Director Vikram Bhatt Arrested: ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ విక్రమ్ భట్ అరెస్ట్ అయ్యారు. రూ. 30 కోట్ల చీటింగ్ కేసులో ఆయన, ఆయన భార్య శ్వేతాంబరి భట్ను రాజస్థాన్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బయోపిక్ సినిమా తీస్తామంటూ ఉదయ్ పూర్లోని ఓ డాక్టర్ వద్ద సుమారు రూ. 30 కోట్ల తీసుకుని మోసం చేశారు. దీంతో అతడు పోలీసులను ఆశ్రయించారు. విక్రమ్ భట్ ఆయన భార్య శ్వేతాంబరి భట్ మోసానికి పాల్పడినట్లు ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన రాజస్థాన్ పోలీసులు తాజాగా ముంబైలోకి వారిని అదుపులోకి తీసుకున్నారు.
అనంతరం తదుపరి విచారణ కోసం ఉదయ్పూర్కు తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం.. ఉదయ్పూర్లో పేరున్న ఐవీఎఫ్ హాస్పిటల్ వ్యవస్థాపకుడు, డాక్టర్ అజయ్ ముర్దియా అతడి దివంగత భార్య జీవిత చరిత్ర ఆధారంగా ఒక బయోపిక్ తీస్తామని, ఆ సినిమా బ్లాక్బస్టర్ అవుతుందని నమ్మించి వారి వద్ద నుంచి రూ. 30 కోట్లు తీసుకున్నట్లు డాక్టర్ అజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సినిమా నిర్మాణం అనుకున్న విధంగా సాగకపోవడం.. లాభాల విషయంలో క్లారిటీ లేకపోవడంతో తాను మోసపోయానని భావించిన డాక్టర్ ముర్దియా ఉదయ్పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Also Read: Director Sandeep Raj: డైరెక్టర్ అవ్వడమే నా పాపమా.. మోగ్లీ డైరెక్టర్ ఎమోషనల్
ఇక ముర్దియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఉదయ్పూర్ పోలీసులు ప్రత్యేక బృందాలను ముంబైకి పంపించి విక్రమ్ భట్, శ్వేతాంబరి భట్లను అరెస్టు చేశారు. వారిని స్థానిక కోర్టులో హాజరుపరిచి విచారణ నిమిత్తం ట్రాన్సిట్ రిమాండ్పై ఉదయ్పూర్కు తరలించేందుకు అనుమతి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని ఉదయ్ పూర్కి తీసుకువెళ్తున్నట్టు సమాచారం. కాగా ఈ కేసులో పోలీసులు దాదాపు 7 రోజుల కస్టడీని కోరగా కోర్టు అనుమతి ఇచ్చింది. అయితే ఈ ఆరోపణలను డైరెక్టర్ విక్రమ్ కొట్టిపారేస్తున్నారు. ఈ కేసు పూర్తిగా నిరాధారమని, ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించేలా ఎఫ్ఐఆర్ దాఖలు చేశారని ఆయన ఆరోపించారు. సినిమా నిర్మాణాన్ని మధ్యలో ఆపివేసింది డాక్టర్ ముర్దియానే అని తెలిపారు. దీంతో సినిమా కోసం పని చేసిన టెక్నీషియన్లు, కార్మికులకు చెల్లించాల్సిన సుమారు రూ. 25 కోట్లకు పైగా డబ్బును ఎగ్గొట్టేందుకు డాక్టర్ తప్పుడు కేసులు పెట్టారంటూ తీవ్రంగా ఖండించారు. పరువు నష్టం కలిగించే ఉద్దేశంతోనే ఆయన ఈ తప్పుడు కేసు పెట్టారు అని విక్రమ్ భట్ తరపు న్యాయవాది తెలిపారు.