Idly Kottu:కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా అయినా డైరెక్టర్ గా అయినా ధనుష్ దిగనంతవరకే.. ఒక్కసారి రంగంలోకి దిగాడు అంటే కచ్చితంగా ప్రేక్షకులను అలరించకుండా అయితే ఉండడు. ఈ ఏడాది ధనుష్ తెరకెక్కించిన సినిమాలు కానీ, నటించిన సినిమాలు కానీ మంచి విజయాలను అందుకున్నాయి. ఇప్పటివరకు ధనుష్ నాలుగు సినిమాలకు దర్శకత్వం వహించాడు. ఈ మధ్యనే ధనుష్ దర్శకత్వం వహించిన నాలుగో సినిమా ఇడ్లీ కొట్టు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకో లేకపోయినా తమిళ్లో ధనుష్ మంచి విజయాన్ని అందించింది.
ఇక ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యమీనన్ హీరోయిన్ గా నటించగా అరుణ్ విజయ్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 1 న రిలీజ్ అయిన ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ బాటపడుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆ తరుణం రానే వచ్చింది. ఇడ్లీ కొట్టు సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమయింది.
ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. నేటి నుంచి ఇడ్లీ కొట్టు నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ భాషల్లో కూడా ఇడ్లీ కొట్టు స్ట్రీమింగ్ అవుతున్నట్లు మేకర్స్ తెలిపారు. ఇక సినిమా కథ విషయానికొస్తే శివకేశవులు(రాజ్ కిరణ్) తన సొంత ఊరైన శంకరాపురంలో ఒక చిన్న ఇడ్లీ కొట్టు నడుపుతూ జీవనం సాగించేవాడు. అతనికి ఆ కొట్టు అంటే ఎంతో ప్రాణం. ఇక తనలాగే తన కొడుకు ఉండాలని శివకేశవులు కోరుకునేవాడు. అందుకు తగ్గట్టే కొడుకు మురళి (ధనుష్) తండ్రి కలలను కొనసాగించాలని హోటల్ మేనేజ్మెంట్ చదివి విదేశాల్లో పెద్ద ఉద్యోగం సంపాదిస్తాడు.
అయితే బ్యాంకాక్ లో పనిచేసే సమయంలో తన కంపెనీ అధినేత (సత్యరాజ్ ) కూతురు మీరా(షాలిని పాండే)తో ప్రేమలో పడతాడు. త్వరలోనే పెళ్లి అనుకుంటున్న సమయంలో తండ్రి చనిపోవడంతో సొంత ఊరికి చేరుకుంటాడు. తండ్రి మరణం తరువాత మురళిలో వచ్చిన మార్పులు ఏంటి.. ? మురళి తన తండ్రి కలను నెరవేర్చాలని ఎందుకు అనుకుంటాడు..? మురళి చివరికి మీరాను పెళ్లి చేసుకుంటాడా..? లేదా..? అసలు మధ్యలో ఈ కళ్యాణి( నిత్యా మీనన్) ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. కుటుంబాలు, భావోద్వేగాలు, తండ్రి కొడుకుల మధ్య అనుబంధాలు లాంటి ఎన్నో విషయాలను ఈ సినిమాలో ధనుష్ చూపించాడు. మరి థియేటర్లో మంచి పేరు తెచ్చుకున్న ఇడ్లీ కొట్టు ఓటీటీలో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.