ఎదురవుతుండటం గమనార్హం. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నటుడు విజయ్ (Vijay)హెచ్ వినోద్ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం జన నాయగన్ (Jana Nayagan). ఈ సినిమా తెలుగులో జననాయకుడు అనే పేరుతో విడుదలకు సిద్ధమైంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఈ సినిమా జనవరి తొమ్మిదవ తేదీ విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో వాయిదా పడింది.
ఈ సినిమాకు సెన్సార్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలోనే విడుదల వాయిదా పడిందని తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం బుక్ మై షో లో భారీ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ సినిమా వాయిదా పడిందనే విషయం తెలియడంతో బుక్ మై షో తిరిగి టికెట్ డబ్బులను రిఫండ్ చేసింది. ఇలా రీ ఫండ్ విషయంలో బుక్ మై షో రికార్డు సృష్టించిందని తెలుస్తోంది. అడ్వాన్స్ రూపంలో బుక్ అయిన 4.5 లక్షల టికెట్ల డబ్బును తిరిగి రీఫండ్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు సినీ ఇండస్ట్రీలో ఈ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరిగి డబ్బును రిఫండ్ చేయడం ఇదే మొదటిసారి అని బుక్ మై షో వెల్లడించింది.
ఇలా టికెట్ల డబ్బులను రిఫండ్ చేయడమే కాకుండా ఈ సినిమా వాయిదా పడటంతో పెద్ద ఎత్తున నష్టాలు కూడా వచ్చాయని తెలుస్తోంది. ప్రమోషన్లు, థియేటర్ అగ్రిమెంట్ రూపంలో దాదాపు నిర్మాతలకు 50 కోట్ల రూపాయల వరకు నష్టాలు వాటిలినట్టు సమాచారం. ఇలా పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొంటూ సినిమా వాయిదా పడటంతో అభిమానులు ఎంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా తిరిగి జనవరి 14న లేదా 23వ తేదీ విడుదల కాబోతోంది అంటూ వార్తలు వినపడుతున్నాయి కానీ ఇప్పటివరకు నిర్మాతలు ఈ విషయంపై అధికారిక ప్రకటన వెల్లడించలేదు. త్వరలోనే ఈ సినిమా కొత్త విడుదల తేదీకి సంబంధించి ప్రకటన రాబోతున్నట్లు తెలుస్తుంది.
భగవంత్ కేసరి రీమేక్?
ఇక ఈ చిత్రాన్ని కేవీఎన్ ప్రొడక్షన్ బ్యానర్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా విజయ్ ఆఖరి సినిమా కావటం గమనార్హం. ఈయన రాజకీయాలలో కొనసాగుతున్న నేపథ్యంలో రాజకీయ వ్యవహారాలలో బిజీ కానున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాలకు దూరం కాబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా, మమిత బైజు విజయ్ కూతురి పాత్రలో నటించారు. ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ మంచి అంచనాలనే పెంచేసాయి అయితే ఈ సినిమా తెలుగులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన భగవంత్ కేసరి రీమేక్ సినిమా అనే తెలుస్తోంది. కానీ డైరెక్టర్ వినోద్ మాత్రం ఇది కేవలం విజయ్ సినిమా అని ఏ రీమేక్ కాదు అంటూ స్పష్టం చేశారు.
Also Read: Raakaasaa: నిహారిక రెండో సినిమా టైటిల్ .. రిలీజ్ డేట్ ప్రకటన!