Chitrapuri Colony Scam: చిత్రపురి కాలనీ కేసు విచారణ పూర్తయ్యింది. సినీ కార్మికులకు సొంత ఇళ్ల కలను నిజం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీలో ప్లాట్స్ కెటాయించిన సంగతి తెలిసిందే. ఈ ప్లాట్ల కెటాయింపులో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగనట్టు గతేడాది బట్టబయలైంది. దీంతో చిత్రపూరి కాలనీ కుంభకోణంపై సీఎం సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించారు. 2005 నుంచి 2020 వరకూ జరిగిన అవకతవకలపై కమిటీని నియమించారు. దీనిపై పూర్తి స్థాయిలో విచారించిన కమిటీ ఇందులో పెద్ద ఎత్తున్న అవకతవకలు జరిగినట్టు గుర్తించింది.
ఈ మేరకు నవంబర్ 27న ప్రభుత్వానికి నివేదిక అందజేసింది. అక్రమాలకు 15 మందిని బాధ్యులను చేస్తూ ఫైనల్ రిపోర్ట్ ఇచ్చింది. ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని వెల్లడిస్తూ రిపోర్టులో పేర్కొంది. ఈ కుంభకోణంలో 15 నుంచి 20 మంది వరకు టాలీవుడ్ పెద్దలు ఉన్నట్టు తమ రిపోర్టులో పేర్లతో సహా వెల్లడించింది. వారిలో ఇండస్ట్రీకి చెందిన తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరరావు, కాదంబరి కిరణ్ తదితరులు ఉన్నారు. అక్రమ నిర్మాణాలు, ప్లాట్ల కేటాయింపులో అవకతవకలు, లబ్ధిదారులకు అన్యాయం జరగడం ఈ కేసులో ప్రధాన ఆరోపణలు.
ఇప్పుడు ఈ కేసు విచారణ పూర్తయింది. వారందరిని కలిపి మొత్తం 15 నుంచి 21 మందిపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదయ్యాయి. పాత, ప్రస్తుత కమిటీ సభ్యుల పాత్ర ఉందంటూ నివేదికలో పేర్కొంది. కమిటీలో ఉంటూ నిధులు కాజేసిన పలువురు సినీ పెద్ద పాత్రపై రిపోర్ట్లో కీలక అంశాలు పొందుపరిచింది. ఈ నివేదికలో తమ్మారెడ్డి భరద్వాజ, పరుచూరి వెంకటేశ్వరావు, వినోద్ బాల, కొమర వెంకటేష్, కాదంబరి కిరణ్, బత్తుల రఘు, దేవినేని రహ్మానందం ,వల్లభనేని అనిల్తో పాటు పలువురి పేర్లు ఉన్నాయి. మొత్తం రూ. 43.78 కోట్లు రికవరి చేయాలని రిపోర్ట్లో పేర్కొన్నారు. అదనంగా 18 శాతం చెల్లించాలని ఆదేశించారు.
సినీ కార్మికుల కోసం కెటాయించిన ప్లాట్లను సినీ పెద్దలు షాపింగ్ కాంప్లెక్స్ కేటాయించిన్టుట విచారణ గుర్తించారు. ఇందుకోసం మొత్తం రూ. 80 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్టు గుర్తించారు. ఇందులో కొమర వెంకటేష్ రూ. 35 కోట్లు, వినోద్ బాల రూ. 18 కోట్లు, మహానందారెడ్డి రూ. 16 కోట్లు, అనిల్ రూ. 6 కోట్లు, పరుచూరి వెంకటేశ్వర్లు రూ. 4 కోట్లు, కాదంబరి కిరణ్ రూ. 7 కోట్లు, రఘు బత్తుల రూ. 8 లక్షలు, చంద్ర మధు రూ. 5 లక్షలు ఇలా ఒక్కొక్కరికి పంపకాలు జరిగినట్టు నివేదికలో కమిటీ వెల్లడించింది. గతంలో మణికొండలోని సర్వే నం. 246/1లో 67.16 ఎకరాల స్థలాన్ని తెలుగు సినీకార్మికుల సహకార హౌసింగ్ సొసైటీకి ప్రభుత్వం కేటాయించింది. గజానికి రూ. 40 చొప్పున ప్రభుత్వం స్థలాన్ని కేటాయించింది.
ఏంటి చిత్రపురి కాలనీ కేసు?
2002లోసభ్యత్వ ప్రక్రియ ప్రారంభించిన సోసైటీ.. ఆర్థిక స్థితిగతులను బట్టి మూడు విభాగాల్లో ఇల్లు నిర్మించాలని నిర్ణయించారు. ఇప్పటి వరకు మొత్తం 4300 మంది సభ్యులుగా ఈ సోసైటీలో చేరారు. అయితే తక్కువ ధరకు వచ్చిన భూమి.. కాలక్రమంలో ఐటీ కారిడార్ కావడం.. గజం ధర రూ. లక్షల్లో పలకడంతో అక్రమాలు మొదలయ్యాయి. సొసైటీలో సభ్యులకు ఫ్లాటు కేటాయింపునకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్, సహకార శాఖ, ప్రజా సంబంధాల శాఖ కమిషనర్లు, ఇద్దరు సినీ ప్రముఖులతో కూడిన కమిటీ సంతకాలుండాలి. 2010, 2012, 2015లో ఆరుదశల్లో 4213 ఫ్లాట్ల కేటాయింపు పూర్తయింది. భూముల ధరలకు రెక్కలు రావడంతో కమిటీ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేస్తూ అనర్హులకు ఫ్లాట్లు కేటాయించినట్లు ఆరోపణలున్నాయి. 4213 ఫ్లాట్లకు 9153 మందిని సొసైటీలో సభ్యులుగా చేర్పించడం గమనార్హం. రాజకీయ నేతల సూచనలతో అనర్హులను చేర్పించినట్లు కమిటీ విచారణలో తేలింది.