Dhanush: ధనుష్ (Dhanush).. ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ధనుష్ ఈమధ్య ఎక్కువగా బైలింగ్వల్ చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇటీవలే ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల(Sekhar kammula) దర్శకత్వంలో ‘కుబేర’ సినిమా చేసి మంచి విజయాన్ని అందుకున్న ఈయన ఇప్పుడు స్వీయ దర్శకత్వంలో ‘ఇడ్లీ కడై’ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.. దీనిని తెలుగులో ‘ఇడ్లీ కొట్టు’ అంటూ విడుదల చేయబోతున్నారు. బైలింగ్వల్ గా ఒకేసారి అక్టోబర్ 1న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో జోరుగా పాల్గొంటూ సినిమా గురించి, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు విషయాల గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు.
అందులో భాగంగానే ఇటీవల జరిగిన ఇడ్లీ కొట్టు సినిమా ఈవెంట్లో హీరో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఎంతలా ట్రోల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. తన చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి మాత్రమే ఇడ్లీ తినే వాళ్ళమని.. నిజానికి ఇడ్లీ కొనుక్కోవడానికి కూడా అప్పుడు డబ్బులు లేవని, అంత పేదరికం అనుభవించామని కానీ.. ఇప్పుడు స్టార్ హోటల్స్ లో ఇడ్లీ తింటున్నా.. ఆ రుచి రావడం లేదు అంటూ ధనుష్ తెలిపారు . దీంతో చాలామంది ఆయనపై విమర్శలు గుప్పించారు. ధనుష్ సింపతి కోసం కావాలని ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాడు అంటూ ట్రోల్స్ చేశారు.
ట్రోలర్స్ కి ధనుష్ గట్టి కౌంటర్..
అయితే ఇప్పుడు ఈ ట్రోల్స్ ధనుష్ వరకు చేరడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ట్రోల్స్ చేసే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు.. ధనుష్ మాట్లాడుతూ.. “నేను మాట్లాడిన స్పీచ్ మీరు పూర్తిగా విన్నారా?.. 1983లో నేను పుట్టాను.. 1991లో మా నాన్న దర్శకుడయ్యారు. ఎనిమిదేళ్లపాటు మేము పేదరికంలోనే ఉన్నాము. 1995లోనే మా కుటుంబం కాస్త మెరుగుపడింది. డబ్బులు మా చేతికి వచ్చాయి. అందుకే ఏదైనా పని చేసి వచ్చిన డబ్బుతోనే నేను ఇడ్లీ కొనుక్కునే వాడిని..పూర్తిగా వినకుండా ఎలా ట్రోల్స్ చేస్తారు? అంటూ ప్రశ్నించారు.
ఇడ్లీ కొట్టు కథపై ధనుష్ కామెంట్స్..
అంతేకాదు”ఇడ్లీ కొట్టు సినిమా ఒక ప్రముఖ చెఫ్ బయోపిక్ అని కూడా చాలామంది అనుకుంటున్నారు. అందులో నిజం లేదు. ఇది ఎవరి బయోపిక్ కూడా కాదు. నేను నా బాల్యంలో ఎదుర్కొన్న అనుభవాలను ఇప్పుడు తెరపై చూపిస్తున్నాను” అంటూ ధనుష్ తెలిపారు. ప్రస్తుతం ధనుష్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా తనపై వస్తున్న ట్రోల్స్ కి భారీ కౌంటర్ ఇచ్చారు ధనుష్. మరి ఇకనైనా ఈ ట్రోల్స్ ఆగుతాయేమో చూడాలి.
ALSO READ:Manchu Manoj: నా బయోపిక్ ఆయనే ఎందుకు తీయాలంటే.. కోరిక బయటపెట్టిన మనోజ్!
ధనుష్ ఇడ్లీ కొట్టు సినిమా విశేషాలు..
నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ధనుష్ హీరోగా నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న రెండవ సినిమా కావడంతో ఒక మేరకు అంచనాలు కూడా ఏర్పడ్డాయి. వాస్తవానికి వీరిద్దరి కాంబినేషన్లో తిరు సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. మరి ఇడ్లీ కొట్టు సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.