Durandhar 2: టాలీవుడ్ ప్రస్తుతం ‘పాన్ ఇండియా’ అనే మోజులో పడి అసలైన సినిమా సూత్రాన్ని మర్చిపోతోందా? భారీ బడ్జెట్లు, ఏళ్ల తరబడి షూటింగులు, ఆకాశాన్ని తాకే టికెట్ ధరలు ఉంటేనే రికార్డులు వస్తాయా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెబుతూ, మన తెలుగు హీరోలను, నిర్మాతలను గట్టిగా ఆలోచనలో పడేసింది ‘ధురంధర్’. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి, బాక్సాఫీస్ వద్ద రూ. 1400 కోట్లు కొల్లగొట్టడమే కాకుండా, మన ‘పుష్ప 2’, ‘బాహుబలి’ వంటి భారీ ప్రాజెక్టుల రికార్డులను కూడా ఈ సినిమా తుడిచిపెట్టేసింది.
3 నెలల్లోనే సీక్వెల్.. మనవాళ్లకు ఇది సాధ్యమేనా?
‘బాహుబలి’కి, ‘పుష్ప’కి పార్ట్-2 రావడానికి మూడేళ్ల సమయం పట్టింది. గ్రాఫిక్స్ ఉన్నా లేకపోయినా, మన దగ్గర సీక్వెల్ అంటే ఒక దశాబ్ద కాలం వెయిట్ చేయాల్సిందే అన్నట్టుగా పరిస్థితి తయారైంది. కానీ ‘ధురంధర్’ మేకర్స్ పక్కా ప్లానింగ్తో రెండు పార్టుల షూటింగ్ను ఒకేసారి ముగించి, కేవలం 3 నెలల గ్యాప్లోనే పార్ట్-2 ని థియేటర్లలోకి తెచ్చారు. ‘సలార్’, ‘కల్కి’, ‘దేవర’ వంటి సినిమాల సీక్వెల్స్ ఎప్పుడు వస్తాయో తెలియని అయోమయంలో ఉన్న టాలీవుడ్కి ఇది ఒక చెంపపెట్టు లాంటి ప్లానింగ్.
కంటెంట్ ఉంటే ‘కరెక్షన్స్’ ఎందుకు?
‘పుష్ప’ ఫస్ట్ పార్ట్ హిట్ అవ్వగానే, సెకండ్ పార్ట్ కథను మార్చేసి, షూట్ చేసిన సీన్లను ఎడిటింగ్లో లేపేసి నానా హడావుడి చేశారు మన మేకర్స్. కానీ ‘ధురంధర్’ డైరెక్టర్ ఆదిత్య ధార్ తన కథను మాత్రమే నమ్మారు. ఫస్ట్ పార్ట్కు భారీ వసూళ్లు వచ్చాయని అనవసరపు హంగులు, హీరో ఎలివేషన్లు జోడించకుండా, తాను అనుకున్న రియలిస్టిక్ కథనే తెరకెక్కించారు. అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
రూ. 150 టికెట్ తో రూ. 1400 కోట్లా?
టాలీవుడ్ హీరోలు ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు కోసం ప్రభుత్వాల చుట్టూ తిరుగుతున్నారు. రూ. 400 పెడితేనే బడ్జెట్ రికవరీ అవుతుందని వాదిస్తున్నారు. కానీ ‘ధురంధర్’ కేవలం రూ. 150 టికెట్ ధరతోనే రూ. 1400 కోట్లు వసూలు చేయవచ్చని నిరూపించింది. పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ వంటి లోకల్ సినిమాలకు కూడా రూ. 300 రేట్లు అడుగుతున్న తరుణంలో, పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సీక్వెల్ సామాన్యుడికి అందుబాటు ధరలో రావడం గమనార్హం. రిలీజ్కు 10 రోజుల ముందే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసి మేకర్స్ తమ కాన్ఫిడెన్స్ను చాటుకున్నారు.
ఓవర్ ప్రమోషన్లు.. లాస్ట్ మినిట్ జిమ్మిక్కులు లేవు!
మన దగ్గర చిన్న టీజర్ వస్తుందన్నా సోషల్ మీడియాలో నెల రోజుల ముందు నుంచే బిల్డప్ ఇస్తారు. మళ్ళీ ఆ చెప్పిన టైమ్కి రాకుండా ‘అనివార్య కారణాల వల్ల ఆలస్యం’ అంటూ ఫ్యాన్స్ సహనానికి పరీక్ష పెడతారు. ప్రభాస్, ఎన్టీఆర్, చరణ్ వంటి స్టార్ హీరోల సినిమాల విషయంలో ఇది కామన్గా మారింది. కానీ ‘ధురంధర్’ టీమ్ ఇలాంటి జిమ్మిక్కులు ఏవీ చేయలేదు. చెప్పిన టైమ్కు టీజర్ ఇచ్చారు, చెప్పినట్టుగానే సినిమాను రిలీజ్ చేశారు.
హీరో కంటే కథకే పెద్దపీట!
‘ధురంధర్’ మూవీలో హీరో రణ్వీర్ సింగ్ అయినా, విలన్ అక్షయ్ ఖన్నా పాత్రకు సమానమైన ప్రాధాన్యత ఇచ్చారు. మన దగ్గరైతే హీరో ఫ్యాన్స్ ఫీల్ అవుతారని విలన్ సీన్లు లేపేస్తారు. కానీ ఇక్కడ దర్శకుడు ఫ్యాన్స్ కోసం కాకుండా కథ కోసం సినిమా తీసిన ఆదిత్య ధర్ ని మెచ్చుకోకుండా ఉండలేం. మరి ‘ధురంధర్’ చూపించిన ఈ దారిలో మన టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు నడుస్తారా? లేక ఇంకా ‘పాన్ ఇండియా’ మాయలో పడి టైమ్, మనీ వేస్ట్ చేస్తూనే ఉంటారా? చూడాలి!
also read: మెగాస్టార్కు ‘ఎన్టీఆర్’ అవార్డ్ రావడంపై రామ్ చరణ్ ఎమోషనల్ పోస్ట్..